16, మే 2012, బుధవారం

నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు

మంగళవారం సాయంత్రం నుంచీ విచారణ; అర్ధరాత్రి ప్రకటన
ఐఆర్‌టీఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి కూడా అరెస్టు...
‘సాక్షి’తో సహా పలు మీడియా సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు
ఆసుపత్రులు, హెల్త్‌కేర్ రంగంలోనూ ఇన్వెస్ట్‌మెంట్లు
భారతీ సిమెంట్స్ సహా పలు ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా లాభాలు
‘టార్గెట్ జగన్’లో భాగంగానే నిమ్మగడ్డ ప్రసాద్‌కూ వేధింపులు?
ఇన్వెస్టర్లను అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పిన సీబీఐ
ఎన్నికల ముందు దానికి విరుద్ధంగా చర్యలు
పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్లే యూ టర్న్?
ఉల్లంఘనల్ని గుర్తించకపోయినా... ‘సాక్షి’ పెట్టుబడులతో లింకు
పారిశ్రామిక వర్గాల్లో విస్మయం.. తీవ్ర ఆందోళన

హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మ్యాట్రిక్స్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయ్యారు. ఫార్మా, ఆసుపత్రులు, మీడియా రంగంలోని పలు సంస్థల్లో పెట్టుబడి పెట్టి విజయవంతమైన ఇన్వెస్టర్‌గా పేరొందిన ప్రసాద్‌ను.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను మంగళవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసింది. సోమ, మంగళవారాల్లో నాలుగు దఫాలుగా ప్రసాద్‌ను విచారించిన సీబీఐ అధికారులు.. మంగళవారం తొలుత మధ్యాహ్నం 12 గంటల సమయంలో విచారణకు పిలిచారు. రెండుగంటల పాటు విచారణ సాగిన అనంతరం భోజన విరామానికి ప్రసాద్ ఇంటికెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం 5 గంటలకు విచారణ నిమిత్తం దిల్‌కుష అతిథి గృహానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు, ఆయన్ను అరెస్టు చేసినట్టుగా రాత్రి 10.30 సమయంలో ప్రకటించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను, ఐఆర్‌టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) అధికారి బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేశామని, రాత్రంతా ఇంటరాగేషన్ కొనసాగే అవకాశముందని సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీ నారాయణ వెల్లడించారు. వారిని రాత్రంతా దిల్‌కుష అతిథి గృహంలోనే ఉంచి బుధవారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు సైనిక్‌పురిలోని నిమ్మగడ్డ ప్రసాద్ నివాసంలోనూ, హబ్సిగూడలోని బ్రహ్మానందరెడ్డి నివాసంలోనూ సీబీఐ బృందం తనిఖీలు నిర్వహించింది. బ్రహ్మానందరెడ్డి రైల్వే నుంచి డిప్యూటేషన్‌పై రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖలో చేరి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు.

విజయవంతమైన ఇన్వెస్టర్..

ఓరిన్ ల్యాబ్స్‌లో ఉన్నతస్థాయి ఉద్యోగిగా 1993లో కెరీర్ ఆరంభించిన ప్రసాద్ కొద్ది కాలంలోనే దానిద్వారా ర్యాన్‌బ్యాక్సీ ల్యాబ్స్‌లో డెరైక్టరు కూడా కాగలిగారు. ఖాయిలా పడిన హెరెన్ డ్రగ్స్ సంస్థను 2000లో సొంతగా కొనుగోలు చేసి.. దాన్ని, ఓరిన్‌ను కలిపి మ్యాట్రిక్స్‌గా మార్చారు. అక్కడి నుంచి పలు సంస్థల్ని కొనుగోలు చేస్తూ పోయి చివరకు మ్యాట్రిక్స్‌ను అంతర్జాతీయ దిగ్గజంగా తీర్చిదిద్దారు. దేశంలోనూ అగ్రశ్రేణి ఫార్మా సంస్థగా తయారు చేశారు. అనంతరం 2006లో సరైన సమయంలో దాన్ని అంతర్జాతీయ దిగ్గజం మైలాన్ ల్యాబొరేటరీస్‌కు రూ.570 కోట్ల భారీ మొత్తానికి విక్రయించి బయటకు వచ్చారు. ఆ మొత్తాన్ని వివిధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తూ.. పెట్టుబడులపై లాభాలు ఆర్జిస్తూ విజయవంతమైన ఇన్వెస్టర్‌గా పేరొందారు. ప్రసాద్ ఇన్వెస్ట్‌మెంట్లలో ప్రతి ఒక్కటీ కలిసి వచ్చాయంటేనే ఆయన ఎంతటి వ్యూహాత్మక ఇన్వెస్టరో, ఎంతటి విజయవంతమైన ఇన్వెస్టరో అర్థమవుతుంది.

కేర్ ఆసుపత్రిలో ఇన్వెస్ట్ చేసిన ప్రసాద్.. ఇటీవలే తన వాటాను విదేశీ ఇన్వెస్టర్లకు విక్రయించి చక్కని లాభాలతో బయటకు వచ్చారు. భారతీ సిమెంట్స్‌లో వాటాను సైతం అంతర్జాతీయ సంస్థ వికాకు విక్రయించి చక్కని లాభంతో ఎగ్జిట్ అయ్యారు. మా టీవీలో కూడా కొంత వాటాను ఇటీవలే సోనీ సంస్థకు అధిక మొత్తానికి విక్రయించారు. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సంస్థతో సహా పలు ఆసుపత్రుల్లో ఆయన పెట్టుబడులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. హెల్త్‌కేర్‌తో పాటు మీడియాపైనా స్పష్టమైన అవగాహన ఉండబట్టే.. ఆ రంగంలోని మార్పుల్ని ఊహించబట్టే ‘సాక్షి’లో కూడా పెట్టుబడి పెట్టారాయన.

వాన్‌పిక్ వ్యవహారంలోనే..
సీరియస్ ఇన్వెస్టర్‌గా, విజయవంతమైన ఇన్వెస్టరుగా పేరున్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను.. కేవలం ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టినందుకు అరెస్టు చేయటంపై రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుదోంది. ప్రభుత్వం నుంచి వాన్‌పిక్ ప్రాజెక్టును ఆయనేమైనా నిబంధనలకు విరుద్ధంగా పొందారా? ఈ ప్రాజెక్టును ఆయనకు ఇవ్వటంలో ప్రభుత్వం ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడిందా? వంటివేమీ చూడకుండా కేవలం ఈ ప్రాజెక్టు పొందినందుకు, ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టినందుకు, ఈ రెంటికీ ముడిపెట్టి ఆయన్ను అరెస్టు చేయటం.. అంతా స్క్రిప్టు ప్రకారమే జరుగుతోందన్న వాదనను మరింత బలపరుస్తున్నట్టయిందని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసిన ప్రభుత్వం, కొన్ని వ్యవస్థలు ఆయన్ను ఇబ్బంది పెట్టే క్రమంలో ఇలా ఇన్వెస్టర్లను, కంపెనీల్ని భయభ్రాంతుల్ని చేయటం వల్ల మొత్తం రాష్ట్రంలోనే ఇన్వెస్ట్‌మెంట్ వాతావరణం సర్వనాశనమైపోతుందని, రాష్ట్ర పారిశ్రామిక భవితకు ఇది తీరని చేటు చేస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి మార్చి 31న చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ, అప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాలపైనా దర్యాప్తు పూర్తి చేసి ఉండాల్సిందని.. కానీ అలాంటిదేమీ చేయకుండా ఇంకా ఇంకా చార్జిషీట్లు వేస్తామంటూ.. వాన్‌పిక్ వ్యవహారంలో ఇంకా చార్జిషీటు దశకే రాలేదని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం రాత్రి వ్యాఖ్యానించటం కూడా విస్మయపరిచేదేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల కోర్టులో సీబీఐ న్యాయవాది వాదిస్తూ.. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి మేం ఇన్వెస్టర్లెవరినీ అరెస్టు చేయదలచుకోలేదు’’ అని బహిరంగంగా చెప్పారని, దాన్ని కొన్ని ఆంగ్ల పత్రికలతో సైతం పలు పత్రికలు రిపోర్ట్ చేశాయని.. ఇంతలోనే ఇలా యూ టర్న్ తీసుకోవటం వెనక బలమైన కారణాలో, ఒత్తిళ్లో ఉండి ఉండవచ్చని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ‘‘ఇన్వెస్టర్లను అరెస్టు చేయబోమని కోర్టులోనే చెప్పిన సీబీఐ.. ఉప ఎన్నికల ముందు ఇలా యూ టర్న్ తీసుకోవటం వెనక తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు పనిచేసి ఉండవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన పలు వర్గాలను, ఆయనకు మద్దతు పలికేవారిని భయభ్రాంతుల్ని చేయటానికే ఈ చర్యకు దిగి ఉండొచ్చు’’ అని మొదటి నుంచీ ఈ కేసును పరిశీలిస్తున్న హైకోర్టు న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు.

గంగవరం, కాకినాడ పోర్టుల్లానే..
చంద్రబాబు హయాంలో తొలుత విదేశీ కంపెనీకి గంగవరం పోర్టును కట్టబెట్టే ప్రయత్నం చేశారు. కాకినాడ పోర్టును సైతం మలేసియా కన్సార్షియం పేరిట ఎల్ అండ్ టీకి అప్పగించారు. నిజానికి పోర్టులు, సెజ్‌లు ఏ నిబంధనల ప్రకారమైతే కేటాయించారో వాన్‌పిక్‌ను కూడా అలాంటి నిబంధనల ప్రకారమే కేటాయించారు. అక్కడ పరిహారాన్ని కూడా మిగిలిన ప్రాజెక్టుల కన్నా ఎక్కువే నిర్ణయించారు. అలాంటిది, అవకతవకలున్న కాకినాడ పోర్టు వంటి ప్రాజెక్టులవైపు కన్నెత్తి చూడని సీబీఐ.. వాన్‌పిక్ విషయంలో మాత్రం అత్యుత్సాహం చూపించటం కేవలం జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయటానికేనని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మున్ముందు న్యాయస్థానాల్లో సీబీఐ ఈ చర్యల్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాల్సి ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి