23, జనవరి 2012, సోమవారం

ప్రజలపై భారాలు కార్పొరేట్లకు రాయితీలా?


ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రభావం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడేందుకు పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను తిరిగి వేగవంతం చేయడం ఒక్కటే మార్గం అన్నట్లుగా ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సెలవిచ్చారు. పెన్షన్‌ బిల్లు, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, రాజకీయ ఏకాభిప్రాయం సాధించి వాటిని అమల్లోకి తెస్తామని భారత పారిశ్రామిక మండలికి హామీ ఇచ్చారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రభావం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడేందుకు పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను తిరిగి వేగవంతం చేయడం ఒక్కటే మార్గం అన్నట్లుగా ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సెలవిచ్చారు. పెన్షన్‌ బిల్లు, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, రాజకీయ ఏకాభిప్రాయం సాధించి వాటిని అమల్లోకి తెస్తామని భారత పారిశ్రామిక మండలికి హామీ ఇచ్చారు.
అవినీతికి వ్యతిరేకంగా దేశంలో ఇటీవల పెల్లుబికిన ఆందోళన మదిలో ఇంకా మెదులుతుండగానే అమెరికా, ఐరోపా దేశాల్లో కార్పొరేట్‌ అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. అవినీతి కార్యకలాపాలకు పాల్పడి ఆర్థిక వ్యవస్థలను దివాళా తీయించిన కార్పొరేట్‌ సంస్థలకు బెయిలవుట్‌ ప్యాకేజీలిస్తూ 99 శాతంగారవున్న తమపై ఆ భారాలను వేయటం ఏమిటని అక్కడ ప్రశ్నిస్తున్నారు.
సమస్యకు మూలం నీతికి, అవినీతికి మధ్యన ఉండే విభజన రేఖను చెరిపేసిన ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలే. కార్పొరేట్లకి అనుకూలంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అవృక్తమవుతాయని, సౌభాగ్యవంతమైన కాలం అంటే అది బోగస్‌ అని, రాబోయే సంక్షోభానికి అది సూచికని పెట్టుబడి గ్రంథంలో మార్క్స్‌ 150 సంవత్సరాల క్రితమే చెప్పాడు.
ఒక సంక్షోభం నుండి బయటపడడానికి తీసుకునే చర్యలన్నీ మరో సంక్షోభానికి దారితీస్తాయని మార్క్స్‌ ఆనాడే చెప్పారు. ఇప్పుడు అమెరికా, యూరప్‌, ఇండియాల్లో కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. 2001 ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి కృత్రిమంగా సృష్టించిన బుడగ 2008లో పేలిపోయింది. వెయ్యి గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క తుపాన్‌తో చస్తుందన్న చందంగా ఆ ప్రజల్ని పీల్చిపిప్పి చేసిన ఫైనాన్స్‌ పెట్టుబడికి ప్రజల దగ్గర ఇంకేమీ మిగలకపోవటంతో చచ్చి ఊరుకుంది.
మన దేశంలోనూసంక్షోభం పేరుతో రెండు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్లకు బెయిలవుట్‌ ప్యాకేజీలిచ్చారు. కేవలం ఈ మూడు సంవత్సరాల్లోనే 14 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలివ్వగా వాటిలో కార్పొరేట్‌ ఆదాయ పన్ను రాయితీలే రమారమి నాలుగు లక్షల కోట్ల దాకా ఉన్నాయి. చిల్లు కడవలో నీళ్లు పోస్తే నిలవనట్లుగా ఇంత చేసినా దేశ ఆర్థిక వ్యవస్థలో మునుపటి 8,9,10 శాతం పెరుగుదల రేటు తిరిగి రాకపోగా 8 నుండి 7,6 శాతానికి పడిపోయింది. మున్ముందు ఇది మరింత పడిపోయే అవకాశముందని ప్రపంచబ్యాంకే హెచ్చరించింది. 2 శాతంపైగా ఉన్న ఉపాది పెరుగుదల రేటు 0.8 వాతానికి పడిపోయింది.
బకాసురుల లాంటి కార్పొరేట్లకి ప్రజల డబ్బుల్ని, ప్రయోజనాల్ని ఆహారంగా వేస్తుండాలని, లేకపోతే ఆర్థిక వ్యవస్థ బతకదని ఆర్థికమంత్రి అంటున్నారు. ఆయన ఒక విషయం గుర్తుంచుకోవాలి. చిల్లర వ్యాపారాన్ని పెన్షన్‌ నిధులను విదేశీ, స్వదేశీ ప్రయివేటు పెట్టుబడులకు అప్పగించేశాక ఇక ప్రభుత్వం ఎందుకు? ఆర్థిక సార్వభౌమాత్వాన్ని హరించాక మిగిలేదేమిటి?
ఒకప్పుడు పెన్షన్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు దానికి అడ్డం తిరిగింది. 2002లో నూరు శాతం విదేశీ పెట్టుబడిని బహుళ బ్రాండ్‌ చిల్లర వ్యాపారంలోకి అనుమతించాలని ప్లాను వేసిన బిజెపి ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పోజు పెడుతోంది. రాజకీయ లబ్ధి కోసమే అవి ఈవిధంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలున్నాయి కాబట్టి కొంతమంది కాంగ్రెస్‌ యం.పిలు చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని వ్యతిరేకిస్తున్నట్లు పోజులిస్తున్నారు. కేరళకు చెందిన కేంద్ర ఆహార మంత్రి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించటంలో కానీ రాజకీయ ప్రయోజనాలే తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు. వామపక్షాలొక్కటే నికరమైన వైఖరితో వ్యవహరిస్తున్నాయి.
యుపిఏ -1 ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు వాటిది ఒకే మాట. ఈ సంస్కరణలు ప్రమాదకరమైనవి వీటికి వ్యతిరేకంగా పోరాటమే మార్గమని చెబుతున్నాయి. దానినే ఆచరణలో చూపిస్తున్నాయి. వాటికి ప్రజల ప్రయోజనాలే తప్ప మరే ప్రయోజనాలు లేవు. వామపక్షేతర రాజకీయ పార్టీలు కూడా సంస్కరణలకు వ్యతిరేకంగా ఎంతో కొంత నిలబడుతున్నాయంటే దానికి ఏకైక కారణం ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతే.
ఆర్థిక సంక్షోభం ప్రభావం రాజకీయాల్లోనూ ప్రతిబింబిస్తున్నది. ఒకే పార్టీలో వివిధ గ్రూపుల మధ్య, ఒకే కూటమిలోని వివిధ పార్టీల మధ్య తగాదాలు విభేదాలు, పార్టీ ఫిరాయింపులు, మంత్రివర్గంలో కుమ్ములాటలు, ప్రాంతీయ వాదాలతో పార్టీలో గ్రూపులుగా చీలిపోవడం ఇవన్నీ వీటి ఫలితమేనని చెప్పాలి.
ఏది ఏమైనా ప్రమూదకర సంస్కరణలకు, తమ మీద పడుతున్న భారాలకు ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను సంఘటితం చేయకపోతే మితవాద, అతివాద, అభివృద్ధి నిరోధక శక్తులు ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. అనుబంధాలకు, రాజకీయాలకి, అభిమానాలకి అతీతంగా బాధిత ప్రజానీకాన్ని ఐక్యం చేసిన నాడే ఉద్యమాలు ప్రజాతంత్ర రూపాన్ని సంతరించుకుంటాయి.
అన్ని రకాలుగా కార్మిక, ఉద్యోగ సంఘాలు మొదటిసారిగా ఐక్యమై ఫిబ్రవరి 28 అఖిల భారత సార్వత్రిక సమ్మెలో పాల్గొనటం లాంటి కార్యాచరణలు మరిన్ని జరగాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి