18, అక్టోబర్ 2012, గురువారం

'సత్యం'రాజుకు చెందిన రూ.822 కోట్ల నగదు నిల్వలు జప్తు

సత్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ గురువారం అత్యంత కీలక నిర్ణయం తీసుంది. సత్యం రామలింగ రాజుతో పాటు ఈ స్కామ్‌లో సంబంధం ఉన్న మరికొందరికి చెందిన 822 కోట్ల రూపాయలు విలువ చేసే నగదు నిల్వలను జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఎఫ్‌డీల రూపంలో ఉన్న ఈ నిధులను జప్తు చేశారు.

ఒక కేసులో ఇంత భారీ మొత్తంలో ఈడీ నగదు నిల్వలను జప్తు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎఫ్‌డీలు సత్యం కంప్యూటర్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ ఖాతాకు చెందినవని ఆదేశాల్లో పేర్కొంది.

అటా‌చ్‌మెంట్ చేసిన నగదు నిల్వలు ఆంధ్రాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకుల్లో ఉన్నాయి. కాగా, సత్యం కుంభకోణంలో మొత్తం 2171.45 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లగా ఇందులో ప్రస్తుతం 822 కోట్ల రూపాయలను రికవరీ చేసినట్టు అయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి