20, అక్టోబర్ 2013, ఆదివారం

అమెరికా నౌక ఆగడం


అమెరికా ప్రైవేటు కంపెనీకి చెందిన ఒక నౌక కొద్ది రోజుల పాటు మారణాయుధాలతో మన దేశ తీర ప్రాంతంలో తచ్చాడడం, ప్రాదేశిక జలాల్లో ప్రవేశించడం ఆందోళనకరం. తగిన అనుమతులు, ఆధారాలు కూడా ఆ నౌకకు లేవని తెలుస్తున్నది. ఉగ్రవాద దాడులు, మారణాయుధాల సరఫరా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నౌక సంచారానికి గల కారణాలపై ఆరా తీయవలసి ఉన్నది. మన దేశ అధికారులు నౌకను అదుపులోకి తీసకుని, సిబ్బందిని నిర్బంధించారు. కానీ దర్యాప్తు ఎటువంటి ఒత్తిళ్ళకు గురికాకుండా జరుపవలసి ఉన్నది. నౌక అమెరికా కంపెనీకి చెందినది కనుక ఒత్తిళ్ళు రావచ్చనే అనుమానలు కలుగడంలో ఆశ్చర్యం లేదు. నౌక యాజమాన్యం ఇస్తున్న వివరణలు అతుకుబొతుకు లేకుండా ఉన్నందు వల్ల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అడ్వాన్‌ఫోర్ట్ అనే అమెరికా కంపెనీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నది. సముద్ర దొంగల దాడుల నుంచి నౌకలను కాపాడడం తమ వ్యాపారమని ఈ కంపెనీ చెబుతున్నది. సముద్రం మధ్య నౌకలకు అవసరమయ్యే ఆయుధాలను కూడా ఈ కంపెనీ సరఫరా చేస్తుందట. రేవులలోకి ప్రవేశించినప్పుడు నౌకలలో ఆయుధాలు ఉండకూడదు కనుక, తాత్కాలికంగా వాటి ఆయుధాలను భద్ర పరచడం కూడాఈ కంపెనీ సేవలలో భాగమనే మాట వినబడుతున్నది. కానీ నౌక సంచరించిన తీరు, వ్యవహార సరళి అనుమానాలకు తావిస్తున్నది.


భారత అధికారులు నౌకను నిర్బంధించి అందులోని సిబ్బందిని కొద్దిగా ఆలస్యంగానైనా అరెస్టు చేశారు. కానీ ఈ నౌక కదలికల పట్ల భారత అధికారులు మొదట చెప్పిన మాటలు కొంచెం మెతకగా ఉన్నాయి. కంపెనీ సిబ్బంది చెబుతున్న కారణాలను నమ్ముతున్నట్టే కనిపించారు. భారత అధికారులు ఇటువంటి సానుకూల ధోరణి ప్రదర్శించకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగించాలె. ఉగ్రవాదులకు తోడ్పాటు అందించే విదేశీ కంపెనీలు కూడా ఏదో ఒక ముసుగులో ఇటువంటి కార్యకలాపాలు సాగిస్తాయి. నౌకలో మారణాయుధాలతో పాటు, మందుగుండు సామాగ్రి కూడా ఉన్నది. నౌక భారత జలాల్లో ప్రవేశించడానికి కావలసిన పత్రాలు కంపెనీ తరఫున ఏమీ లేవని తెలుస్తున్నది. తమ నౌక భారత జలాల్లోకి ప్రవేశిస్తున్నదని తెలిసినప్పటికీ, కెప్టెన్ పోర్టు అధికారులకు ఈ సమాచారం అందించ లేదు. నౌక పొరపాటున కాకుండా ఉద్దేశపూర్వకంగానే భారత జల్లాల్లో ప్రవేశించింది. నౌక భారత జలాల్లో ఎందుకు ప్రవేశించవలసి వచ్చిందనడానికి నౌక సిబ్బంది చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇంధనానికి కొరత ఏర్పడడం వల్ల రావలసి వచ్చిందని వారు అంటున్నారు. ఇటువంటి ఆపతి ఎదురైనప్పుడు కాపాడడానికి సముద్ర ప్రాంత సహాయ కేంద్రం ఉంటుంది. ఈ కేంద్రానికి సమాచారం అందించనే లేదు. మన దేశంలో ఇంధనం కొనుగోలు చేసింది కూడా అక్రమ మార్గంలోనే. ఇంధనం కోసం రేవులోకి ప్రవేశించినప్పుడు తమ వద్ద మారణాయుధాలు ఉన్నాయనే విషయం అధికారులకు వెల్లడించక పోవడం కూడాక్షమార్హం కాదు. తూర్పు తీరంలో ఫైలిన్ తుఫాన్ తాకిడి నుంచి తప్పించుకోవడానికి ప్రాదేశిక జలాల్లో ప్రవేశించవలసి వచ్చిందనే తొంపు కూడా నమ్మదగినదిగా లేదు. ఫై లిన్ తుఫాన్ తాకిడి ఒడిషా మొదలుకొని ఉత్తరాంధ్ర వరకే ఉన్నది. నౌక అడ్డావేసింది పాక్ జలసంధికి ఆవలి వైపున గల ట్యూటికోరిన్ రేవు వద్ద. ఈ నౌకను వినియోగిస్తున్న అమెరికా కంపెనీ అడ్వాన్‌ఫోర్ట్‌పై గతంలో ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్న కేసు అమెరికాలో నమోదయిందని తెలుస్తున్నది.


అమెరికా తన భద్రత విషయంలో అతి జాగ్రత్తలు పాటిస్తుంది. ఈ క్రమంలో ఇతర దేశాలను ఇబ్బందులకు, అవమానాలకు గురి చేసిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. తమ దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే అనుమానితుడు ఏ దేశంలో ఉన్నా బంధించే హక్కు తమకు ఉందంటూ చట్టాలు చేసుకున్నది. ఏ దేశ రేవులో ఉన్న కంటైనర్లను అయినా సోదా చేసే హక్కును తనకు తానే దత్తం చేసుకున్నది. తమ రేవులకు వచ్చే కంటైనర్లను ఎలక్షిక్టానిక్ స్కానింగ్ చేయాలని, అటువంటి పరికరాలను (ఆ పరికరాలు అమెరికా కంపెనీయే తయారు చేస్తుంది!) అన్ని రేవులలో ఏర్పాటు చేసుకోవాలని శాసించిన ఘనత అమెరికాది. చివరకు మన దేశ ప్రముఖులు అమెరికా వెళితే, వారి హోదాను చూసయినా వదలిపెట్టకుండాబట్టలు ఊడదీసి తనిఖీ చేయడం అమెరికాకు అలవాటు. అటువంటిది అమెరికా కంపెనీకి చెందిన నౌక ఆయుధాలతో అనుమతి లేకుండావచ్చి అబద్ధాలు చెబుతున్నప్పుడు తేలిగ్గా వదలిపెట్టడం మనకే అవమానకరం. తాము ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నందు వల్ల కఠినంగా ఉండవలసి వస్తున్నదని అమెరికా చెబుతున్నది. ఉగ్రవాదం పేరుతో ఉచితానుచితాలు మరిచి వ్యవహరిస్తున్నది. అనేక సందర్భాలలో ఇతర దేశాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరులో ఉగ్రవాద భయం కన్నా, అగ్రరాజ్యాన్ననే దర్పమే ఎక్కువగా ద్యోతకమవుతూ ఉంటుంది. అందువల్ల ఇతర దేశాలు కూడా కఠినంగా వ్యవహరించినప్పుడే అమెరికాకు మితిమీరిన భద్రత వల్ల ఉత్పన్నమయ్యే సమస్య ఏమిటో తెలుస్తుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపవలసింది సామాజిక సమస్యల పరిష్కారం ద్వారానే తప్ప భద్రతా చర్యల ద్వారా, ఇతర దేశాల సార్వభౌమత్వానికి భంగం కలిగించడం ద్వారా కాదని అమెరికా గ్రహించేలా చేయాలె.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి