1, అక్టోబర్ 2013, మంగళవారం

నీటొక్క అబద్ధాలు


సీమాంధ్ర నేతల మాటలు నీటిమీద రాతలు..
సమైక్య ముసుగులో తెలంగాణకు అన్యాయం
జల దోపిడీ శాశ్వతం కోసమే పథకం
నీటి యుద్ధాలంటూ దుష్ప్రచారం
- తెలంగాణకు అడ్డుపడే మరో కుతంత్రం
- ఇక్కడి ప్రాజెక్టులు ముంచి సీమాంధ్రకు నీటి తరలింపు
- మూడో పంట నీటి కోసం నాటకాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (టీ మీడియా):సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెట్టి, ఇటు రావల్సిన జలాలను ఇన్నేళ్లుగా అటు తరలించుకుపోయిన సీమాంధ్రులు ఆ దోపిడీని శాశ్వతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. తెలంగాణ నోట్లో మట్టి గొట్టి సీమాంధ్రలో అంగుళం అగుళం జలాలతో ముంచెత్తాలని కలలు కంటున్నారు. తెలంగాణను శాశ్వతంగా ఎండబెట్టాలని చూస్తూ రాష్ట్రం ఏర్పాటైతే నీళ్ల యుద్ధాలు జరుగుతాయని అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. జల వనరుల క్రమబద్ధం కోసం ఏర్పాటైన ట్రిబ్యునళ్లు ప్రాజెక్టులవారీగా కేటాయింపులు జరిపినా తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల మధ్య ఎవరి వాటా వారికి ఇప్పటికే కాగితాలవరకైనా పంపిణీ ఉందని తెలిసినా అవేవీ బయటపెట్టకుండా ప్రజలను రెచ్చగొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్న తరుణంలో ఈ విష ప్రచారం మరింత ముదిరింది. రాష్ట్రం విడిపోతే కోనసీమ, డెల్టా ప్రాంతాలు ఎడారులవుతాయని కథలు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. పలువురు సీమాంధ్ర నేతలతోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడుసార్లు మీడియా సమక్షంలో సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా ప్రయత్నించగా.. తాజాగా వైఎస్సార్సీపీ నేత జగన్ కూడా జతకలిసి ఆరున్నొక్కరాగం అందుకుంటున్నారు.

water-wave
నీటి పంపకాల్లో ఎవరి వాటాలు వారివే..
అయితే సీమాంధ్ర నేతల ప్రచారంలోఎంత మాత్రం వాస్తవం లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటైతే ప్రధానంగా పంచుకోవాల్సింది కృష్ణా, గోదావరి నదీ జలాలే. కృష్ణా నదీ జలాల విషయం తీసుకుంటే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా చేసిన సర్దుబాటు ఫలితంగా తెలంగాణకు 295.26 టీఎంసీలు, కోస్తాంధ్రకు 369.74 టీఎంసీలు, రాయలసీమకు 146 టీఎంసీలు కేటాయింపు జరిగింది. మిగులు జలాల నీటిని హక్కుల ప్రస్తావన లేకుండా వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ఇవ్వడం వల్ల 227.50 టీఎంసీల మిగులు జలాలకోసం వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. తర్వాత వచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలకు అదనంగా 45 టీఎంసీలు ఇచ్చింది. మిగులు జలాల్లో రాష్ట్రానికి 145 టీఎంసీలు ఇచ్చింది. రాయలసీమలోని తెలుగు గంగకు 25 టీఎంసీలు, కేటాయించి 120 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల క్యారీ ఓవర్ స్టోరేజీకి జత కలిపింది. అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టులో ఉంది. తెలంగాణ ఏర్పడితే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 295.26 టీఎంసీలు దక్కుతాయి. మిగులు జలాలు సుప్రీం తీర్పు తర్వాత తేలుతుంది. ఇలా దేని లెక్క దానికి స్పష్టంగా ఉంది. గోదావరి జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు 1,480 టీఎంసీలు కేటాయించింది. 900 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు, 580 టీఎంసీల నికర జలాలు నిర్దారణ జరిగింది. అంటే, తెలంగాణ ఏర్పాటైనా కాకున్నా కృష్ణా, గోదావరి నదుల్లో కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన మార్పు ఉండదు. మరి వివాదమెక్కడిది? ఎడారి ఎక్కడిది? 1956 తర్వాత దేశంలో14 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లు, బోర్డుల ద్వారా నీటి పంపకాలు కొనసాగుతూనే ఉన్నాయి.


అంతరాష్ట్ర వివాదాలకు ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు..
నదీ జలాల వివాదాలే వస్తే పరిష్కారానికి మన దేశంలో ఒక వ్యవస్థ, యంత్రాంగం ఉంది. 1956లో అంత రాష్ట్ర జల వివాద చట్టం వచ్చింది. వివాదాల పరిష్కారానికి మన దేశంలో ఏడు ట్రిబ్యునళ్లు వచ్చాయి. అందులో మన రాష్ట్రానికి సంబంధించి మూడు-కృష్ణా ట్రిబ్యునల్(బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్), గోదావరి ట్రిబ్యునల్(బచావత్), వంశధార ట్రిబ్యునల్(ముకుందం శర్మ ట్రిబ్యునల్)-ఉన్నాయి. భవిష్యత్తులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ, ఆంధ్రల మధ్య నీటి వివాదం తలెత్తితే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. అంతేకాదు, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల పంపకం విషయంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల తగువేమీ ఉండబోదు. కాకపోతే, వినియోగంలోనే పేచీకి అవకాశముంది. దీన్ని నివారించేందుకు కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో చట్టబద్ధమైన అధికారాలతో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ మండలిని ఏర్పాటయ్యే అవకాశం ఉంది. భాక్రా, బియాస్ నిర్వహణ మండలి, తుంగభద్ర మండలి ఇలాంటి సమస్యల మీద పనిచేస్తున్నాయి.


తెలంగాణకు అడుగడుగునా అన్యాయం
ఇక విభజన జరిగితే నీటి యుద్ధాలు వస్తాయని చెబుతున్న సీమాంధ్ర నేతలు నీటి పంపకాల్లో ఇన్నాళ్లూ తెలంగాణకు జరిగిన అన్యాయాలను మాత్రం ప్రస్తావించడం లేదు. సమైక్య పాలనలో బేసిన్ పరిధిలో లేని రాయలసీమ ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించుకుపోయిన నేతలు బేసిన్‌లోనే ఉన్న తెలంగాణ భూములను ఎండబెట్టారు. కర్నూలు జిల్లా నేతలు దౌర్జన్యంగా రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్టీఎస్) పనికి రాకుండా చేశారు. ఈ పథకానికి 15.90 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నా సగానికి మించి నీరు రావడం లేదు. జూరాల ప్రాజెక్టు వాస్తవ డిజైన్‌ను మార్చి జీవం తీశారు. ఇక విద్యుదుత్పత్తి లక్ష్యంగానే ప్రారంభించిన శ్రీశైలం ప్రాజెక్టును నీటిపారుదల ప్రాజెక్టుగా మార్చి, తెలంగాణవాదులు అభ్యంతరం పెడుతున్నా పోతిరెడ్డిపాడు హెడ్‌గ్యులేటర్ సామర్ధ్యాన్ని నాలుగింతలు పెంచి రాయలసీమకు నీటిని తరలించుకుపోతున్నారు.బేసిన్‌లోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలను ఎండబెట్టి, బేసిన్ పరిధిలో లేని సీమ ప్రాంతాలకు నీటిని మళ్లించుకుపోతున్నారు. రాయలసీమకు ఒక్క ఎస్‌ఆర్‌బీసీకి మాత్రమే 19 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది. కానీ, వరద జలాల పేరిట కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల ద్వారా 100 టీఎంసీల నికర జలాలను తరలించుకుపోయేందుకు కుట్రలు పన్నుతున్నారు. తెలుగు గంగ కాలువ ద్వారా బేసిన్‌లో లేని సోమశిల(74 టీఎంసీలు), కండలేరు(68 టీఎంసీలు), వెలిగోడు(17 టీఎంసీలు) రిజర్వాయిర్లకు తరలించుకుపోతున్నారు. ఈ సీజన్‌లో పోతిరెడ్డిపాడు నుంచి 55 టీఎంసీలు తరలించుకుపోయారు. సీమాంధ్రలో ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి తెలంగాణ ప్రాజెక్టులను మూలకు పడేశారు. ఇక, గోదావరి విషయానికి వస్తే పుష్కలంగా నీరు ఉన్నా తెలంగాణ ఏర్పాటైతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు రావంటూ దారుణమైన అబద్దాలకు తెర తీశారు. వాస్తవలు ప్రచారాలు పరిశీలిస్తే తేలేదొక్కటే... మా పంట పండాలి.. మీ భూములెండాలి. అనేదే వారి వ్యూహం. తెలంగాణ భూములు ఎండినా సరే తమ ప్రాంతానికి రెండో పంటకు వీలుంటే మూడో పంటకు నీళ్లు మళ్లించాలి. తెలంగాణను శాపగ్రస్తగా ఇలాగే కొనసాగించాలి అనేదే వారి లక్ష్యం.


కిరణ్, జగన్‌ది అసత్య ప్రచారమే
- కేంద్ర జలసంఘం మాజీ సభ్యుడు విద్యాసాగర్‌రావు

హైదరాబాద్: తెలంగాణ వస్తే సీమాంధ్రకు నీళ్లు రావంటూ ముఖ్యమంత్రి కిరణ్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని కేంద్ర జలసంఘం మాజీ సభ్యుడు విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసమే వారు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి, పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన సోమవారం ‘టీ మీడియా’తో పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా కృష్ణా, గోదావరి నీటి పంపకాల్లో ఎలాంటి తేడా రాదన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై ఇప్పటికే ట్రిబ్యునల్ కేటాయింపులు చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటైనా నీటి వాటాలు యథాతథంగా ఉంటాయని, కృష్ణా జల పంపిణీని పర్యవేక్షించేందుకు ఓ కంట్రోల్ బోర్డు ఏర్పాటవుతుందని, కేటాయింపుల ప్రకారమే నీటి పంపిణీ జరిగేలా అది పర్యవేక్షిస్తుందని విద్యాసాగర్‌రావు వివరించారు. సీమాంధ్ర సర్కారు ఏలుబడిలో నీటి పంపిణీలో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లందన్నారు. తెలంగాణను ఎండబెట్టి, అన్యాయంగా సీమాంవూధకు నీటిని తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటైతే ఈ జల దోపిడీకి అడ్డు పడుతుందని, వారి డ్రామాలు చెల్లవనే ఉద్దేశంతోనే ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నీటి పంపకాలపై పూర్తి నిరాధారంగా, ఎలాంటి సాంకేతికత, హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా సీమాంధ్ర నేతలు వితండవాదన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయంపై అవసరమైతే రాష్ట్రేతర నిపుణుల చేత అధ్యయనం జరిపేందుకు సిద్ధమేనా అని విద్యాసాగర్‌రావు సవాల్ విసిరారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి