24, మే 2012, గురువారం

ఒలింపిక్ స్వర్ణం సాధిస్తా..


హైదరాబాద్, మే 23: లండన్ ఒలింపిక్స్ బాడ్మింటన్ ఈవెంట్‌లో రెండు విభాగాలకు అర్హత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన తెలుగుతేజం జ్వాలా గుత్తాను ఆమె తండ్రి క్రాంతి ఆధ్వర్యంలో బుధవారం అభినందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ కోచ్ ఎస్.ఎం.ఆరిఫ్‌తో పాటు దూరదర్శన్ మాజీ డైరెక్టర్ మరార్, రిజర్వుబ్యాంకు డైరెక్టర్ ఎ.ఎస్.సాంబశివరావు, ఇండోనేషియా కోచ్‌తో పాటు కమల్ కామరాజు, రఘురాం తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్‌చేసి జ్వాలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జ్వాల మాట్లాడుతూ, ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించగలనన్న విశ్వాసంతో ఉన్నానని, అందుకు అనుగుణంగా శిక్షణ పొందుతున్నానని అన్నారు. జ్వాల తండ్రి క్రాంతి మాట్లాడుతూ, తన తండ్రి జి.సుబ్రహ్మణ్యం (జ్వాల తాత) శత వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని, అలాగే జ్వాల ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జ్వాల గొప్ప క్రీడాకారిణిగా ఎదగడానికి సహకరించిన సాయ్, శాప్ అధికారులకు, స్పాన్సర్లకు, కోచ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించడంతోనే జ్వాల పతకం సాధించడానికి మార్గం సుగుమమైందని, దీనిని నిజంచేసి చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జ్వాల సహచర క్రీడాకారులు వి.దిజు, అశ్వనీ పొన్నప్ప, ఇతర క్రీడాకారులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి