21, డిసెంబర్ 2011, బుధవారం

అవినీతి ‘రాజా’ కొంప ముంచిన పర్సనల్ సెక్రటరీ ‘ఆచారి’


మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన ‘ఆచారి’, తన మాజీ బాస్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి వార్తా సంస్ధ తెలిపింది. ఎ.ఆచారి గతంలొ ఎ. రాజాకు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోర్టులో సోమవారం మాజీ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఎ.రాజాకు, ఆయన కుట్ర పన్నాడని ఆరొపిస్తున్న కంపెనీల అధిపతులతో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తద్వారా ఎ.రాజా టెలికం లైసెన్సుల జారీలో తనకు బాగా తెలిసిన కంపెనీల అధిపతులతో కుట్ర పన్నాడన్న వాదనకు బలం చేకూర్చాడు.
పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్ధలయిన యూనిటెక్, డి.బి.రియాలిటీ లకు ఎ.రాజా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నపుడే అనేక పెద్ద ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాడని ఆచారి తెలిపాడు. మొబైల్ నెట్ వర్క్ లైసెన్సులు, 2జి స్పెక్ట్రంలను, టెలికం శాఖ మంత్రిగా ఎ.రాజా, అత్యంత తక్కువ రేట్లకు యూనిటెక్ కి చెందిన యూనిటెక్ వైర్ లెస్ కూ, డి.బి.రియాలిటీకి చెందిన స్వాన్ టెలికం కూ అప్పజెప్పాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
యూనిటెక్ ప్రమోటర్ సంజయ్ చంద్ర, స్వాన్ టెలికం ప్రమోటర్లు షాహిద్ బల్వా, వినోద్ గోయెంకాలు ఎ.రాజాకు బాగా తెలిసినవారేనని ఆచారి కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. ఈ ముగ్గురూ ఇటీవలివరకూ జైలులో ఉండి బెయిలుపై విడుదయలయ్యారు. ఎ.ఆచారి ఏడవ ప్రాసిక్యూషన్ సాక్షిగా కోర్టులో హాజరయ్యాడు. ఆయన సి.బి.ఐ ఎదుట ఇచ్చిన సాక్ష్యాలకు కట్టుబడుతూ కోర్టులో కూడా అవే చెప్పాడు. అక్టోబరు1999 నుండి అక్టోబరు 2008 వరకూ తాను ఎ.రాజా వద్ద పని చేశానని ఆయన కోర్టుకి తెలిపాడు.
“పర్యావరణ మంత్రిగా ఎ.రాజా క్లియరెన్స్ ఇచ్చిన ప్రాజెక్టులు యూనిటెక్, డి.బి.రియాలిటీ ఇంకా ఇతర కంపెనీలకు చెందినవి ఉన్నాయి. ఈ క్లియరెన్సులలో నేను లేనందున క్లియరెన్సు లు మంజూరు చేసే పద్ధతి ఏమిటో నాకు తెలియదు. యూనిటెక్ కి సంబంధించినంతవరకూ సంజయ్ చంద్ర, డి.బి.రియాలిటీ కి సంబంధినంతవరకూ షాహిద్ బల్వా, వినోద్ గోయెంకా లు నిత్యం సంప్రదింపులు జరిపేవారు. పర్యావరణం మరియు అడవుల శాఖ మంత్రిత్వ శాఖలో తమ కేసుల గురించి ఆరా తీయడానికి ఎ.రాజా, చందోలియాలను క్రమం తప్పకుండా కలవడానికి వచ్చేవారు” అని ఆచారి కోర్టుకి తెలిపాడు. సెప్టెంబరు – డిసెంబరు 2007 కాలంలో వారు ఎ.రాజా అధికారిక నివాసానికి కూడా వచ్చేవారని కూడా ఆచారి కోర్టుకి తెలిపాడు.
నవంబరు 2, 2007 తేదీన ఎ.రాజా ప్రధాన మంత్రికి రాసిన రెండు లేఖలపైన ఆయన చేసిన సంతకాలను ఆచారి గుర్తు పట్టాడు. రెండు లేఖలలో ఒకటి ఎ.రాజా అధికారిక నివాసం వద్ద రాత్రి తొమిది గంటల తర్వాత మంత్రి డిక్టేట్ చేస్తుండగా టైప్ చేసినదని ఆచారి తెలిపాడు. “రెండో ఉత్తరం రాజా అధికారిక నివాసం వద్ద రాత్రి తొమ్మిది గంటల తర్వాత పదకొండున్నర లోపల డిక్టేట్ చేస్తుండగా టైప్ చేయబడింది. ఈ సమయాల్లో ఎ.రాజా అధికారిక నివాసం వద్ద ఉండడం మామూలు విషయమే. నన్ను అక్కడికి రమ్మని ఎ.రాజా ఫోన్ లో పిలవగా వెళ్ళాను” అని ఆచారి కోర్టుకి తెలిపాడు.
లేఖ డ్రాఫ్టింగ్ విషయమై ఆచారి చర్చించాడు. “రాజా ఇంటికి చేరుకున్నాక భారత ప్రధాన మంత్రి నుండి ఒక లేఖ వచ్చిందనీ, దానికి అక్కడే, అప్పుడే ప్రత్యుత్తరం రాయవలసి ఉందనీ ఆయన నాకు చెప్పాడు. లేఖను తయారు చేద్దాం రమ్మని పిలిచాడు. దాదాపు అర్ధ రాత్రివరకూ రాజా నివాసంలోనే నేను ఉన్నాను. లేఖను తయారు చేశాక పదకొండున్నర గంటలకు దానికి డిస్పాచ్ చేశాము” అని ఆచారి కోర్టుకి తెలిపాడు.
కనిమొళి లాయర్లు కోర్టులో తమ క్లయింటుకి ఎ.రాజాతో సంబంధాలు లేవని చెబుతూ వచ్చారు. దీనిని కూడా ఆచారి సాక్ష్యం అబద్ధంగా తేల్చివేసింది. ఎ.రాజా, కనిమొళి ఇద్దరూ బాగా తెలిసినవారేననీ సమీప సహచరులేననీ తరచుగా ఒకరినొకరు సందర్శించుకునేవారనీ ఆచారి కోర్టుకి తెలిపాడు. తమిళనాడులో రేషన్ కార్టులు ఇచ్చే పద్ధతిలోనే ఎ.రాజా స్పెక్ట్రం ను కూడా కేటాయించాడని ఆచారి కోర్టుకి తెలిపాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి