27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నిజాయితీలో ముంబయికి రెండో స్థానం: ఫిన్‌లాండ్‌ రాజధాని టాప్!



ప్రపంచ అవినీతి సూచికలో భారత్‌ తరచుగా ముందువరసలో ఉంటుంది, అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన ఓ ప్రయోగం దానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. ప్రపంచంలోని నిజాయితీ నగరాలను పరీక్షంచేందుకు ఒక ప్రయోగం చేశారు.

అదెలాగంటే రూ.3000 ఉన్న 12 పర్సులను రద్దీగా ఉన్న ప్రదేశాల్లో, షాపింగ్‌ మాల్స్‌, ఫుట్‌పాత్‌లు, పార్కుల్లో పడవేశారు. పర్సులో యజమాని ఫోన్‌ నెంబర్‌, చిరునామా, ఫొటో కూడా ఉంచారు. ఇలా నాలుగు ఖండాల్లోని 16 నగరాల్లో 192 పర్సులను రోడ్డుపై పడవేశారు. పర్సు దొరికిన ఎంత మంది తిరిగిస్తారో పరీక్షించారు.

ముంబైలో 12 పర్సులకు గాను 9 పర్సులు ప్రయోగం చేసిన వారికి అందాయి. అలా నిజాయితీ నగరాల జాబితాలో ముంబయి రెండో స్థానం పొందింది. ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకీ జాబితాలో మొదటి స్థానం పొందింది. హెల్సింకీలో 12 పర్సులకు గాను 11 పర్సులు ప్రయోగం చేసిన వారికి అందాయి.

జాబితాలో ఆఖరు స్థానం పొందిన పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో ఒక పర్సు మాత్రమే వెనక్కి వచ్చింది, అది కూడా అక్కడికి నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన పర్యాటకులు ఇచ్చినట్లు తేలింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి