3, మే 2012, గురువారం

60% గ్రామీణ ప్రజల రోజువారీ రాబడి రూ.35 లోప


న్యూఢిల్లీ, మే 3: దేశంలోని గ్రామీణ జనాభాలో సుమారు 60% మంది ప్రజల రోజువారి ఆదాయం 35 రూపాయలకన్నా తక్కువగా, పట్టణాల్లో దాదాపు అంతేమంది జనాభా రోజువారి రాబడి రూ.66కన్నా తక్కువగా ఉన్నట్లు ఆదాయ వ్యయాలపై ప్రభుత్వం జరిపిన ఒక సర్వేలో వెల్లడైంది. సగటున రోజువారి తలసరి వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రూ.35, పట్టణ ప్రాంతాల్లో రూ.66గా వుంది. సుమారు 60 శాతం ప్రజలు ఈస్థాయి లేదా ఇంతకన్నా తక్కువ రోజువారి ఆదాయాన్ని కలిగివుంటున్నారని జాతీయ నమూనా అధ్యయన సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) డైరెక్టర్ జనరల్ జె.దాస్ ఈ సర్వే నివేదికకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు.
అలాగే 2009 జూలై, 2010 జూన్ మధ్యకాలానికి నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్)ను అనుసరించి భారత్‌లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపిసిఇ) గ్రామీణ ప్రాంతాల్లో రూ.1054, పట్టణ ప్రాంతాల్లో రూ.1984గా ఉంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 10% జనాభా రోజు రాబడి రూ.15, పట్టణ ప్రాంతాల్లో రూ.20కి మించి లేదని సర్వే తెలిపింది. గ్రామీణ నిరుపేద 10% జనాభా రోజువారి తలసరి వినియోగ వ్యయం సగటున రూ.452 ఉండగా, పట్టణ ప్రాంతంలో ఇది 599గా ఉన్నదని నివేదిక వెల్లడించింది. గ్రామీణ కుటుంబ సగటు వినియోగ వ్యయంలో ఆహారానికి చేసే ఖర్చు సుమారు 57% ఉండగా, పట్టణాల్లో ఇది 44 శాతమే ఉందని సర్వే వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి