15, మే 2012, మంగళవారం

నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టు

హైదరాబాద్, మే 15: వైఎస్ జగన్ ఆస్తుల కేసులో మ్యాట్రిక్స్ అధినేత, వాన్‌పిక్ ప్రాజెక్టు నిర్వాహకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సిబిఐ అధికారులు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో అరెస్టు చేశారు. కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను వరుసగా రెండు రోజుల పాటు దిల్‌కుషా అతిథి గృహంలో విచారించిన సిబిఐ, మంగళవారం అరెస్టు చేసింది. అదేవిధంగా వైఎస్ హయాంలో పెట్టుబడులు, వౌలిక వసతుల కల్పనాశాఖకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేసిన ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డినీ సిబిఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. దిల్‌కుషాలో మంగళవారం విచారణ ముగిసిన వెంటనే సిబిఐ అధికారులు తమ వాహనాల్లో నిమ్మగడ్డను సైనిక్‌పురిలోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోమవారం ఐదు గంటలు, మంగళవారం నాలుగు గంటలపాటు దిల్‌కుషాలో నిమ్మగడ్డను, బ్రహ్మానందరెడ్డినీ విచారించారు. జగన్ కేసులో తొలి అరెస్టు విజయసాయిరెడ్డి కాగా, రెండో అరెస్టు నిమ్మగడ్డ ప్రసాద్. ప్రసాద్‌తోపాటు బ్రహ్మానందరెడ్డినీ సిబిఐ అరెస్టు చేయడం కీలక పరిణామం. ఈ కేసులో 12వ నిందితుడిగా నిమ్మగడ్డ ప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సిబిఐ అధికారులు, ఆయనపై ఐపిసి 120బి, 420, 409, 477ఎ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన ఓడరేవు, నిజాంపట్నం పోర్టు అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) ప్రాజెక్టు కోసం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 15వేల ఎకరాల భూములను కేటాయించారు. ఈ భూములను పొందినందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్ కంపెనీల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు సిబిఐ ఆరోపణ. జగన్‌కు చెందిన మొత్తం కంపెనీల్లో సుమారు రూ.504 కోట్లు నిమ్మగడ్డ పెట్టుబడులు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. సండూర్ పవర్ ప్రాజెక్టులో రూ.140 కోట్లు, జగతి పబ్లికేషన్స్‌లో రూ.100 కోట్లు, కార్మెల్‌లో రూ.200 కోట్లు, భారతి సిమెంట్స్‌లో రూ.244 కోట్లు, సిలికాన్ బిల్డర్స్‌లో రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. ఫార్మా, మీడియా రంగాల్లో పెద్దఎత్తున నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు వాన్‌పిక్ భూములను కేటాయించడంలో ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి సహకరించారు. రెండు నెలల కిందట రోజులు తరబడి సిబిఐ అధికారులు దిల్‌కుషాలో నిమ్మగడ్డను విచారించారు. ఆ సమయంలోనే అరెస్టు చేస్తారనే వదంతులు వచ్చాయి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో నిమ్మగడ్డ ప్రముఖుడు. పారిశ్రామిక రంగంలో రాణించిన నిమ్మగడ్డ వైఎస్ హయాంలో వాన్‌పిక్ పేరుతో 15వేల ఎకరాలను సొంతం చేసుకున్నారు. సాక్షి గ్రూప్‌లో 26 శాతం వాటాలు కలిగి ఉండడమే కాకుండా, మాటీవీ చైర్మన్‌గా, పలు ఫార్మా కంపెనీల్లో పెట్టుబడిదారుడిగా నిమ్మగడ్డ ప్రసాద్ కొనసాగుతున్నారు.
ఇలావుండగా, బ్రహ్మానందరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు తమ వాహనంలోనే తార్నాకలోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. నివాసంలో ఆయన సమక్షంలోనే సోదాలు నిర్వహించారు. దీంతో జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టుల సంఖ్య 3కి చేరింది. మరోవైపు ఈ కేసులో జగన్ సహా 13మందిని ఈనెల 28న తమముందు హాజరు కావాలని సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సిబిఐ వర్గాల కదలికలు జగన్ వైపునకే అన్నట్టు ఉన్నాయి. జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా కంపెనీల బ్యాంక్ అక్కౌంట్లను స్తంభింప చేసిన సిబిఐ, తర్వాత టార్గెట్ జగన్‌ను అరెస్టు చేయడమేనని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి