1, అక్టోబర్ 2012, సోమవారం

తెలంగాణ కవాతు

మార్చ్ విరమణ
kodanda-బురదమయమైన వేదిక పరిసరాలు.. నిలబడటానికీ వీల్లేదు
-అందుకే విరమిస్తున్నామన్న కోదండరాం
-పోరాటం కొనసాగుతుందని వెల్లడి
-అక్టోబర్ 2న ఇందిరాపార్కు వద్ద దీక్ష
-జేఏసీ ముఖ్యనేతల ఆమరణ నిరాహారదీక్ష
-తేదీలు, వివరాలు స్టీరింగ్ కమిటీలో నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (టీ మీడియా) : తెలంగాణ కవాతును ఆదివారం అర్ధరాత్రి టీజేఏసీ విరమించింది. భారీ వర్షం పడటం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, వర్షంతో వేదిక పరిసరాలు పూర్తిగా బురదమయమై, నిలబడటానికీ వీల్లేని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. అయితే, తెలంగాణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 2న ఇందిరాపార్కు వద్ద దీక్ష ఉంటుందని తెలిపారు. త్వరలోనే టీజేఏసీ ముఖ్య నేతలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణదీక్షకు దిగుతారని కోదండరాం ప్రకటించారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆరాటమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదే అని జేఏసీ చైర్మన్ అన్నారు. ఇక ముందు తమ పోరాటం కేంద్రవూపభుత్వంపై కాదని, తెలంగాణ మంత్రులపైనే అని తెలిపారు. ఢిల్లీ వెళ్లి తెలంగాణను తీసుకురావాల్సిన బాధ్యత వారిదేనన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని...దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కవాతు సందర్భంగా తమ వైపు నుంచి ఎలాంటి హింస జరగలేదని కోదండరాం ఉద్ఘాటించారు. అద్వితీయంగా జరిగిన తెలంగాణ మార్చ్ గురించి జాతీయ చానళ్లలో కూడా వార్తా కథనాలు వచ్చాయన్నారు. నిజానికి కవాతును కొనసాగించి ఉండేవారమని, వర్షం కారణంగా కూర్చోవటానికి కూడా వీలు లేని పరిస్థితులు ఏర్పడటం వల్ల విరమించాలని నిర్ణయించామన్నారు. దీనికి కారణం పోలీసుల నిర్బంధం అని చెప్పారు. నిర్బంధం వల్లనే శనివారం అర్ధరాత్రి వరకు ఉండి వేదికను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. నాలుగైదు టెంట్లు వేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు.

తెలంగాణ గెలిచింది.. ప్రభుత్వం ఓడింది..
తెలంగాణ మార్చ్ ద్వారా మనం విజయం సాధించామని టీజేఏసీ కో-కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య ప్రకటించారు. తెలంగాణ గెలిచింది..పభుత్వం ఓడిందన్నారు. పోరాటాన్ని కొనసాగించి తెలంగాణను సాధించుకుందామంటూ జై తెలంగాణ అన్న నినాదాలతో కవాతును ముగించారు.
అంతకు ముందు పోలీసు నిర్బంధ కాండ నేపథ్యంలో రాత్రంగా నెక్లెస్‌రోడ్డులోనే ఉండాలని టీజేఏసీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా అరెస్టు చేసిన ఉద్యమకారులు, ఉద్యోగులు, విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్చ్‌కు అనుమతి తీసుకువచ్చినట్లే తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులందరూ కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తే వెంటనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వస్తుందని అన్నారు. అందుకే రాజీనామాలు చేసైనా తెలంగాణను సాధించేందుకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ విషయంలో ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మార్చ్ సందర్బంగా కొన్ని మీడియా వాహనాలు ధ్వంసం కావటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోతే ఛానెల్ మార్చుకోవాలి తప్ప మీడియా వాహనాలను ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. అయితే ఆ సంఘటనలకు పాల్పడింది ఎవరనే విషయం మాత్రం తేలాల్సి ఉందన్నారు. ఇది పోలీసుల పని కూడా అయి ఉండే అవకాశాలు లేకపోలేదని అన్నారు. ప్రజలపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, కాల్పులు జరపడం వంటివి వెంటనే నిలిపివేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. పోలీసులు నెక్లెస్‌రోడ్డును వదిలి వేళ్లేంత వరకు మేం ఇక్కడే ఉంటామనే స్పష్టం చేశారు. గత మూడు సంవత్సరాలను ఉధృతంగా చేస్తున్న తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క చిన్న సంఘటన చోటు చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించినా ప్రజలకు ఇబ్బందులు కలిగించలేదన్నారు. ఇంతటి ఉద్యమంలో తమ పిల్లలే ఆహుతయ్యారు తప్పించి ఎవరిపైనా దాడులు జరగలేదని అన్నారు.

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయలేదని చెప్పారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన దీక్షగానీ, ఉద్యోగులు చూపించిన పోరాట ఫలితంగానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందనే ప్రకటన చేయించగలిగిందన్నారు. అయితే ఆంధ్ర పాలకులు కుట్రలు చేసి వచ్చే తెలంగాణను రాకుండా అడ్డుపడ్డారని చెప్పారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరి వల్లే సుమారు 1000మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి పేంచే దిశగానే మరో ప్రయత్నంగా తెలంగాణ మార్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి ప్రభుత్వం అనుమతించినట్లు నటించి, అన్ని విధాలుగా అడ్డుకుందని విమర్శించారు. రైళ్లు, బస్సులను నిలిపివేయటమేకాకుండా.. ప్రైవేటు స్కూలు బస్సులను కూడా రాకుండావూపభుత్వం అడ్డుకుని, ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకూ ఇక్కడే కూర్చుందామని అన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు ఆకుల భూమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్రం ప్రకటించే వరకు ఈ మార్చ్‌ను ఇదే విధంగా కొనసాగించాలని కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి