2, జనవరి 2012, సోమవారం

హజారే పై విమర్శలు, అవినీతి వ్యతిరేక ఉద్యమ విశ్లేషణ

అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంలో పోరాడుతున్నాడు. నిజానికి అన్నా హజారే పోరాడుతున్నాడు అనడం సమంజసం కాదు. అన్నా హజారే గానీ, ఆయన లాంటివారు గానీ వ్యక్తిగా తలపడి అవినీతి లాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక చెడుగు పై పోరాడడం సాధ్యమయ్యే పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా క్రెడిట్ అంతా ఆయన ప్రజలను కూడగట్టగలగడం లోనే ఉంది. అంటే అన్నా చరిత్ర, నిబద్ధత, భావజాలం, ఆచరణ ఇవన్నీ ప్రజలను కూడగట్టడంలో పాత్ర వహిస్తాయి. ఈ అంశాలు ప్రజలపైన ప్రభావం చూపి ప్రజలను ముందుకు కదిలిస్తాయి. ప్రజలను ఆయన వెంట నడిపిస్తాయి.
అన్నా వ్యక్తిగత నేపధ్యం
అన్నా హజారేకి ఒక చరిత్ర ఉంది. మామాలు చరిత్ర అందరికీ ఉంటుంది. కాని ఆయనకి ఉన్నది ఉద్యమ చరిత్ర. ఆ ఉద్యమ చరిత్ర ప్రజలను ఆకర్షించిన గుణాలలో ప్రముఖమైనది. రాజకీయ నాయకులు, అధికారుల అవినీతితో ఆయన అనేకసార్లు ఢీ కొట్టాడు. ఆయన జరిపిన పోరాటాలలో ఎంతవరకు సఫలం అయిందీ లోకానికి పెద్దగా తెలియదు గానీ పోరాడాడన్న కీర్తి ఆయనకి మిగిలింది. ముఖ్యంగా మహా రాష్ట్రలో ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అనేక సార్లు పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించాడు.
అన్నా హాజారే కీర్తి కిరీటంలో ఉన్న మరో కలికితురాయి ఆర్మీ నేపధ్యం. ఆర్మీ అనగానే దేశానికి రక్షణ అందించే సంస్ధగా ప్రజల్లో ఒక గౌరవ భావన ఉంటుంది. సరిహద్దుల్లో ఎడారుల్లో, చలిలో ఎండుతూ, తడుస్తూ దేశానికి కాపలా కాస్తుంటారనే భావన మధ్య తరగతి ప్రజల్లో అధికం. బ్లాగుల్లో కూడా ఈ భావాలు వ్యక్తం అవుతుంటాయి. ఇందువల్ల కూడా అన్నా హాజారే పట్ల గౌరవం మధ్యతరగతి ప్రజల్లో నెలకొని ఉంది. అయితే సైనికులతో సామాన్యుల అనుభవాలు వేరు. నిత్యం ప్రయాణికులు వెళ్లే రైళ్ళలో సైనిక కంపార్ట్‌మెంట్లలో ప్రజలకు సైనికులతో చాలా చేదు అనుభవాలు ఉంటాయి. వీరికి కేటాయించేవి జనరల్ కంపార్ట్ మెంట్లే కనుక, జనరల్ కంపార్ట్‌మెంట్లే అనుకుని సామాన్య జనం ఆ కంపార్ట్‌మెంట్లు ఎక్కేస్తుంటారు. కాని సైనికులు ప్రజలను తమ కంపార్ట్‌మెంట్లలోకి సామాన్య పౌరులను అనుమతించరు. చాలా మూర్ఖంగా బైటికి నెట్టేస్తారు. మామూలు ప్రయాణీకులు తెలుగులో జోక్ లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అవి తమనే అని భావిస్తూ కొట్టిన ఉదాహరణలు, కొట్టొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. రైళ్లలో సైనికులకి, రైల్వే పోలీసులకి ఘర్షణ జరిగి పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం పొందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది రాయడం ఎందుకంటె సైనికులపై ఉన్న అభిప్రాయాలలో ఆదర్శవంతమైన ఆలోచనలతో గౌరవభావం కలిగి ఉన్నవారి అభిప్రాయాలతో వాస్తవ అనుభవాలు కలిగి ఉన్నవారి అభిప్రాయాలకు పొంతన కుదరదని చెప్పడానికే. అయితే అన్నాకీ ఈ సైనికులతో సామాన్యుల అనుభవానికీ ఈ సందర్భంగా సంబంధం లేదని ఇక్కడ పాఠకులు గమనించాలి.
(ఈ భ్లాగర్ కి కూడా చేదు అనుభవం వారితో ఉంది. ఓ సారి వైజాగ్ వెళ్తుండగా కదిలే కంపార్ట్ మెంటు నుండి తోసివేసే ప్రయత్నం చేయడంతో మెట్లపైన నిలబడవలసి వచ్చింది. నేను మెట్లపైన నిలబడి ఉండగానే వారు తలుపు వేసేసి గడి పెట్టేశారు. నేను మళ్ళీ లోపలికి రాకుండా వారాపని చేశారు. నాతోటి వచ్చిన మరొక వ్యక్తి వీళ్ల దృష్టిలో పడకపోవడంతో లోపలే ఉండిపోయాడు. అతను చాలాసేపు వాళ్ళని బ్రతిమిలాడాడు. నేను కూడా బైటి నుండి పెద్ద పెద్దగా అరుస్తూ వచ్చీ రాని హిందీలో తరువాతి స్టేషన్ లో దిగుతానని చెబితే, చాలసేపటికి లోనికి రానిచ్చారు. ఇరవై ఐదు నిమిషాలసేపు స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ మెట్లపైనే ఉండవలసి రావడం నేను అప్పట్లో అనుభవించిన ఒక భయానక అనుభవం. వారాపని చాలా తేలికగా చేశారు).
అన్నా హాజారే ఒక ఆదర్శ గ్రామాన్ని నిర్మించాడన్న విషయం కూడా అన్నా పై గౌరవానికి ఒక కారణం. రాలేగావ్ సిద్ధి అనే తన గ్రామంలో ఆయన ఆదర్శవంతమైన సూత్రాలను అమలు జరుపుతున్నాడని జనరల్ గా ఉన్న వినికిడి. అది నిర్ధిష్టంగా ఆయన నిజంగా గ్రామంలో ఏమేమి ఆదర్శ సూత్రాలు ఏ పద్ధతుల్లో అమలు జరిపిందీ పెద్దగా తెలియని విషయం. అది ఆ రాష్ట్రంలో ప్రచారంలో ఉండవచ్చు గాని ఇతర రాష్ట్రాలలో ఆయన గ్రామం ఆదర్శం అని మాత్రమే ప్రచారం లో ఉంటుంది. ఇవన్నీ కాక గాంధీ సిద్ధాంతాల అనుయాయి అన్న పేరు ఉండనే ఉంది. జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలను రాజకీయ నాయకులంతా విసర్జించిన, మర్చిపోయిన పరిస్ధితుల్లో, ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తున్నాడని భావిస్తున్న ఒకే ఒక్క వ్యక్తికి ఉండే గౌరవం వేరే. పెద్దగా పేరు లేకుండా గాంధీ సూత్రాలను అనుసరిస్తున్నవారు ఇంకా ఉన్నా వారికి పేరు లేదు, సందర్భమూ కాదు గనక వదిలేద్దాం.
ఈ చరిత్ర లేకుండా ప్రస్తుతం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకి స్ధానం లభించేది కాదు. ఆయన లేకుంటే ఉద్యమమే ఉండేది కాదు అని కొందరు వెంటనే అనే అవకాశం ఉంది. అది కరెక్టు కాదు. వ్యక్తులపైన ఉద్యమాలు ఆధారపడి ఉండవు. సమాజంలో లేదా దేశంలో నెలకొని ఉన్న పరిస్ధితులపైనే ఉద్యమాలు ఆధారపడి ఉంటాయి.
అవినీతి వ్యతిరేక ఉద్యమం, అన్నా నాయకత్వం
అవినీతి వ్యతిరేక ఉద్యమం తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులు, అధికారులు, రౌడీలు తదితర వర్గాలన్నీ పాల్పడుతున్న అవినీతి పచ్చిగా కళ్ళెదుట కనిపిస్తున్న పరిస్ధితి దేశంలో నెలకొని ఉంది. ముఖ్యంగా యు.పి.ఎ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక వరుసగా వెలువడ్డ కుంభకోణాలు ప్రజల్లో రాజకీయ నాయకుల అవినీతి పట్ల తీవ్రమైన ఆగ్రహాన్నీ, వ్యతిరేకతనూ రగిల్చాయి. వాటిలో 2జి స్పెక్ట్రం కుంభకోణం అవినీతి కుంభకోణాల్లో రారాజుగా ప్రసిద్ధి కెక్కింది. మాజీ టెలికం మంత్రి ఎ.రాజా దర్జాగా పాల్పడిన ఈ ‘రారాజు’ కుంభకోణం దేశ ప్రజలను నివ్వెరపరిచింది. మెజారిటీ ప్రజానీకం అయిన కార్మికులు, రైతులు, కూలీలు వీటికి దూరంగా ఉన్నా, చిన్న పట్టణాలనుండి మెట్రోపాలిటన్ నగరాల వరకూ విస్తరించి ఉన్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాలు, చిన్న పెట్టుబడిదారులు, వ్యాపారులు వీరంతా ఈ అవినీతి కుంభకోణాల పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. తమకు అవకాశం వస్తే అవినీతి రాజాలను ఒక చూపు చూడాలి అన్న ఆవేశం ఈ కుంభకోణాలు వీరిలో రగిల్చాయి. ఈ నేపధ్యం లేకుండా, దేశంలో ఈ పరిస్ధితి లేకుండా అన్నా వెంట, ఆయన నేపధ్యం, పేరు, ప్రతిష్టలు ఏమైనప్పటికీ, జనంలో స్పందన వచ్చి ఉండేది కాదు.
ఉద్యమాలకు సారవంతమైన భూమి(క) సమాజంలో లేనట్లయితే ఎంతమంది మహామహులు గోచి బిగించినా పూచిక పుల్లను కూడా కదిలించలేరు. స్వాతంత్ర పొరాటానికి గాంధీ వెంట ప్రజలు కోట్లమంది కదిలారు గానీ, అవినీతి వ్యతిరేక ఉద్యమం ‘మరో స్వాతంత్ర్య పోరాటం’ అని అన్నా హజారే ఎన్ని సార్లు నినదించినా దాన్ని పట్టించుకున్నవారు, ఆలకించినవారు లేదని గమనించాల్సిన విషయం. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి స్పందన వచ్చింది తప్ప ఆయన చెప్పిన ‘మరో స్వాతంత్ర్య పోరాటానికి’ స్పందన రాలేదని గమనించాలి. దానికి కారణం అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సమీప భూమిక ప్రస్తుతం దేశంలో ఉంది తప్ప ‘మరొ స్వాతంత్ర పోరాటం’ అని ఆయన చెప్పినదానికి తగిన భూమిక ‘ప్రజల్లో’ లేకపోవడమే. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఉపయోగపడిన అన్నా హజారే ఉద్యమ చరిత్ర, పేరు ప్రతిష్టలు, ‘మరో స్వాతంత్ర్య పోరాటా’నికి ఎందుకు ఉపయోగపడలేదు? అదే పేరు, అవే ప్రతిష్ట ఒక పిలుపుకి ఉపయోగపడి, మరొక పిలుపుకి పనికిరాకుండా పోవడం వెనక ఏ విషయాన్ని గమనించాలి? పిలుపుకి స్పందన, ఉద్యమానికి వ్యాప్తి అన్నవి వాటికి గల సామాజిక భూమికపైనే ఆధారపడి ఉన్నాయనీ, ఉద్యమ నాయకుల వ్యక్తిగత
పేరు ప్రతిష్టలలో లేదన్న విషయాన్ని గ్రహించాలి. ఉద్యమాలకు సామాజిక  భూమిక తప్పనిసరి అవసరం. ఈ వాస్తవానికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో, అంగీకార అనంగీకారాలతో సంబధం లేదు.
మరొక విషయం కూడా ఇక్కడ గమనించాలి. పిలుపు, నినదాలకి అంత ప్రాముఖ్యం ఇవ్వవచ్చా అని అనుమానం రావచ్చు. ఖచ్చితంగా ఇవ్వాలని మిత్రులు, పాఠకులు గమనించాలి. ఒక ఉద్యమం ఇచ్చే ప్రధాన పిలుపుపైన ప్రజా స్పందన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఆ ప్రధాన పిలుపు అప్పటి సామాజిక, (రాజకీయ, ఆర్ధిక) పరిస్ధితులకు అనుగుణంగా, సమీపంగా ఉన్నట్లయితేనే అది ప్రజాదరణ పొంది దాని చుట్టూ ప్రజలు సమీకృతులవుతారు. 2008 లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రానట్లయితే, అందులో వాల్ స్ట్రీట్ లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధల అవినీతి, పేరాశ, దోపిడీ బైటపడకపోతే, ‘ఆకుపై వాల్ స్ట్రీట్!’, ‘వుయ్ ఆర్ 99%!’ నినాదాలకు ఇనాడు ప్రపంచవ్యాపితంగా వస్తున్న మద్దతు వచ్చి ఉండేది కాదని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ‘అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన లోక్ పాల్ కై ఉద్యమిద్దాం!’ అన్న నినాదానికి సమీపంగా నేటి సామాజిక పరిస్ధితి ఉంది. అందుకే ఆ నినాదానికి స్పందన వచ్చింది. స్వాతంత్ర పోరాటం అనగానే అది ఎవరీపైన అన్న ప్రశ్న వెంటనే ఉదయిస్తుంది. దానికి సమాధానం లేకపోవడంతో ప్రజల్లో స్పందన కరువైంది.
ఇటీవలి కుంభకోణాలు
ప్రపుల్ పటేల్ – యు.టి.ఐ కుంభకోణం,  మహారాష్ట్రలో ఆదర్శ సొసైటీ అపార్టుమెంటుల కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, మాయావతి తాజ్ కారిడార్ మరియు విగ్రహాల కుంభకోణాలు, ఓటుకి నోటు కుంభకోణం, పార్లమెంటు ప్రశ్నలకు డబ్బుల కుంభకోణం, యు.పిలో అనేక మంది సిటింగ్, రిటైర్డ్ జడ్జిలు పాల్పడిన పి.ఎఫ్ కుంభకోణం, సత్యం కంప్యూటర్స్ ఆడిటింగ్ కుంభకోణం లాంటి కార్పొరేట్ కంభకోణాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ‘నాఫెడ్’ కుంభకోణం, దేవుడి డాక్టర్ అశోక్ జడేజా పాల్పడిన ‘ఆధ్యాత్మిక’ కుంభకోణం, ఛత్తీస్ ఘడ్ ‘దొంగ ధాన్యం’ కుంభకోణం, కర్ణాటకకు చెందిన ఇనుము తుక్కు (ఉక్కు కాదు) కుంభకోణం,ఆస్త్రా కోక్ బోగస్ ట్రాన్సాక్షన్ల (కార్పొరేట్) కుంభకోణం, తమిళనాడు గోల్డ్ క్వెస్ట్ (కార్పొరేట్) కుంభకోణం, ఎల్.ఐ.సి (రైల్వేస్) కుంభకోణం, గుజరాత్ కాండ్లా పోర్ట్ ట్రస్టు భూ కుంభకోణం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యాపిటేషన్ ఫీజు (సీట్ ఫర్ సేల్) కుంభకోణం, లలిత్ మోడి ఐ.పి.ఎల్ కుంభకోణం (ఇందులో శరద్ పవార్ పేరు బైటికి రాకుండా చేశారన్నది ఒక అభియోగం), కేరళ పామాయిల్ కుంభకోణం, జార్ఖండ్ మధు కోడా అక్రమాస్తుల కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కుంభకోణం, ఎమార్ విల్లాల కుంభకోణం…….. ఇవన్నీ భారత దేశ వ్యాపితంగా జరిగిన కుంభకోణాలు, వీటిలో కొన్ని దేశ వ్యాపితంగా ప్రాచుర్యం పొందగా, చాలా వరకు ఆయా రాష్ట్రాల ప్రజల వరకే ప్రచారం పొందాయి.
నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి
నిజానికి జాతీయ పత్రికలు ఈ కుంభకోణాలన్నింటినీ ప్రచురించినప్పటికీ అవన్నీ జాతీయ స్ధాయిలో తగిన ప్రచారం పొందలేకపోయాయి. దానికి ప్రజల జ్ఞాపక శక్తి పరిమితులకి అతీతమైన సంఖ్యలో కుంభకోణాలు చోటు చేసుకోవడం ముఖ్య కారణం. గతంలో బోఫోర్స్ కుంభకోణంలో గల్లంతయిన ప్రజాధనం కేవలం అరవై నాలుగు కోట్లు మాత్రమే. కాని ఈ దేశంలో ప్రధాన రాజకీయ వంశం అయిన గాంధీలు ఈ కుంభకోణంలో ఉండడంతో అది విస్తృత ప్రచారం పొందింది. కాంగ్రెసేతర పార్టీలు అధికారంలోకి రావడానికి జరిగిన తీవ్రమైన ప్రయత్నాలలో భాగంగా కూడా ఈ కేసు బహుళ ప్రచారం పొందింది. అప్పట్లో సంవత్సరానికి ఒక కుంభకోణం బైటపడడం కూడా గగనమే. కుంభకోణాల సంఖ్య కూడా తక్కువగానే ఉండడం, కుంభకోణాలలో గల్లంతైన మొత్తం తక్కువగా ఉండడంతో బైటికి వచ్చే కుంభకోణాల సంఖ్య కూడా తక్కువే. దానికి కారణం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగం. ప్రభుత్వ రంగం దేశంలో ఆధిపత్యం వహించినపుడు కుంభకోణాలకు పాల్పడే అవకాశం కేవలం కొన్ని రంగాలకే పరిమితమైంది. పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడే అవకాశం కూడా అప్పుడు తక్కువ. రక్షణ రంగం, మౌలిక నిర్మాణాల రంగం లాంటివి మాత్రమే కుంభకోణాలకు అనువుగా ఉండేవి. కాని నూతన ఆర్ధిక విధానాలు అమలు కావడం మొదలయ్యాక సమస్త రంగాలలో ఉన్న దేశ సంపదలు రాజకీయ రంగం లోనూ, బ్యూరోక్రసీ లోనూ ఉన్న  వ్యక్తులకు అందుబాటులోకి వచ్చాయి.
అది కూడా అత్యంత తేలికగా అత్యంత సమీపంగా అత్యంత తక్కువ స్క్రూటినీతో ఆర్ధిక విధానాలలో భాగంగానే ఇలా ప్రజా సంపద నిలువుదోపిడికి వీలుగా చేరువగా వచ్చింది. అప్పటివరకూ ఉన్న పటిష్టమైన భూ పరిమితి చట్టాల నుండి, స్వదేశీ విదేశీ ప్రవేటు పెట్టుబడి పరిమితి చట్టాల వరకూ అనేక చట్టాలు ఈ కుంభకోణాలను నివారించాయి. నూతన ఆర్ధిక విధానాల ప్రవేశంతో ఈ చట్టాలన్నీ మార్చివేశారు. ఏ అంశమూ, ఏ రంగమూ కుంభకోణాలకు అతీతంగా ఉండలేని పరిస్ధితి నెలకొంది. సరళీకృత ఆర్ధిక విధానాల కారణంగా చట్టాలు, ఆర్ధిక విధానాలు, పన్నుల విధానాలు, లైసెన్సింగ్ విధానాలు అన్నీ సమస్తం సరళతరం కావడంతో రాజకీయంగా ఏమాత్రం పలుకుబడి ఉన్నా, బ్యూరోక్రసీ అధికారులు ఏమాత్రం రాజకీయ నాయకులకు లొంగి ఉన్నా పదుల కోట్ల నుండి వేల కోట్లను దాటి లక్షల కోట్ల వరకూ కుంభకోణాలకు పాల్పడడానికి దండిగా అవకాశాలు చేజిక్కాయి. భారత దేశ పాలకులు నూతన ఆర్ధిక విధానాలను అనుసరించిన ఫలితంగా ఏర్పడిన ఉప ఉత్పత్తి (బై ప్రొడక్టు) మాత్రమే ఇది. ఉప ఉత్పత్తి విలువే లెక్కకు అందనంత రీతిలో ఉన్నపుడు ఇక స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలు నొల్లు కుంటున్న సంపద, రాజ మార్గాలలో ఆర్ధిక విధానాలు సమకూర్చిన లైసెన్సుల సాక్షిగా తరలివెళ్తున్న ప్రజాధనం ఎంత ఉంటుందో లెక్కగట్టడానికి వందమంది రామానుజంలు అవసరం పడవచ్చు.
లైవ్ మింట్ డాట్ కామ్ వార్తా పత్రిక, కార్పొరేట్ అవినీతి పైన గత సంవత్సరం ఒక నివేదిక ప్రచురించింది. ఆడిట్, కన్సల్టింగ్ సంస్ధ కె.పి.ఏం.జి సర్వే జరిపి తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం 2008, 2009 సంవత్సరాలలో భారత దేశంలోని 87 శాతం కంపెనీలలో ఆర్ధిక మోసాలు జరిగాయట. ఈ నివేదిక కంపెనీలు పాల్పడిన మోసాల గురించి చెప్పలేదు. కేవలం కంపెనీల లోపల జరిగిన మోసాల పైనే మాట్లాడింది. 2008 లో ఇదే సంస్ధ జరిపిన సర్వేలో 47 శాతం కంపెనీలలో మాత్రమే ఆర్ధిక మోసాలు జరిగాయని వెల్లడి కాగా మరో సంవత్సరం గడిచేసరికి 87 శాతానికి పెరిగింది. వెయ్యి కంపెనీలు సర్వేలో పాల్గొనగా అందులో 870 కంపెనీల్లో మోసాలు జరిగాయట! ఇవి పెరగడానికి సర్వే సంస్ధ చెప్పిన కారణాలలో ముఖ్యమైనవి బలహీనమైన నియంత్రణ వ్యవస్ధ (రెగ్యులేటరీ ఎన్విరాన్ మెంట్) ఉండడం, ఆడిట్ కమిటీలు సీనియర్ మేనేజర్ల కార్యకలాపాలపైన పెద్దగా తనిఖీ చేయకపోవడం, స్వతంత్ర అంతర్గత ఆడిట్ లు జరగకపోవడం. వీటిలో కూడా మొదటి రెండూ ప్రధానమైనవి గా గుర్తించాలి. కంపెనీలు ప్రకటించే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ (బ్యాలన్స్ షీట్) లలోనే మోసం జరగడం ఇండియా ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం అని పదవ ఇండియా ఫ్రాడ్ సర్వే రిపోర్ట్ – 2010 వెల్లడించిందని ఇదే వెబ్ సైట్ తెలిపింది. నైతిక విలువలు పతనం కావడం, బలహీన అంతర్గత ఆడిటింగ్, మోసకారులపై చర్యలు లేకపోవడం వల్ల మోసాలకు అనుకూల వాతావరణం కల్పించాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. మదుపరులు ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లపైనే ఆధారపడి షేర్లలో మదుపు చేస్తారు కనక ఇది నిజంగానే పెద్ద ప్రమాదం. సత్యం రామలింగ రాజు అయిదేళ్ళుగా దొంగ లెక్కలు చూపినా, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రైస్ వాటర్ కూపర్స్ ఆడిటింగ్ సంస్ధ చూసీ చూడనట్లు వదిలేసింది. రాజు మోసం బైటపడ్డాక అనేకమంది సామాన్య మదుపరులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. సత్యం పాల్పడిన మోసం ఐదువేల కోట్ల రూపాయలు కాగా మదుపరుల నష్టం తోడైతే ఆ మోసం ఎన్ని రెట్లు పెరుగుతుందో చెప్పలేం.
ఇలా బ్యాలన్స్ షీట్లలో మోసాలను ఈ విదేశీ ఆడింటింగ్ సంస్ధలు, రేటింగ్ సంస్ధలు ఇండియాకు సరికొత్త రీతుల్లో పరిచయం చేశాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. విదేశీ బహుళజాతి ద్రవ్య సంస్ధలు (ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్ధలు) ప్రపంచంలోని ద్రవ్య కార్యకలాపాలలోనూ, మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి కంపెనీల ఆర్ధిక కార్యకలాపాలలోనూ మెజారిటీని (దాదాపు అన్నీ అంటే సరిగ్గా ఉంటుంది) తమ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తాయి. వీటి పనల్లా ఆయా దేశాలలోని చట్టాలకు దొరక్కుండా, పన్ను పోట్లకు గురి కాకుండా, గరిష్ట లాభాలు సమకూరేలా వివిధ ఆర్ధిక, ద్రవ్య కార్యక్రమాలను కంపెనీలకు, ఫ్యాక్టరీలకూ, ట్రస్టులకు, హెడ్జ్ ఫండ్లకు, మ్యూచువల్ ఫండ్లకు పూర్తి చేసి పెట్టడమే. ప్రభుత్వాల కోసం ఒక సెట్ డాక్యుమెంట్లు, కేవలం కంపెనీల కోసం మరొక సెట్ డాక్యుమెంట్లు తయారు చెయ్యడం వీరి పని. అంటే ప్రభుత్వాలను సమర్ధవంతంగా మోసం చేసే పనిని ఈ సంస్ధలు చేసిపెడతాయన్నమాట! కంపెనీల విలీనాలు మరియు స్వాధీనాలు (Mergers & Acquisitions), అమ్మకాలు కొనుగోళ్ళు, పబ్లిక్ ఇష్యూల జారీలు, కంపెనీలను విడగొట్టడం, కంపెనీల పునర్వ్యవస్ద్ధీకరణ, కంపెనీల విస్తరణ, షేర్ల విస్తరణఒకటేమిటి, కంపెనీలను మూసివెయ్యడంతో సహా, ఆధునిక ఆర్ధిక ద్రవ్య కార్యకలాపాలు సమస్తం వీరి చేతులమీదుగా జరగాల్సిందే. వీరు లేకపోతే కంపెనీలు మోసాలు చెయ్యడం అసలు సాధ్యం కాదు. అందుకే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం జరిగాక వాల్ స్ట్రీట్ కంపెనీల (ఇంకా ప్రపంచ వ్యాపితంగా ఉన్న అలాంటి కంపెనీలతో సహా) పైన నియంత్రణలు పెంచాలని జి-20 గ్రూపు దేశాల వరుస సమావేశాలు నిర్ణయించాయి. ఈ సమావేశాలలోనే ఇవే మోసపూరిత కంపెనీలకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను బెయిలౌట్లుగా పంచాలని కూడా నిర్ణయించారు. కంపెనీలకు బెయిలౌట్లయితే పంచారు గానీ వాటిపైన నియంత్రణలు విధించ లేకపోయారు. ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం ఈ కంపెనీల చేతుల్లో ఉండగా వీరిని కాదని వీరిపైనే నియంత్రణలు విధించడం ప్రభుత్వాల వల్ల కాలేదు, కాదు కూడా. జి-20 సమావేశాల్లో తీర్మానం చేశాం కనుక నామ మాత్రంగానైనా కొత్త నియంత్రణలు ఒకటి రెండూ చేస్తామని అమెరికా ప్రభుత్వం విన్నపాల మీద విన్నపాలు చేసుకున్నా వీరు ససేమిరా అన్నారు. వాల్ స్ట్రీట్ కంపెనీలకు అమెరికా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ (కాంగ్రెస్ లో దీనికే మెజారిటీ ఉంది) పూర్తి మద్దతు ఇవ్వడంతో ఒక్క నియంత్రణ చర్య కూడా అమెరికా ప్రభుత్వం తీసుకోలేకపోయింది. అలాగని డెమొక్రాట్ పార్టీ కంపెనీలపై చర్యలకు అనుకూలమని కాదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నామ మాత్రపు చర్య మాత్రమే అది కోరుకుంది. అమెరికాలోనే కాదు. ఏ దేశంలో నైనా ఇదే తంతు. ఇతర దేశాలలోని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్ధలకూ, సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధల అనుబంధిత ఆర్ధిక వ్యవస్ధలుగా మారిన మూడో ప్రపంచ దేశాలకూ అమెరికా ఆర్ధిక వ్యవస్ధే మార్గదర్శకత్వం వహిస్తున్నందున అక్కడ జరగనిది ఇతర దేశాల్లో జరిగే అవకాశం లేదు. ఇతర దేశాల్లో సైతం రాజకీయ పార్టీలకు కార్పొరేట్ రంగమే నిధులు అందిస్తుంది కనుక అక్కడ కూడా కార్పొరేట్ కంపెనీలపైన చర్యలు తీసుకునే అవకాశం లేదు లేదా అతి తక్కువ. పైగా ప్రపంచ వ్యాపితంగా ఉన్న చిన్నా పెద్దా కంపెనీలన్నీ ఫేస్ బుక్ లోగోలో కంటే క్లిష్టంగా ఒకదాని కొకటి సంబంధ బాంధవ్యాలతో పరస్పరం పెనవేసుకుపోయినందున వాటి ఆర్ధిక సూత్రాలు యూనివర్సలైజ్ అయిపోయాయి.
ఈ నేపధ్యంలో భారత దేశంలో అనేక రేట్లు పెరిగిన అవినీతిని నూతన ఆర్ధిక విధానాల ప్రవేశంతో విడదీసి చూడడం అసాధ్యమైన సంగతి. కనుక అవినీతిని ప్రస్తావించుకున్నపుడు, దానికి వ్యతిరేకంగా పోరాడాలని సిద్ధ పడినప్పుడు, అవినీతి పరులను ఉరితీయాలని కూడా ప్రకటనలు ఇస్తున్నపుడు, అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగంగా ఈ దేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కూడా సిద్ధపడినప్పుడు, అవినీతిని అనేక రెట్లు పెంచిన నూతన ఆర్ధిక విధానాలకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండగలగడం అసాధ్యం. నూతన ఆర్ధిక విధానాలు తెచ్చిన చేటు గురించి ప్రస్తావించకుండా, అవినీతికి భూమికగా ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్ధిక కారణాలను ప్రస్తావించకుండా, ముఖ్యంగా ఆర్ధిక విధానాలను ప్రస్తావించకుండా, ఆ అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటం నామమాత్రంగానే ఉంటుంది తప్ప నిర్ణయాత్మకంగా ఉండజాలదు.
భారత రాజకీయ పార్టీలవన్నీ ఒకే ఆర్ధిక విధానాలు
చిత్రం ఏమిటంటే తమ సంపదలకు ఆయువు పట్టు అయిన అవినీతి సంపాదనపైనే అన్నా హజారే గురి పెట్టినప్పటికీ రాజకీయ నాయకులు కూడా అన్నా హాజారే పట్ల పైకి గౌరవ, మర్యాదలు ప్రకటించారు. బి.జె.పి లాంటి జాతీయ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఆర్.ఎస్.ఎస్ లాంటి సంస్ధలు సైతం ఆయన ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాక క్రియాశీలక పాత్ర కూడా పోషించాయి. కార్యకర్తలను సరఫరా చేసి ప్రజలను కూడగట్టడానికి సహాయంగా నిలిచాయి. ఆర్.ఎస్.ఎస్ అధినేత స్వయంగా అన్నా ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగు దేశం, అన్నా డి.ఏం.కె, డి.ఏం.కె లాంటి దక్షిణాది పార్టీలే కాక ఉత్తరాదిన ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చరిత్ర ఉన్నప్పటికీ అన్నా ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వనివాడిదే పాపం అన్నట్లుగా మద్దతుల పర్వం సాగింది. ఎ.రాజా, గాలి జనార్ధన రెడ్డి, కనిమొళి లే మద్దతు ఇవ్వకుండా మిగిలారని అప్పట్లో జోకులు పేలాయి కూడా. అన్నా వెనుక జన సమీకరణ జరగడమే దీనికి కారణమని వేరే చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్నాకి మద్దతు ఇవ్వకుండా లేరు. ప్రధాని, సోనియా, రాహుల్ లాంటి ప్రధాన నాయకులు అన్నాకి మద్దతు ఇచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఐతే అన్నా ప్రాణాలు దేశానికి అవసరమనీ, ఆయన సేవలు భవిష్యత్తులో కూడా దేశానికి అవసరమనీ, కనుక అన్నా నిరాహార దీక్ష విరమించాలనీ ఆగష్టు నిరాహార దీక్ష సందర్భంగా నేరుగా పార్లమెంటులోనే విన్నవించుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని అణచి వేయడమే ప్రభుత్వానికి తెలుసు తప్ప ఇలా విన్నపాలు చేసుకోవడం మున్నేన్నడూ ఎరగనిది. అన్నా ఉద్యమం వెనుక ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమీకృతులవుతున్న కారణంగానే ఈ అసాధారణ పరిస్ధితి నెలకొంది. ఇంకొక పరిస్ధితిని కూడా మనం చెప్పుకుని తీరాలి.
అన్నా మొదటిసారి అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు పూనుకున్నపుడు దేశంలో ఉన్న జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితులను కూడా మననం చేసుకోవడం అవసరం. ఆ సమయంలో అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే అరబ్ విప్లవాల వెల్లువ కొనసాగుతోంది. అరబ్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ట్యునీషియా, ఈజిప్టులలో నియంతృత్వ ప్రభుత్వాలు నేల కూలాయి. నియంతృత్వ ప్రభుత్వాలు నేల కూలినా ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి బదులు మళ్ళీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల ప్రాపకంలో ఉన్న అక్కడి సైనిక వ్యవస్ధలే అధికారం చేజిక్కించుకున్నాయన్నది నిష్టుర సత్యం. సందర్భం కానందున దానికి గల కారణాల చర్చను వదిలేద్దాం. (ఈ అంశంపై ఇంతకు ముందే ఈ బ్లాగ్ లో వ్యాస పరంపరను ప్రచురించాను. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ 1, 2, 3, 4 చూడగలరు.) యెమెన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ లాంటి ఇస్లామిక్ మత ఛాందస ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు ఉద్యమాలు నిర్వహించారు. లిబియా, సిరియాలలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లు తమ పత్రికల పచ్చి అబద్ధాల ప్రచారం సహాయంతో నడిపిన, నడుపుతున్న బూటకపు ఉద్యమాలు మినహా ఇతర అరబ్ దేశాలన్నింటా ప్రజలు ఏదో మేరకు ఉద్యమాలు నిర్వహించారు. మరోవైపు అమెరికా, యూరప్ లలో వాల్ స్ట్రీట్ ఆక్రమిద్ధాం! ఉద్యమం నడిచింది. అమెరికా, యూరప్ లలో జరిగిన ఉద్యమాలకి ప్రపంచం ఆర్ధిక సంక్షోభం నేపధ్యంగా పని చేసింది. అంతర్జాతీయంగా సాగిన ఈ ఉద్యమాల ప్రభావం భారత దేశం పై కూడా పడడం ఒక అంశం.
దేశంలో కుంభకోణాలు వెల్లువత్తడం ఒక పరిస్ధితి కాగా ఈ పరిస్ధితిలోనే భారత ప్రభుత్వంపైన అమెరికా, యూరప్ దేశాలనుండి సంస్కరణల అమలు కోసం తీవ్రమైన ఒత్తిడిలు వస్తున్న పరిస్ధితి నెలకొని ఉంది. వరుసగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల అవినీతి కుంభకోణాలు వెల్లడవుతున్న పరిస్ధితిలో ఆ అవినీతికి మూలంగా ఉన్న సంస్కరణల ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టడం భారత ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. దేశంలోని అనేక అక్రమ సెజ్ లకు వ్యతిరేకంగా, భూములను ప్రభుత్వాలు బలవంతంగా లాక్కోవడానికి వ్యతిరేకంగా, భూములను పరిశ్రమల కోసం లాక్కుని వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి వ్యతిరేకంగా, భూములు లాక్కుని విదేశీ కంపెనీలకు ఇవ్వడానికి వ్యతిరేకంగా, పరిశ్రమల పేరుతో గ్రామీణ ప్రాంతాలను కాలుష్యంతో నింపడానికి వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడికక్కడ ఉద్యమాలలోకి దూకుతున్న పరిస్ధితి నెలకొని ఉంది. ఒరిస్సా పోస్కో వ్యతిరేక ఉద్యమం, నియంగిరి – వేదాంత బాక్సైట్ తవ్వక వ్యతిరేక ఉద్యమం, ఛత్తీస్ ఘడ్, జార్ఘండ్ రాష్ట్రాల ఆదివాసీల ఉద్యమాలు, ఆంధ్ర ప్రదేశ్ లో సోంపేట, కాకరాపల్లి రైతుల ధర్మల్ వ్యతిరేక ఉద్యమాలు వీటిలో మచ్చుకు కొన్ని. ఈ ఉద్యమాలు నిజంగా ప్రజలను కదిలిస్తున్న ఉద్యమాలు. భారత సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజానీకం ఐన రైతులు, కార్మికులు, కూలీలను కదిలిస్తున్న ఉద్యమాలు. అట్టడుగు ప్రజానీకం తమ కూడు, గుడ్డ, నీడ కోసం చేస్తున్న ఉద్యమాలివి. భారత దేశంలోని ఆధిపత్య వర్గాల ఆర్ధిక ఆధిపత్యానికి తద్వారా రాజకీయ ఆధిపత్యానికి కూడా గండికొట్టే ఉద్యామలివి. అట్టడుగు ప్రజల కూడు, గుడ్డ, నీడలను కబళించడం ద్వారానే తమ దోపిడిని కొనసాగిస్తున్న వర్గాలు అట్టడుగు ప్రజానీకం చేసే ప్రాధమిక ఉద్యమాలను కరకు ఉద్యమాలుగా పరిగణిస్తాయి. ఆధిపత్య వర్గాల ఆధిపత్యానికి భంగం కలిగేలా అట్టడుగు వర్గాల ప్రజలు కదిలినట్లయితే ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం అవుతాయి. ఆ ఉద్యమాలను ఎలా అణచివేయాలా అని పధకాలు పన్నుతాయి. ఆ ఉద్యమాల అణచివేతను తక్షణ కార్యక్రమంగా చేసుకుంటాయి. ఉద్యమాల అణచివేతకు ప్రభుత్వాలు సహజంగానే అనేక పద్ధతులు, ఎత్తుగడలు అనుసరిస్తాయి. పోలీసులు, పారామిలట్రీ, ఆనక సైన్యాన్ని దించడం లాంటి కరకు పద్ధతులు, కరుకు ఎత్తుగడలతో పాటు ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించే సాఫ్ట్ పద్ధతులు, సాఫ్ట్ ఎత్తుగడలు కూడా ప్రభుత్వాలు ఎంచుకుంటాయి. అటువంటి సాఫ్ట్ ఎత్తుగడలలో భాగంగా, కొండొకచో ఆయాచితంగా దొరికిన సాఫ్ట్ ఉద్యమాలను చూసీ చూడనట్లు పోవడం ద్వారా అటువంటి సాఫ్ట్ ఉద్యమాలకు సమానాంతరంగా సాగుతున్న ప్రాధమిక ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించే ఎత్తుగడలను ప్రభుత్వాలు అనుసరిస్తాయి. 
సేఫ్టీ వాల్వ్
ప్రభుత్వాలలో ఆధిపత్యం వహిస్తున్న వర్గాల ప్రయోజనాలకు ప్రమాదం తీసుకురాని ఉద్యమాలను పాలకవర్గాలు సాఫ్ట్ ఉద్యమాలుగా, ప్రమాదకరం కానీ ఉద్యమాలుగా పరిగణిస్తాయి. ఈ తరహా ఉద్యమాలు ఒక్కోసారి ప్రభుత్వాల కనుసన్నల్లో జరిగినా ఆశ్చర్యం లేదు. తమ కనుసన్నల్లో జరిగే ఉద్యమాలకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తమకు ఏ విధంగానూ లొంగని, కరకు అణచివేత పద్ధతులకు పాల్పడవలసి వచ్చే ఉద్యమాలను పూర్వ పక్షం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. కనుసన్నల్లో జరగకపోయినప్పటికీ, కొండొకచో ప్రతిపక్షాల కనుసన్నల్లో నడుస్తున్నప్పటికీ అటువంటి ఉద్యమాలను సాఫ్ట్ ఉద్యమాలుగా పరిగణించబడతాయి. ఇటువంటి సాఫ్ట్ ఉద్యమాలకు సహజంగానే దేశంలోని పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తాయి. అట్టడుగు ప్రజానీకం లేవనెత్తుతున్న మౌలిక సమస్యలు కూడు, గుడ్డ, నీడ లనుండి ఇతర వర్గాల ప్రజలైన మధ్య తరగతి బుద్ధి జీవులు, మేధావుల దృష్టి ని ఈ ప్రచారం పక్కకు మళ్లిస్తుంది. సాఫ్ట్ ఉద్యమాలు లేవనెత్తుతున్న ఉద్యమాన్ని ప్రముఖంగా ప్రభుత్వం కూడా పట్టించుకుంటుంది. ఆ ఉద్యమం లేవనెత్తిన సమస్య దేశంలో ప్రాముఖ్యగా గుర్తించినట్లుగా ఫోజులు పెడుతుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి పూనుకుంటున్నట్లుగా కూడా ఫోజులు పెడుతుంది. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. ప్రజా ఉద్యమాలను ఓ పక్క కర్కశంగా అణచివేస్తున్నప్పటికీ సాఫ్ట్ ఉద్యమాలకు ప్రముఖంగా స్పంధించడం ద్వారా తాను ప్రజల డిమాండ్లకు ప్రజాస్వామ్య యుతంగా స్పందిస్తున్నట్లుగా చూపుకుంటుంది. ఆ విధంగా సాఫ్ట్ ఉద్యమాలను ప్రభుత్వం సేఫ్టీ వాల్వ్ గా ఉపయోగించుకుంటుంది. అలా చేయనట్లయితే ప్రభుత్వాలు అట్టడుగు ప్రజానీకం లేవనెట్టిన మౌలిక సమస్యలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి సమాధానం ఇవ్వడం అంటే భారత ప్రభుత్వం తాను గత ఇరవై సంవత్సరాలుగా అనుసరిస్తూ వస్తున్న నూతన ఆర్ధిక విధానాలను సమీక్షించుకుంటానని చెప్పడమే అవుతుంది. నూతన ఆర్ధిక విధానాలను సమీక్షించుకుంటే అవి భారత దేశ ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నాయని వెల్లడవుతుంది. జీవించే హక్కు నుండి, ఆస్తి హక్కు, భావ ప్రకటనా స్వేచ్చా హక్కు లాంటి ప్రాధమిక హక్కులను తాము హరిస్తున్నామని ప్రభుత్వాలు అంగీకరించవలసి ఉంటుంది. ఈ అంగీకారం ఒక్క కేంద్ర ప్రభుత్వం వరకే పరిమితం కాజాలదు. ఈ దేశంలోని జాతీయ, ప్రాంతీయ పాలకవర్గ పార్టీలన్నీ నూతన ఆర్ధిక విధానాలని అనుససరిస్తున్నందున అవన్నీ తమ విధానాలను వదులుకోవలసి ఉంటుంది. 
కానీ అది అసాధ్యం. ప్రభుత్వాలు నడుపుతున్న వర్గాలు తమ స్వభావాన్ని ఎలా వదులుకుంటాయి? తమ స్వభావాన్ని వదులుకోవడం అంటే అది వారు తాము ఇప్పటిదాకా తిన్న కోటి కోట్ల అవినీతి సొమ్ముని కక్కడంతో సమానం. అది చేయకుండా తమను తాము కాపాడుకోవడానికి భారత పాలక వర్గాలకు అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆయాచితంగా దొరికింది. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిందన్నది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాల్తో, సరళీకరణ-ప్రవేటీకరణ-ప్రపంచీకరణ విధానాలతో ఏ మాత్రం భిన్నాభిప్రాయాలు లేని ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయన్నది విస్మరించరాని విషయం. చివరికి ప్రభుత్వం కూడా చెప్పుకోదగ్గ రీతిలో అన్నా ఉద్యమానికి సహకరించింది. అన్నా రెండవ నిరాహార దీక్షకు గ్రౌండును ప్రభుత్వం ఆగమేఘాల మీద మునిసిపల్ సిబ్బందిని నియమించి మరీ సిద్ధం చేసింది. అన్నా అరెస్టు అయినప్పుడు జైలులో సకల సౌకర్యాలు అందించింది. జైలు ఆఫీసులో ఉన్న అన్నా సందేశాలను జైలు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులే బైట ఉన్న పత్రికా విలేఖర్లకు మోశారని అప్పట్లో పత్రికలు రాశాయి. ఎంత అన్నా అరెస్టులో ప్రభుత్వం తప్పు చేసినప్పటికీ ఇవన్నీ చేయనవసరం లేదు. ఆందోళనకు ప్రభుత్వమే గ్రౌండు సిద్ధం చేయడం ఎక్కడైనా విన్నామా? ఉన్నది ఉన్నట్లుగా గ్రౌండు అడిగినవారికి మున్సిపాలిటీ ఇస్తుంది. దాన్ని శుభ్రం చేసుకుని వాడుకునేదీ లేనిదీ తీసుకున్నవారి ఇష్టానికి వదిలివేస్తారు తప్ప స్వయంగా శుభ్రం చేసి ఇవ్వరు. అప్పటికప్పుడు ఎర్త్ మూవర్స్ ని తెప్పించి, వందకు పైగా కార్మికులను నియమించి, తుప్పలు కొట్టించి, ఎత్తుపల్లాలను చదును చేసిఇవన్నీ ప్రభుత్వాలు చేయవలసిన అవసరం లేదు. చెయ్యవు కూడా. గత ఉద్యమాలను ఏది చూసినా ఈ విషయం స్పష్టం అవుతుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ సహకారాన్ని తప్పని సరిగా ఒక ముఖ్య అంశంగా పరిశీలించాలి. దీనర్ధం సాఫ్ట్ ఉద్యమాలన్నింటినీ అన్నీ సందర్భాలలో సాఫ్ట్ గానే పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయని చెప్పనవసరం లేదు.
మూడవ సారి నిరాహార దీక్షకు వచ్చేసరికి ప్రజల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమం పట్ల ఆసక్తి సన్నగిల్లింది. ప్రభుత్వం అప్పటివరకు అన్నా బృందం సభ్యులపైన అనేక విధాలుగా విష ప్రచారం చెయ్యడం వల్ల వారి విశ్వసనీయతమైన దెబ్బకొట్టగలిగింది. అన్నా హజారే స్వయంగా అనేక వివాస్పద ప్రకటనలు ఇచ్చి తన విశ్వసనీయతకు  ఏదో మేరకు గండి కొట్టుకున్నాడు. రెండవసారి నిరాహార దీక్ష సమయంలో అన్నాను అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా జైలుకి రిమాండ్ విధించడం ప్రజలను బాగా కదిలించిన అంశంగా గుర్తించాలి. అన్నా ను జైలుకి పంపాక ప్రభుత్వం తన తప్పు సరిదిద్దుకుని విడుదల చేయించినప్పటికీ అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. అన్నా కూడా వ్యూహాత్మకంగా జైలు నుండి బైటికి రావడానికి నిరాకరించడంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయింది. ఇటువంటి పరిస్ధితులు మూడవసారి (డిసెంబరులో) నిరాహార దీక్ష సమయంలో లేవు. దానితో ప్రజల హాజరు బాగా పడిపోయింది. లక్ష వస్తారనుకున్న ముంబై దీక్షకు పది వేలమంది హాజరయ్యారని పత్రికలు రాశాయి. ఆగష్టులో లక్షకు పైగా హాజరైన ఢిల్లీ లో ఈ సారి రెండు వందలకు మించలేదు. ప్రజలు నిరంతరం ఉద్యమాలపైన దృష్టి ఉంచరు. దైనందిన సమస్యలు వారికి అనేకం. నిత్యం అనేక సమస్యలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రభుత్వాలే పరోక్షంగా వారు ఆందోళనకు సమీకృతులు కాకుండా నిరోధిస్తున్నాయన్నమాట! సమస్యలు ఎదుర్కోవడం అంటే మరో అర్ధంలో ప్రజలు అనేక త్యాగాలు అప్పటికే చేస్తున్నట్లు లెక్క. ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా మరొక త్యాగం అదనంగా చేయడం వారికి నిరంతరం సాధ్యం కాని పని. దానితో మూడవసారి అన్నాయే రెండో రోజుకల్లా చాప చుట్టవలసి వచ్చింది. జ్వరం వల్ల దీక్ష విరమించాడని చెప్పినా, అన్నా దీక్షకి జ్వరం ఒక లెక్క కాదని ఆగష్టు నాటి పద్దెనిమిది రోజుల నిరాహార దీక్ష చెప్పింది.
అన్నా దీక్ష విరమణతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నిరవేరింది. ఏమిటా లక్ష్యం? ఈ సంవత్సరం ప్రాంభంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న అనేక ప్రజాందోళనలను పక్కదారి పట్టించడం అన్నది ప్రధాన లక్ష్యం. ఈ వ్యాసంలో ఇంతకు ముందు చెప్పుకున్న ఆందోళనలపైన భారత ప్రజల దృష్టి పడకుండా ప్రభుత్వం ఇప్పటివరకూ చూడగలిగింది. ఓ వైపు అన్నా ఉద్యమం నడుస్తుండగా మఱే ఉద్యమమూ పత్రికలలో ప్రముఖ స్ధానం సంపాధించలేకపోయింది. అవినీతి ఉద్యమంతోతోటి దేశంలోని ప్రతి సమస్య ముడి పడి ఉన్నట్లు కనిపిస్తుండడంతో అన్నింటికీ ఈ ఉద్యమం చాలు అన్న వాతారావణం ఏర్పడింది. అందుకు అన్నా ఉద్యమం ప్రభుత్వానికి ఉపయోగపడింది. అన్నా ఉద్దేశ్య పూర్వకంగా సహకరించాడా అన్నది ఇక్కడ అప్రస్తుతం. ఉద్దేశ్య పూర్వకంగా సహకరించే అవగాహన అన్నా కు లేకపోవచ్చు. కానీ ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకున్నదీ ఇక్కడ అర్ధం చేసుకోవలసిన అంశం. నిజానికి ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ పరోక్షంగా చెప్పాడు కూడా. ఇప్పటి లోక్ పాల్ బిల్లుని ప్రవేశ పెట్టడం ద్వారా ప్రభుత్వం  రాజకీయ నాయకుల, అధికారుల అవినీతి పరులను సమర్ధవంతంగా రక్షించుకుంది అని ఆయన ప్రకటించాడు. అంతిమగా చెప్పదలిచిన విషయం ఏమిటి? అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమం లాంటి ఉద్యమాలు ప్రజల మౌలిక సమస్యలకు దూరంగా ఉన్నట్లయితే అవి అసంపూర్ణ ఉద్యమాలుగానే ఉండిపోతాయి. అటువంటి అసంపూర్ణ ఉద్యమాల వల్ల ప్రజలకు లాభం లేకపోగా అంతిమ పరిశీలనలో నష్టం జరుగుతోంది. మౌలిక సమస్యలపై జరిగే ఉద్యమాల ను ప్రభుత్వాలు తప్పించుకోగల అవకాశాలు ఈ ఉద్యమాలు ఇస్తున్నాయి. తద్వారా ప్రజలకు నష్టమే జరుగుతున్నది. మౌలిక సమస్యలపై ఉద్యమాలు లేకుండా మౌలిక సమస్యల ప్రతిబింబం అయిన అవినీతి లాంటి అంశాలపైన జరిగే ఉద్యమాలు అటు అవినీతి సమస్యను పరిష్కరించక పోగా ఇటు మౌలిక సమస్యలపై ఆందోళనలను కూడా కనిపించ కుండా చేస్తున్నాయి. ఉద్యమ నాయకులు గానీ, మొత్తంగా ఉద్యమానికి గానీ దేశంలోని సమస్యలన్నింటి పట్లా సమగ్ర ద్ఱృక్పధం  ఉండాలి. లేనట్లయితే ఉద్యమ నాయకత్వానికి తగని అభిప్రాయాలు ఉద్యమ సందర్భంగా వ్యక్తం అవుతుంటాయి. దేశంలోని ఇతర వర్గాల ఉద్యమాలతో సజీవ సంబంధం లేకుండా ఏ ఉద్యమమూ మనజాలదని కూడా అన్నా ఉద్యమం ద్వారా తెలుస్తున్నది.
ఈ విశ్లేషణ నేపధ్యంలో చూసినపుడు అన్నా పైన విమర్శలు రాకపోతేనే ఆశ్చర్యం గానీ, విమర్శలు వస్తే బాధపడవలసిన అవసరం లేదు. ప్రజా నాయకుడికి విమర్శలు ఆభరణాలు. తమను తాము సరిదిద్దుకోవడానికి వచ్చే అమూల్యమైన అవకాశాలు. వాటిని విస్మరించినట్లయితే ప్రజా నాయకులు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. చరిత్ర చెప్పిన పాఠం ఇది.
ఈ వ్యాసంలో ప్రస్తావించిన అంశాలన్నీ ఒకదాని కొకటి సంబంధ ఉన్న అంశాలు. వీటిలో కొన్నింటిని నచ్చని అంశాలను బైటికి లాగి వేరేగా చూస్తూ ప్రతి విమర్శ చేసినట్లయితే అటువంటి విమర్శలకు ప్రత్యేక సమాధానం అంటూ ఏమీ ఉండదు. మొత్తం చర్చాంశమ్ నుండి ఇందులో భాగాలని విడదీస్తే ఆవేశపడిపోవడానికి దినుసులు దొరకవచ్చు. కానీ అది సరికాదని గమనించాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి