1, అక్టోబర్ 2012, సోమవారం

సాగర సంగ్రామం



- భాగ్యనగరిలో జిల్లా అగ్గిపిడుగులు
- బెడిసికొట్టిన పోలీసు వ్యూహం
- భారీగా తరలిన తెలంగాణవాదులు
- జనగామలో ఖాకీల ఓవరాక్షన్.. పలు రైళ్ల నిలిపివేత
- ఎమ్మెల్యే వినయ్, రహీ మున్నీసాకు గాయాలు
- నేడు రాస్తారోకోలకు జేఏసీ పిలుపు


నిప్పులు చెరిగే తుపాకీ రవ్వలు భగభగ మండే గుండెల ముందు సాగిలపడ్డాయి. వాటర్ కేనాన్లు, టియర్‌గ్యాస్ ప్రయోగాలు తెలంగాణ ఉక్కు సంకల్పం ముందు తునాతునకలయ్యాయి. కరడుగట్టిన తెలంగాణ ముందు ఖాకీవనం వణికిపోయింది. తెలంగాణ నేలపై సర్కారు భయానక వాతావరణం నెలకొల్పినా ఓరుగల్లు నెలవంకలు సాగరతీరాన్ని ముద్దాడారు. జనహోరుకెరటమై, త్యాగాలహారమై నెక్లెస్‌రోడ్డులో సమరశంఖం పూరించారు. ఉస్మానియా గడ్డమీద ఉరిమిన సింహాలోలె కాకతీయ బిడ్డలు కదనకవాతుచేశారు. ‘ఒడిసెల్ల రాళ్లు నింపి వడివడిగ గొట్టితేనే నీ మిల్ట్రీ పారిపోయెరో నైజాం సర్కరోడా’ అన్నట్టు సీమాంధ్ర సర్కారు కళ్లుబైర్లు కమ్మేలా ఓరుగల్లు వాసులు యుద్ధగీతం ఆలపించారు. దారికాసి పోలీసులు అడ్డగించినా, జనగామలో ఖాకీలే రైల్‌రోకోచేసినా, నిలదీసిన వారిపై లాఠీచార్జికి దిగినా ఉద్యమ కెరటం ఉవ్వెత్తున లేవకుండా ఆపలేకపోయారు.
- టీ మీడియా/ నెట్‌వర్క్తెలంగాణ జిల్లాలన్నీ కదం తొక్కాయి.. ప్రతీపల్లె పట్నం బాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం పది జిల్లాలనుంచి చిన్నా,
పెద్ద తేడాలేకుండా తరలివచ్చారు. సాగరహారానికి సై అంటూ సద్దికట్టుకుని బయలుదేరారు.. పోలీసుల నిర్బంధాలు, అరెస్టులు, బారికేడ్లు ప్రజల ఆకాంక్ష ముందు పటాపంచలయ్యాయి.. డప్పువాయిద్యాలు, ర్యాలీలు, జై తెలంగాణ నినాదాలతో భాగ్యనగర రోడ్లన్నీ మార్మోగాయి.. ఖాకీలు కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనంతో గమ్యాన్ని చేరుకున్నారు. రాజకీయపార్టీలు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ నేతలు, విద్యార్థులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ర్యాలీగా నెక్లెస్ రోడ్డుకు తరలివచ్చారు. జనసంద్రమైన నెక్లెస్ రోడ్డు సబ్బండ జాతరగా మారింది.. భారీ వర్షం సైతం ప్రత్యేక ఆకాంక్ష ముందు చిన్నబోయింది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ కదిలేది లేదని ‘సాగర తీరం’లోనే భీష్మించుకూర్చున్నారు.. అర్ధరాత్రి వరకూ అన్నపానీయాలు మాని అలుపెరుగని పోరు దీక్షలో నిమగ్నమయ్యారు.. -టీమీడియా, సిటీబ్యూరో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి