2, మార్చి 2012, శుక్రవారం

ఉత్తరాయణంలో దేవతలకు పగలు

 
మనకందరికీ నక్షత్రాలు 27 అని బాగా తెలుసు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాల లెక్కన 108 పాదాలుగా నక్షత్రాలు విభజించారు. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభజించారు. ఇందులో భాగంగా… సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలాగే… మకరరాశిలో సూర్యుడు ప్రవేశించినపుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి.  అందుచేత ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది… కాబట్టి.. దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతి సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే… ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంధ మరణాన్ని కోరుకున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి… ఉత్తరాయణ కాలంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, ఇంటి వాకిలిని రంగవల్లికలతో అలంకరించి ప్రతి నిత్యం సూర్యభగవానుడుని అనుగ్రహం పొందిన వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి