2, అక్టోబర్ 2013, బుధవారం

అమెరికా బంద్‌ హోగయా!

అమెరికా బంద్‌ హోగయా!
Posted on: Sun 02 Oct 00:36:05.370808 201312
లావాదేవీల ప్రతిష్టంభన - ఉద్యోగాలకు ఉద్వాసన - అధికార పోరులో అసాధారణ స్థితి
వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా పేరొందిన అమెరికా 'మూతపడింది'. అంటే అమెరికాలో ప్రభుత్వ సంస్థలన్నీ మూతపడుతున్నా యన్నమాట. ఒబామా సర్కారు రూపొందించిన వార్షికబడ్జెట్‌ నిర్ణీత గడువు లోగా కాంగ్రెస్‌ ఉభయ సభల ఆమోదం పొందటంలో విఫలం కావటంతో ప్రభుత్వం ఈ అసాధారణ చర్య తీసుకుంది. ప్రభుత్వ సంస్థలన్నింటినీ మూసివేయాలంటూ సోమవారం అర్ధరాత్రి ఒబామా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్‌ ఇటు ప్రతినిధుల సభలోనూ, అటు డెమొక్రాట్ల ఆధిపత్యంలోని సెనేట్‌లోనూ ఆమోదం పొందకుండా అధికారికంగా 'తిరస్కరణ'కు గురి కావటానికి పది నిముషాల ముందే అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఈ ఆదేశాలు జారీ చేయటం విశేషం.
ప్రభుత్వం మూసివేత అంటే..?
అధికారిక కార్యకలాపాల నిర్వహణకు అవసర మైన నిధులు లేక కార్యాలయాలు మూతపడటమే ప్రభుత్వ మూసివేత. ఒక రకంగా వ్యాపార సంస్థలు దివాలా తీయటం వంటిదే ఇది. అవసరమైన నిధులు లేక వ్యాపార సంస్థలు మూతపడిన విధంగానే కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన నిధులు లేక కార్యాలయాలను, సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ బడ్జెట్‌ కాంగ్రెస్‌ (పార్లమెంట్‌) ఆమోదం పొందితే కానీ అధికారికంగా నిధులు విడుదల కావు. అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన బడ్జెట్‌ నిర్ణీత గడువు లోగా ఉభయసభల ఆమోదం పొందటంలో విఫలం కావటం అమెరికా ప్రభుత్వ దివాలాకు దారి తీసిందని చెప్పవచ్చు. తాజా ఆదేశాల ఫలితంగా ప్రభుత్వం నుండి నేరుగా నిధులను పొందే సంస్థలన్నీ మూతపడనున్నాయి. ఇక పరిశ్రమలు, ప్రజల నుండి వసూలు చేసే వినియోగ ఫీజులతో కాలం గడిపే ప్రభుత్వ సంస్థలను అత్యవసర సంస్థలుగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒబామా సర్కారు జారీ చేసిన తాజా ఆదేశాల కారణంగా దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలకు దూరమవుతారని అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వివరించారు. ఈ వేతనాల ప్రకారం అధ్యక్ష కార్యాలయంలో విధులు నిర్వహించే మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 1,265 మంది ఉద్వాసనకు గురికానున్నారు. అత్యవసర సేవలకు అవసరమైన 436 మందిని మాత్రం విధుల్లో వుంచుతారు. ఇందులో అధ్యక్ష భవనం (వైట్‌హౌస్‌) కనీస నిర్వహణకు అవసరమైన 15 మంది సిబ్బంది కూడా వుంటారు. ఇక ప్రభుత్వ సంస్థలు కూడా తమ వద్ద వున్న సిబ్బందిని గణనీయంగా తగ్గించి నామ మాత్రపు సిబ్బందితో కాలం గడపాల్సి వుంటుంది.
గుట్టు కాపాడే పాట్లు
దేశ ఆర్థిక పరిస్థితిని గుట్టుగా వుంచేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ నెలవారీగా ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించే ఆర్థిక సమాచారం, నెలసరి ఉపాధి అవకాశాల వివరాల నివేదికల ప్రచురణను నిలిపివేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడినా కొద్ది వారాల పాటు మార్కెట్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌కు వీలవుతుందని కమిషన్‌ ప్రతినిధి ఒకరు వివరించారు.
కుంటుపడనున్న ఆరోగ్యసేవలు
ఈ నెల 1 వతేదీ నుండి అమలులోకి వచ్చిన ఆరోగ్యసేవల కొత్తచట్టం కింద హెల్త్‌ ఎక్స్చేంజ్‌ల ఏర్పాటు కార్యక్రమం యధావిధిగా కొనసాగనున్నట్లు తెలుస్తోది. అయితే ఆరోగ్య సేవల విభాగంలోని ఉప సంస్థలలోని సిబ్బందిలో దాదాపు 40,512 (52 శాతం) మందికి ఉద్వాసన పలుకనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాధి నిరోధక కార్యక్రమాలు కుంటుపడనున్నాయి. జాతీయ వైద్య సంస్థల్లో కొత్తగా రోగులను చేర్చుకోవటం కూడా ఇక అరుదుగానే జరుగుతుంది. అదే విధంగా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇంటెలిజెన్స్‌ సంస్థలు వంటి వాటిలో సైతం సిబ్బందిని గణనీయంగా తగ్గించనున్నారు. ఇక అమెరికన్లు దైనందిన జీవితంలో కాసేపు సేద తీరేందుకు ఉపయోగించుకునే జాతీయ పార్కులు కూడా మూతపడనున్నాయి. రక్షణ విధులు నిర్వహించే సైనిక సిబ్బందిని యధావిధంగా కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం రక్షణశాఖలోని పౌరవిధులు నిర్వర్తించే దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. జాతీయ భద్రతకు కీలకం కాని సైనిక కార్యకలపాలను నిలిపివేయనున్నట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టే ఇంటర్నల్‌ రెవిన్యూ సర్వీస్‌లోని దాదాపు 90 వేల మంది ఉద్యోగులు కూడా ఇంటిదారి పట్టనున్నారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడని ఫెడరల్‌ రిజర్వ్‌, ఇతర ఆర్థిక సంస్థలు మాత్రం యధావిధిగా పనిచేస్తాయి. ఇంటి తనఖా రుణాలను అందచేసే ఫెడరల్‌ హౌసింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిమిత అధికారాలతోనే పనిచేస్తుంది. న్యాయవిభాగంలోని 1,14,486 మంది ఉద్యోగుల్లో 18 వేల మందిని ఇంటికి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమెరికా ప్రభుత్వ మూసివేత కాలంలో సుప్రీంకోర్టు యధావిధిగా పనిచేసినప్పటికీ ఇతర దిగువ స్థాయి కోర్టులు ఈ మూసివేత ప్రభావానికి లోనవుతాయని తెలుస్తోంది. ఈ కోర్టుల పరిస్థితిని ఈ నెల 15 తరువాత పునఃసమీక్షించి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటువంటి కోత లకు గురయ్యే విభాగాలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాల యం, పర్యావరణ పరిరక్షణా సంస్థ, వ్యవసాయ విభాగం తదితర ప్రభుత్వ సంస్థలు కూడా వున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదపుటంచుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ : అమెరికా 'మూసివేత'పై కామెరాన్‌ ఆందోళన
అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేకపోతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ప్రమాద హేతువుగా మారుతుందని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన బిబిసి టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం తన ఆదాయ వ్యయ ప్రణాళికలను సమర్ధవంతంగా నిర్వహించలేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లోకి వెళు ్తందని హెచ్చరించారు.
ఘర్షణకైనా సిద్ధం... రాజీ పడం...
బడ్జెట్‌ ఆమోదంలో తలెత్తిన వివాదం ఉభయ పక్షాల మధ్య చిలికిచిలికి గాలివానలా మారింది. సోమవారం అర్ధరాత్రి సమయానికి కూడా ఈ ప్రతిష్టంభన తొలిగే అవకాశాలు కన్పించకపోవటంతో ఒబామా సర్కారు ఈ ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్‌పై జరిగిన చర్చలో అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్‌లో ఎవరి వైఖరిని వారు కొనసాగించటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఒబామా సర్కారు జారీ చేసిన ఈ మూసివేత కాంగ్రెస్‌లోని ఉభయ పక్షాల మధ్య విభేదాలు తొలగే వరకూ కొనసాగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అది కేవలం కొద్ది రోజులు లేదా నెలలు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెల్లుబికిన ఆగ్రహం
ఒబామా సర్కారు జారీ చేసిన మూసివేత ఉత్తర్వులతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధి నిర్వహణలో వున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి బయటకు వచ్చారు. వరద బీభత్సంతో ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన కొలరాడో ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మూసివేత ఉత్తర్వులు గండికొట్టే ప్రమాదం ఏర్పడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి