28, జూన్ 2012, గురువారం

ఇంత అన్యాయమా?


NewsListandDetails హైదరాబాద్‌, జూన్‌ 26, ప్రభాతవార్త: రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి గౌతంకుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌) తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన పట్ల వ్యవహ రిస్తున్న వైఖరిని నిరసనగా విఆర్‌ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిం చారు. డిజిపి నియామకం విషయంలో క్యాట్‌ తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ దానిని పరిగణనలోకి  తీసుకోకుండా రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విధి నిర్వహణలో నిబద్దత గల అధికారిగా పేరున్న గౌతంకుమార్‌కు మూడు డిజిపి పోస్టు వచ్చినట్లేవచ్చి చేజారింది. మూడు సార్లు కూడా కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ న్యాయం జరగలేదు. దీనితో ఆయన సన్నిహితుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన కంటే సీనియారిటీ తక్కువగా ఉన్న వి.దినేష్‌రెడ్డిని డిజిపిగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ గౌతంకుమార్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ దినేస్‌రెడ్డి నియామకం చెల్లదని, మూడు వారాల్లోగా అర్హుత, సీనియారిటీ కలిగిన అధికారిని నియమించాలని ఆదేశించింది. సీనియారిటీ జాబితాలో 1975 బ్యాచ్‌కు చెందిన గౌతంకుమార్‌ ఉన్నారు. క్యాట్‌ ఆదేశాల మేరకు 1977 బ్యాచ్‌కు చెందిన దినేష్‌రెడ్డిని తొలగించి తనకు అవకాశం ఇస్తారని గౌతం కుమార్‌ ఆశించారు. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ సంవత్సరం అక్టోబర్‌ నెలాఖరుకు గౌతంకుమార్‌ పదవీ విరమణ చేయనున్నారు.
కాగా గతంలో 2009 అక్టోబరు నెలలో ఎస్‌ఎస్‌పి యాదవ్‌ను డిజిపిగా తొలగించడంతో సీనియారిటీ ప్రకారం తనకు వస్తుందని ఆశించారు. అయితే అనూహ్యరీతిలో ఈ స్థానంలో ఆర్‌.ఆర్‌. గిరీష్‌కుమార్‌ నియమితులయ్యారు. అనంతరం 2010 ఆగస్టు 31వ తేదీన గిరీష్‌కుమార్‌ పదవీవిరమణ చేశారు. కొత్త డిజిపిల ఎంపిక జాబితాలో గౌతంకుమార్‌ పేరు కూడా కేంద్రప్రభుత్వానికి వెళ్లింది. అయితే మళ్లీ ఆయనకు ఆశాభంగమే మిగిలింది. 2010 సెప్టెంబర్‌ 1న కె.ఆరవిందరావు డిజిపిగా ఎంపికయ్యారు. 2011 జూన్‌ 30న ఆయన పదవీవిరమణ చేయడంతో మరోసారి గౌతంకుమార్‌ కంటే తక్కువ సీనియారిటీ ఉన్న వి.దినేష్‌రెడ్డి డిజిపిగా అదేరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ మూడు సంఘటనలపైనా ఎప్పటికప్పుడు గౌతంకుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తనకు అనుకూలంగా తీర్పును సాధించారు. అయితే ప్రతిసారి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరుగుతూ వస్తోంది. అయితే గత సంవత్సరంలో తనకు తప్పనిసరిగా వస్తుందని గౌతంకుమార్‌ ఆశించారు. చివరకు ట్రిబ్యునల్‌ తీర్పులు కూడా తనకు న్యాయం చేయలేకపోవడంతో ఆయన ప్రభుత్వ తీరును నిరసిస్తూ లేఖ రాశారు.
లేఖలో ఏముంది
రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ సుమారు 20 పేజీల సుధీర్ఘ లేఖను గౌతంకుమార్‌ రాశారు. దీనిని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఈ లేఖలో ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరును. నిబంధనలను అతిక్రమిస్తున్న విధానాన్ని సోదాహరణగా వివరించారు. కోర్టులను సైతం తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒకసారి సమర్థుడైన అధికారని ప్రభుత్వమే పేర్కొని, వెంటనే మరో లేఖలో దానికి వ్యతిరేకంగా పేర్కొంటూ వస్తోందని చెప్పారు. తన కేరీర్‌లో ఎటువంటి రిమార్కులు లేవని, సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందానని పేర్కొన్నట్లు సమాచారం.
తనను ఎందుకు డిజిపిగా నియమించలేదో ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. డిజిపిల నియామకాల సమయంలో అనుసరించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, వీటిని పాటించకపోవడమే కాకుండా, కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడానికి వక్రమార్గాలను అన్వేషిస్తోందని విచారం వ్యక్తం చేశారు. తనను మూడు సార్లు ప్రభుత్వం అన్యాయానికి గురిచేసిందని అన్నారు. తనకంటే ఎంతో జూనియర్లు అయిన అధికారులను డిజిపి వంటి కీలక పోస్టులను ఇవ్వడమే కాకుండా దానిని సమర్థించుకోవడానికి వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి