18, అక్టోబర్ 2013, శుక్రవారం

తుది నిర్ణయం పార్లమెంటుదే

Published on October 9, 2013   ·   1 Comment
ఈ రాష్ట్రాన్ని విభజించాలా ? వద్దా  ? అనే అంశంపై పూర్తి అధికారం పార్లమెంట్‌, రాష్ట్రపతికే ఉంది. దానిని నిలుపుదల చేసే అధికారం మాకు లేదు. ap high courtఅందుకే ఈ వ్యవహారంలో మేం జోక్యం చేసుకోలేమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 371 (డీ) రాష్ట్ర విభజనకు ఆటంకం కాదని తేల్చిచెప్పింది. కేంద్ర మంత్రి మండలి తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్త, జస్టిస్‌ కేసీ భానుతో కూడిన ధర్మాసనం విచారించి ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని కొట్టివేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 3 దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు రూపొందించారని, అధికరణ 371 (డీ) విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు, భద్రతకు సంబంధించిన అంశమని, ఈ రెండూ వేరు వేరని, ఆర్టికల్ 371(డి) ఉండగా విభజన వద్దని పిటీషనర్ వాదించడం సబబు కాదని కోర్టు స్పష్టం చేసింది. విభజనకు ఎందుకు వీలులేదు అనేందుకు పిటీషనర్ కూడా ఎలాంటి ఆధారాలు చూపలేదని కోర్టు తెలిపింది.   అధికరణ 3 రాజ్యాంగ మౌలిక సూత్రాలు, సమాఖ్య వాదానికి సంబంధించిన అంశమనీ, 371 (డీ) అధికరణ తదుపరి సవరించిన నిబంధన అనీ, దీన్ని సవాల్‌ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, మూల సూత్రాలను సవాల్‌ చేయలేమని ధర్మాసనం స్పష్టంచేసింది.
రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని సవరించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు లేవని పేర్కొంది. విభజన బిల్లును పార్లమెంట్‌లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే న్యాయస్థానం నిలుపుదల చేయలేదనీ, రాష్ట్ర విభజన, ఏర్పాటు అధికారం పార్లమెంట్‌కే ఉందని పలు కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిందని ఉత్తర్వులో పేర్కొన్నారు. రాజ్యాంగ మూలసూత్రాల్లో ఆర్టికిల్‌ 14 సమానత్వాన్ని, ఆర్టికిల్‌ 16 ఉద్యోగాల్లో సమానత్వాన్ని చెబుతున్నాయని అలాంటి వాటిని కూడా సవాల్‌ చేస్తామనడం అర్థం లేనిదని న్యాయస్థానం  వ్యాఖ్యానించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి