9, జనవరి 2012, సోమవారం

భగవద్గీతపై ప్రమాణం చేసి ఎన్నారై బాధ్యతలు


వాషింగ్టన్: కౌన్సిల్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఓ ప్రవాస భారతీయుడు భగవద్గీతపై ప్రమాణం చేశారు. వైద్యుడిగా పని చేస్తున్న సుధాంశ్ ప్రసాద్ న్యూజెర్సీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో అతను భారతీయ ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నతనం నుంచి భగవద్గీతను మనసా, వాచా, కర్మణా నమ్ముతానని చెప్పారు. అందువల్లే ఆ గ్రంథంపై ప్రమాణం చేసినట్లు చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తి పన్ను వసూలు కూడా సమప్రాధాన్యమిస్తామన్నారు.

గతేడాది నవంబర్‌లో పురపాలక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ప్రసాద్ ఈ పదవిని రెండోసారి చెపట్టారు. బీహార్ రాజధాని పాట్నా నగరం ప్రసాద్ స్వస్థలం. ఎడిసన్‌లోని జెఎఫ్‌కె ఆసుపత్రిలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసన్‌కు గతంలో చైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవల భగవద్గీత తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని రష్యాలో ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వాదోపవాదాలు జరిగిన తర్వాత గత డిసెంబర్ 28న కోర్టు కేసును కొట్టి వేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి