17, అక్టోబర్ 2012, బుధవారం

భారత్‌లో ఆల్‌టైమ్ కుబేరుడు హైదరాబాద్‌ చివరి నిజాం

భారత్‌లో ఆల్‌టైమ్ కుబేరుడు హైదరాబాద్‌ చివరి నిజాం

  • ప్రపంచ ధనికుల్లో ఆరో స్థానం
  • బ్రిటన్‌ మేగజైన్ సర్వేలో వెల్లడి
  • చరిత్రలో అత్యంత ధనికులైన 24 మందితో జాబితా
ఇండియాలో ఆల్‌టైమ్‌ ధనవంతుడెవరు..? టాటానా..? లేక బిర్లానా. ఈ మధ్య దేశ వ్యాపార రంగాన్నే శాసిస్తున్న అంబానీలా..? వీరెవరూ కారంటోంది బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ మేగజైన్‌. హైదరాబాద్‌ చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ సబ్‌సే బడా అమీర్ అని తేల్చేసింది. ప్రపంచ అత్యంత ధనవంతుల్లో నిజాం ఆరో స్థానంలో నిలిచారని ఇండిపెండెంట్‌ తెలిపింది.

దేశంలోకెల్లా ఆల్‌టైమ్ అత్యంత ధనవంతుడెవరంటే మనకు ఎవరు గుర్తొస్తారు..? టాటా, బిర్లాలు లేదంటే ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తున్న అంబానీలు. ఎవరికైనా ఈ పేర్లే గుర్తుకొస్తాయి. కానీ ఇవేవీ కరెక్ట్‌ కాదంటోంది బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ పత్రిక. భారత్‌లో ఆల్‌టైం ధనికుడిగా కీర్తిని సొంతం చేసుకుంది హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ అని ఇండిపెండెంట్‌ సర్వేలో స్పష్టమైంది. సవరించిన ఆల్‌టైమ్ ప్రపంచ అత్యంత ధనికుల కొత్త జాబితాలో 236 బిలియన్ డాలర్ల సంపదతో నిజాం ఆరో ర్యాంకు సాధించారు. భారత్‌లో ఆల్‌టైమ్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ సంపద విలువ మన కరెన్సీలో దాదాపుగా 12 లక్షల 46 వేల కోట్లకు పై మాటే.

నిజాం వంశీకులు 1886 నుంచి 1948 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1967లో మరణించారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఎన్నో విలువైన ఆస్తులు ఈ వంశీకుల సొంతం. అందుకే ఉస్మాన్‌ అలీఖాన్‌ దేశంలోకెల్లా అత్యంత ధనికుడిగా రికార్డుల్లొకెక్కారు.మొత్తం చరిత్రలో అత్యంత ధనికుడిగా 14వ శతాబ్దపు ఆఫ్రికా రాజు మన్సా ముసా 1 మాలి నిలిచారు. ఈ జాబితాలో తొలిస్థానాన్ని మున్సా అధిష్టించారు. బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ ఈ వివరాలను వెల్లడించింది. 400 బిలియన్ డాలర్లతో మన్సా ముసా తిరుగులేని కుబేరుడిగా పేరుగాంచారు. కాగా ప్రస్తుతం అత్యంత సంపన్నుడిగా పేరొందిన కార్లొస్ స్లిమ్ ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచారు. సెలెబ్రిటీ నెట్‌వర్త్ వెబ్‌సైట్ మొత్తం 24 మందితో ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రస్తుతం బతికున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి