16, అక్టోబర్ 2012, మంగళవారం

71 లక్షలూ ఓ కుంభకోణమా?


  • ప్రశ్నించిన కేంద్రమంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ
  • వాద్రా భాగోతం వెనక్కి పోయిందని కాంగ్రెస్‌ సంతోషం
  • కేజ్రివాల్‌ ఆందోళన విరమణ
  • అలహాబాద్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు
అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలెదు ర్కొంటున్న కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను సమర్థిస్తూ సహచర మంత్రి, యుపి కాంగ్రెస్‌ నేత బేణీప్రసాద్‌ వర్మ సోమవారం చేసిన వ్యాఖ్యలు మరో దుమారాన్ని రేపాయి. ' సల్మాన్‌ ఖుర్షీద్‌ ఎప్పటినుండో రాజకీయాల్లో ఉన్నారు. 71 లక్షల రూపాయలకు సంబంధించి ఇప్పుడు వివాదం నెలకొని ఉంది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఖుర్షీద్‌ 71 లక్షల రూపాయల కోసం కుంభకోణం చేస్తారని ఎలా అనుకోగలం? అయినా ఇదొక కుంభకోణమా? ఇదేదో వందల కోట్ల కుంభకోణమైనట్లు మీడియా కూడా అతిగా ప్రచారం చేస్తోంది..' అన్న వర్మ వ్యాఖ్యలు యుపిఏ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టాయి.
సల్మాన్‌ను ఏకాకిని చేయం : అంబికా సోనీ, అజాద్‌
అవినీతి ఆరోపణల నేపథ్యంలో సల్మాన్‌ ఖుర్షీద్‌ను ఏకాకిగా వదిలేసే ప్రసక్తే లేదని మరో ఇద్దరు కేంద్ర మంత్రులు అంబికా సోనీ, గులాం నబీ అజాద్‌ ప్రకటించారు. ఖుర్షీద్‌ను ఏకాకిగా వదిలేయబోమని, ఆయనకు మద్దతు ఇవ్వకపోడమనే ప్రశ్నేలేదని అంబికా సోని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తున్న తరుణంలో తాజా పరిణామాలు ఆందోళనకరమని ఆమె వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ చేస్తున్న ఆరోపణలు పసలేనివని, సాక్ష్యాధారాలు లేనివని చెప్పారు. ఖుర్షీద్‌ వేరుగా చూడబోమని, ఆయన తప్పేది చేయలేదని స్పష్టం చేశారని గులాం నబీ అజాద్‌ అన్నారు. ఇదే విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఖుర్షీద్‌ విలేకర్లు అడిగిన ఏ ప్రశ్నకు బదులివ్వకపోగా థమ్స్‌అప్‌ సంకేతం చూపుతూ గడిపారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ , కాంగ్రెస్‌ మధ్య 'క్విడ్‌ ప్రో కో' ఫలితంగానే ఖుర్షీద్‌ ఆధ్వర్య ట్రస్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ నేత దిగ్విజరు సింగ్‌ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తన అభిష్టానుసారం దర్యాప్తు జరగాలని కేజ్రీవాల్‌ కోరుకుంటున్నారని విమర్శించారు. దర్యాప్తు విషయంలో ప్రభుత్వంపై తనకు విశ్వాసం లేదని కేజ్రీవాల్‌ ప్రకటించడంపై జెడియు అధినేత శరద్‌ యాదవ్‌ కూడా తప్పుబట్టారు.
ఖుర్షీద్‌ ట్రస్టుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి..
అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఖుర్షీద్‌, ఆయన భార్య నడుపుతున్న ట్రస్టుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులోని లక్నో భెంచ్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆర్‌టిఐ కార్యకర్త నూతన్‌ ఠాకూర్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు.
కేజ్రీవాల్‌ ఆందోళన విరమణ...
కేంద్ర మంత్రి ఖుర్షీద్‌ రాజీనామా కోరుతూ ప్రారంభించిన ఆందోళనను కేజ్రీవాల్‌ సోమవారం సాయంత్రం విరమించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకూ జంతర్‌మంతర్‌ను వీడేది లేదని రెండ్రోజుల క్రితం ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, ఎస్‌పి కుమ్మక్కై ఖుర్షీద్‌ను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. యుపి ప్రభుత్వం చేపట్టే విచారణ వల్ల ఒరిగేదేమీ ఉండబోదన్నారు. ఖుర్షీద్‌కు వ్యతిరేకంగా యుపిలో ప్రచారం చేస్తామని, ఆయనకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ఒక వికలాంగుడిని పోటీకి పెడతామని కేజ్రీవాల్‌ ప్రకటించారు.
కాంగ్రెస్‌లో ఆనందం...
కేంద్ర మంత్రి ఖుర్షీద్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా ఇబ్బందికి గురి చేసినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీలో మరో కోణంలో ఆనందం కనిపిస్తోంది. ఖుర్షీద్‌పై ఆరోపణలు బహిర్గతమయ్యే వరకూ సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా అవినీతిపై దేశవ్యాప్తంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఖుర్షీద్‌ ఉదంతం తెరపైకి రావడంతో వాద్రా వ్యవహారానికి అటు కేజ్రీవాల్‌ బృందం, ఇటు జాతీయ మీడియాలో ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో తమకు గొప్ప ఊరట లభించిందన్న భావన కాంగ్రెస్‌ నాయకత్వంలో కనబడుతోంది. మరోవైపు ఖుర్షీద్‌ రాజీనామా చేసే ప్రసక్తే ఉండదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ సోమవారం స్పష్టం చేశారు.
కన్నంలో ఖుర్షీద్‌
వికలాంగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధుల స్వాహా విషయంలో కేంద్ర మంత్రి, యుపి కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ పరిస్థితి కన్నంలో దొరికిన ఎలుకలా మారింది. ఒక టివి ఛానల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌తో ఈ ఉదంతం బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ కుంభ కోణానికి సంబంధించి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు కేజ్రీవాల్‌ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా ఖుర్షీద్‌ ఇప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. తనపై
వచ్చిన అవినీతి ఆరోపణలపై చాలా పేలవంగా స్పందించారు. కేజ్రీవాల్‌ సోమవారం ప్రజల ముందుంచిన మరిన్ని సాక్ష్యాల నేపథ్యంలో అవినీతి అక్రమాలు జరగాయని ఖుర్షీద్‌ అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమాధానాలు లేని ప్రశ్నలెన్నో...
ఖుర్షీద్‌, ఆయన భార్య లూసీ సారథ్యంలో విగలాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న జాకీర్‌ హుస్సేన్‌ మోమోరియల్‌ ట్రస్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి పలు పథకాల కింద నిధులు అందుతున్నాయి. వికలాంగులకు పరికరాల పంపిణీ, వారికి ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అందజేసే నిధులను అర్హులకు అందజేయడం ఇటువంటి ఎన్‌జిఒల పని. అయితే కేంద్రం నుండి పొందిన నిధులను లబ్ధిదారులకు అందించకుండా స్వాహా చేశారన్నది ఇప్పుడు జాకీర్‌ హుస్సేన్‌ ట్రస్టుపై ప్రధాన ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లో వికలాంగుల సంక్షేమం కోసం ఈ సంస్థ పనిచేస్తోదంటూ 2005లో నాటి యుపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సింగ్‌ కేంద్ర సామాజిక సంక్షేమ శాఖకు ఒక అఫిడవిట్‌ సమర్పించారు. ఈ అఫిడవిట్‌ ఫోర్జరీ సంతంకంతో రూపొందించారని కేజ్రీవాల్‌ ఆరోపించగా..తాను అటువంటి అఫిడవిట్‌ ఇవ్వలేదని సింగ్‌ కూడా తాజాగా స్పష్టం చేశారు. యుపిలోని దాదాపుగా 17 జిల్లాల్లో జిల్లా వైద్యాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి వికలాంగులకు సంబంధించిన తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నట్లుగా ఖుర్షీద్‌ సంస్థపై ఆరోపణలు ఇచ్చాయి. యుపిలోని పలు జిల్లాల అధికారులు ఈమేరకు తమ సంతకాలు ఫోర్జరీ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. 2009 తర్వాత వికలాంగుల కోసం ఖుర్షీద్‌ సంస్థ ఒక్క క్యాంపు కూడా నిర్వహించలేదనీ తాజాగా స్పష్టమైంది. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖుర్షీద్‌ ప్రదర్శించిన చిత్రాలు కూడా 2006, 2007 సంవత్సరాలవని కేజ్రీవాల్‌ బృందం ఆరోపిస్తోంది. స్థూలంగా ఫోర్జరీ సంతకాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలు వేటిపైనా ఖుర్షీద్‌ ట్రస్టు జవాబులు చెప్పలేకపోయింది. మరోవైపు లబ్ధిదారులుగా పేర్కొంటున్న పలువురు వికలాంగులను కేజ్రీవాల్‌ సోమవారం ఢిల్లీలో మీడియా ముందు ఉంచారు. తనకు కాలుకు సంబంధించిన అంగవైకల్యం ఉండగా, వినికిడి యంత్రాన్ని అధికారులు తనకు అందజేశారని మైన్‌పురి జిల్లాకు చెందిన పవన్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఖుర్షీద్‌ ట్రస్టుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు యుపి సిఎం అఖిలేష్‌ యాదవ్‌ సోమవారం ప్రకటించారు. విచారణలో నిజానిజాలు వెల్లడయ్యే వరకూ తాను ఖుర్షీద్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించలేనని ఆయన మీడియాతో అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి