20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

టీ నోట్ అందింది


9/20/2013 3:19:10 AM
ధ్రువీకరించిన హోం మంత్రి నేడు పరిశీలిస్తానని వెల్లడి
- తెలంగాణపై నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం
- ఏపీలో మూడు ప్రాంతాలకూ వస్తాం
- వార్‌రూమ్ భేటీ అనంతరం దిగ్విజయ్
- నేటి కేబినెట్, కోర్ కమిటీలకు టీ నోట్?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేబినెట్‌కు అందించనున్న ముసాయిదా నోట్ తన చేతికి వచ్చిందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ధ్రువీకరించారు. గురువారం తన కార్యాలయమైన నార్త్‌బ్లాక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ‘గత పదిరోజులుగా నేను తీరిక లేకుండా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన డ్రాప్టు నోట్ నాకు అందింది. దాన్ని ఈ రోజు (గురువారం) పరిశీలిస్తాను’ అని తెలిపారు. హైదరాబాద్ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని షిండే స్పష్టం చేశారు. శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్ చర్చకు వచ్చే విషయాన్ని ఆయన ధ్రువీకరించలేదు. పీటీఐ వార్తా సంస్థతో సాయంత్రం విడిగా మాట్లాడిన షిండే.. టీ నోట్ శుక్రవారం పరిశీలిస్తానని తెలిపారు. కాగా.. సీమాంధ్ర ఎంపీలు,
gunduకేంద్ర మంత్రులతో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఆంటోనీ కమిటీ గురువారంరాత్రి భేటీ జరిపింది. అనంతరం విలేకరులతో మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్.. నిర్దిష్ట కాలపరిమితిలో తెలంగాణ ఏర్పాటుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చి ఆంటోనీ కమిటీకి వాదనలు వినిపించడానికి తెలంగాణ, సీమాంధ్ర నాయకులకు ఇబ్బందులు ఉంటే తామే వెళ్లి కలుస్తామన్నారు. ఆంటోనీ రాకపోయినా తాను ఏపీలోని అన్ని ప్రాంతాలకు వస్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా..

హోంశాఖ అధికారులు తయారుచేసిన నోట్‌పై రాజకీయ ఆమోదముద్ర కోసం దానిని శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశానికి హోం మంత్రి షిండే అందిస్తారని తెలుస్తోంది. కేబినెట్ ముందుకు రావడానికి అవసరమైన పక్రియకు కొంత సమయం పడుతుందని, కనుక టీ నోట్ శుక్రవారం నాటి కేబినెట్ ముందుకు వచ్చేందుకు అవకాశాలు లేవని హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా కేబినెట్‌కు ముందే ఎజెండా సిద్ధమవుతుందని, కానీ.. చివరి నిమిషంలో అజెండాలో తెలంగాణ అంశాన్ని చేర్చే అవకాశాలు లేకపోలేదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నెల 25 నుంచి అమెరికా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో నెలాఖరుదాకా కేబినెట్ సమావేశం జరిగే పరిస్థితి లేదని, కనుక శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో టీ నోట్‌ను చర్చకు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు అంటున్నాయి.

ఆంటోనీ కమిటీ నివేదికతో సంబంధం లేకుండానే తెలంగాణ ఏర్పాటు విషయంలో యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు కదులుతోందన్న సంకేతాలు షిండే ఇచ్చారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో మకాం వేసి ఉన్న సీమాంధ్ర ఎంపీలకు, కేంద్ర మంత్రులు కూడా షిండే వ్యాఖ్యలతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం అంతా ఒక ఎంపీ నివాసంలో సుదీర్ఘ మంతనాలు సాగించి.. చివరకు తమ రాజీనామాలు ఆమోదించుకునేందుకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరగా.. ఆమె 24న ఉదయం 11.30 తనను తన కార్యాలయంలో కలవాల్సిందిగా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి కాంగ్రెస్ వార్‌రూమ్ భేటీ అనంతరం సీమాంధ్ర నేతలకు మరోషాక్ తగిలింది. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విలేకరులకు తేల్చి చెప్పారు. ‘దురదృష్టవశాత్తూ ఆంటోనీ ఆస్పవూతిలో ఉన్నారు. ఆయన కోలుకున్న వెంటనే భవిష్యత్ కార్యాచరణ ప్రారంభిస్తాం. ఆంటోనీ కమిటీ తరుఫున నేను, వీరప్పమొయిలీ ఆంధ్రవూపదేశ్ పర్యటన చేపడుతాం. బిజీగా ఉండడం వలన ఆంటోనీ, అహ్మద్‌ప ఈ పర్యటనకు రాకపోవచ్చు.

ఢిల్లీకి రాలేని వాళ్లు, ఆంటోనీ కమిటీని కలవాలని కోరుకునే మిత్రులు మమ్మల్ని అక్కడ కలుసుకోవచ్చు. అక్కడ మేము సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో పర్యటిస్తాం. ఇరు ప్రాంతాల నేతలతో భేటీ అవుతాం. పీసీసీ చీఫ్, సీఎంలతోపాటు సీమాంధ్ర, తెలంగాణ నేతల, ప్రజల వాణిని వింటాం’ అని స్పష్టం చేశారు. తెలంగాణ నిర్ణయం జులై 30న మీరు ప్రకటించినట్లే జరుగుతుందా? నిర్దేశిత కాల వ్యవధి ప్రకారమే ప్రక్రియ పూర్తవుతుందా? అనే ప్రశ్నకు ‘కచ్చితంగా. మేం అదే ప్రకటనకు కట్టుబడి ఉన్నాం’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. దిగ్విజయ్ ఇంత విస్పష్టంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. అంతకు ముందు సీమాంధ్ర నాయకులు తమకు వచ్చినట్లుగా చెప్పిన హామీలు నమ్మశక్యంగా కనిపించడం లేదని పలువురు అంటున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఆగే ప్రసక్తి ఉండబోదని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం అందరి మాటలను వింటూనే.. తన పని తాను చేసుకుపోతున్నట్లుగా అర్థమవుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి