14, నవంబర్ 2011, సోమవారం

లిక్కర్ రారాజుకి కష్టాలట! కేంద్రం బెయిలౌట్ ఇచ్చి ఆదుకుంటుందట!!





విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్ విమానాలుప్రజలకి కష్టాలొచ్చినపుడు ఆదుకోవాలనీ, వారికి బెయిలౌట్ ఇవ్వాలనీ ప్రభుత్వాలు భావించిన దృష్టాంతాలు చరిత్రలో దుర్భిణీ వేసినా వెతకినా కనపడవు. కాని జనాలకి మద్యం తాగబోసి, తెగమేసిన సొమ్ముల్ని బొక్కసంలో కుక్కుకుని, తమ మరో కంపెనీ ‘కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్’ కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్న లిక్కర్ రారాజు విజయ్ మాల్యాకు బెయిలౌట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. ఐ.పి.ఎల్ ఫ్రాంచైజి ల్లో ఒకటయిన పంజాబ్ సూపర్ కింగ్స్ కి సొంతదారు కూడా అయిన విజయ్ మాల్యా తన విమానయాన కంపెనీ నష్టాలను భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
గత కొన్ని వారాలుగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్ధ వరుసగా తన విమాన సర్వీసులను రద్దు చేసుకుంటోంది. దానివల్ల టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా లెక్క చేయకుండా సర్వీసుల్ని రద్దు చేసుకుంటోంది. దానిక్కారణం ఆ సంస్ధ ఎదుర్కొంటున్న నష్టాలేనట. రన్నింగ్ లో ఉన్న సర్వీసుల్ని రద్దు చేసుకోవడంతో పాటు అసలు మొత్తంగా సర్వీసుల్ని కూడా రద్దు చేసుకుంటోంది. దానితో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్ధకు విమానాల్ని అద్దెకు ఇచ్చిన విమాన కంపెనీలు తమ విమానాల్ని తమకు ఇచ్చేయ్యమని అడుగుతున్నాయట. పైలట్లు, ఇతర ఉద్యోగులు కింగ్ ఫిషర్ మునిగి పోతున్న పడవ అని భావించి సంస్ధను వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారట. అలా వెళ్ళిపోవడం మామూలేనని విజయ్ మాల్యా నచ్చజెపుతున్నా పరిస్ధితి ఘోరంగా ఉందని రాయిటర్స్ లాంటి కంపెనీల ఫ్రెండ్లీ వార్తా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి.
కింగ్ ఫిషర్ కంపెనీ నష్టాల్లోనుండి బైటికి రావాలంటే దానికి మరింత సొమ్ము కావాలని గతంలోనే ఆడిటర్లు హెచ్చరించారని రాయిటర్స్ తెలిపింది. విమాన సర్వీసుల్ని అదేపనిగా రద్దు చేస్తుండడంతో కంపెనీ షేర్లు ఈ సంవత్సరం ఇప్పటికే 67 శాతం పడిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. కంపెనీ ఇప్పటికె విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందనీ, ఆ అప్పును రీ షెడ్యూల్ లాంటిదేదో చెయ్యాలని కంపెనీల మిత్రులు, స్వేచ్ఛా మార్కెట్ పండితులు పరోక్షంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. త్వరగా ఆదుకోకపోతే కంపెనీ కోలుకోవడం కష్టమని కూడా వీళ్ళు తొందరపెడుతున్నారు.
కోటీశ్వరుడు విజయ్ మాల్యాకు ఇన్ని కష్టాలా అని కేంద్ర మంత్రులు ఇప్పటికే చలించిపోయారు. సివిల్ ఏవియేషన్ మంత్రి వాయలార్ రవి తాను ఆర్ధిక మంత్రితో మాట్లాడి ఏదో ఒకటి మేలు చేసి పెడతానని వాగ్దానం చేశాడు. బ్యాంకుల ద్వారా కింగ్ ఫిషర్ కంపెనీకి సహాయం అందజేయడానికి ఆర్ధిక మంత్రిని ఒప్పించే బాధ్యతను ఆయన నెత్తిన వేసుకున్నాడు. కంపెనీ అప్పు ని పునర్మూల్యాంకనం చెయ్యడంలో ఆటంకాలు ఎదురవుతుండడం వలన ఆర్ధిక మంత్రితో మాట్లాడమని తాను ఇప్పటికే విజయ్ మాల్యాకు చెప్పానని కూడా ఆయన చెబుతున్నాడు.
కింగ్ ఫిషర్ సంస్ధకు 60 బిలియన్ రూపాయలు (రు.6000 కోట్లు) అప్పు ఉందని తెలుస్తోంది. ఈ అప్పులో పెద్ద మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులే ఇచ్చాయని తెలుస్తోంది. గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వ, ప్రవేటు బ్యాంకులు రెండూ ఒక విడత కింగ్‌ఫిషర్ కి అప్పుల విషయంలో సహాయం చేశాయి. 12 బిలియన్ రూపాయలు లేదా  రు.1200 కోట్ల రూపాయల అప్పుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు రెండూ అప్పుగా రద్దు చేసుకుని ఈక్విటీ షేర్లు కింద మార్చుకున్నాయట.అంటే బ్యాంకులకు అప్పు ఉన్నంతమేరకు కింగ్ ఫిషర్ షేర్లను బ్యాంకుల ఖాతాకు కంపెనీ మార్చిందన్నమాట. ఇప్పుడిక వడ్డీ చెల్లింపుల బదులు షేర్లపైన లాభాలని వడ్డీ చెల్లింపులుగా బ్యాంకులు భావించాలన్నమాట.
ఇది బ్యాంకులకి నిజానికి నష్టం తెచ్చే చర్య. ఎందుకంటే అప్పు పైన వడ్డీ అనేది ఖచ్చితంగా వసూలవుతుంది. కాని అదే సొమ్ముని కింగ్ ఫిషర్ కంపెనీలో ఈక్విటీల కిందికి మార్చినపుడు ఆ ఈక్విటీలపైన లాభాలు వస్తేనే బ్యాంకులకు ఉపయోగం. ఈక్విటీలపైన లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువే. కింగ్ ఫిషర్ షేర్ ధర ఈ సంవత్సరం 67 శాతం పడిపోయింది. కనుక బ్యాంకుల అప్పులు షేర్ల కిందికి మార్చినందుకు గాను వాటికి వడ్డీ దక్కకపోగా, అసలు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఒకవేళ లాభాలు వచ్చినా అవి వడ్డీ రేటుకి సరిపోయినంత లేకపోవచ్చు. 2005 సం. నుండి నష్టాలు తప్ప కింగ్‌ఫిషర్ కి లాభాలే లేవని రాయిటర్స్ సంస్ద చెప్పుకొచ్చింది. అటువంటి కంపెనీ షేర్లు బ్యాంకులు అప్పుల స్ధానంలో కొనుగోలు చేయడం వలన లాభపడింది విజయ్ మాల్యా యే కాని బ్యాంకులు కాదు.
ప్రభుత్వరంగ బ్యాంకులంటే కేంద్ర మంత్రులకు వారి జేబు సంస్ధలే. ప్రజలనుండి డిపాజిట్లు సేకరించి ఆ సొమ్ముని విజయ్ మాల్యాలాంటి బిలియనీర్లకి అప్పులుగా ఇప్పించడానికి మంత్రులు, ప్రభుత్వాలు ఇష్టపడతాయి కాని సామాన్య జనానికి అప్పులిచ్చి ఆదుకోవడానికి సుతరామూ ఇష్టపడవు. కంపెనీలపైనా, వాటి యజమానులైన మిలియనీర్లు, బిలియనీర్లపైనా ఉన్నంత ప్రేమ భారత పాలకులకు భారత ప్రజలపైన లేదని వారి అరవై ఏళ్ల పాలన చెబుతోంది. దానికి ఈ విజయ్ మాల్యా వ్యవహారం తాజా తార్కాణం.
దేశానికి అన్నం పెట్టే రైతు ప్రకృతి వైపరీత్యాల వల్లనో, తెగుళ్ళు సోకడం వల్లనో, గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వల్లనో ఆదాయం లేక అప్పు చెల్లించలేకపోతే, అది మాఫీ చేయడానికి సవా లక్ష కారణాలు రంగం మీదికి వస్తాయి. అయ్యో బడ్జేట్ లోటు పెరిగిపోతుంది అని అహ్లూవాలియా పరుగెత్తుకొస్తాడు. ‘ఎగుమతిదారులకి, దిగుమతిదారులకి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది, రైతులకిస్తే మరి వారికో’ అంటూ వాణిజ్యమంత్రి ఆనంద్ శర్మ ‘అబ్జెక్షన్’ అని అరుస్తాడు. రైతుల రుణాలు మాఫీ చెస్తే బ్యాంకుల లిక్విడిటీ దెబ్బతింటుందనీ, బ్యాంకుల్లో పెట్టుబడులు తగ్గిపోతాయనీ ఆర్.బి.ఐ గవర్నర్ చెవి మెలి పెట్టవచ్చు. ఇక ప్రధాని మన్మోహన్ అయితే “ఇక్కడేమన్నా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా?” అని బ్రహ్మాస్త్రం లెవెల్లో ప్రశ్నల బాణాలు సంధిస్తాడు.
వీళ్లంతా ఇప్పుడు విజయ్ మాల్యాకి అప్పుల భారం దిగిపోయేలా బెయిలౌట్ మంజూరు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ధనికులకు, కంపెనీలకి బెయిలౌట్లు ఇవ్వడం భారత ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కాకపోతే అలా బెయిలౌట్ ఇచ్చాక అందులో కమిషన్ దగ్గరే ఏమన్నా ఉంటే  పేచి వస్తుంది. వాయిలార్ రవి కింగ్ ఫిషర్ కి సహాయం చెయ్యమని ఆర్ధిక మంత్రికి సిఫారసు చేస్తానని చెప్పిన తర్వాత బి.జె.పి అగ్ర నాయకుడు అలా ఇవ్వడం నాకు ఇష్టం లేదని ప్రకటన ఇచ్చాడు. నిజానికాయన రధ యాత్రలో ఉన్నాడు. అది కూడా అవినీతికి వ్యతిరేకంగా రధ యాత్ర్ర చేస్తున్నాడు. అటువంటి పెద్దాయన తన పని మర్చిపోయి ఆఫ్ట్రాల్ ఓ ప్రవేటు కంపెనీ వ్యవహారంపైన అర్జెంటుగా ప్రకటన ఎందుకు ఇవ్వవలసి వచ్చింది. ఎందుకంటే ఆద్వాని ప్రకటన చదివి విజయ్ మాల్యా పరిగెత్తుకుని బి.జె.పివారిని కలవాలి. కలిసి తన కష్టాలను చెప్పుకుని “తగిన రీతిలో” వారిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడిక అద్వానీకి కింగ్ ఫిషర్ బెయిలౌట్ విషయంలో అభ్యంతరం ఉండకపోవచ్చు. కావలిస్తే ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద మాట సాయం చేసిన చెయ్యవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి