18, ఏప్రిల్ 2012, బుధవారం

అమెరికాలో నిరుద్యోగం


ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తిమ్మిని బమ్మిని చేయటం, జనాన్ని తప్పుదారి పట్టించటం దోపిడీ వ్యవస్థలున్న అన్ని దేశాల్లోనూ సహజంగా జరిగే విషయమే. ఈ వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికాలో జరిగేవి కూడా అదే స్థాయిలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అలాంటివాటిలో ఒకటి నిరుద్యోగ సమస్య. తమ దేశంలో 2007లో ప్రారంభమైన ఆర్థిక మాంద్యం అంతమైందని అమెరికా అధికారికంగా ప్రకటించుకుంది. మాంద్యం తొలిగినట్లు కాగితాలపై రాసుకోవటం తప్ప అమెరికా సామాన్య జీవితాల్లో అది ఏవిధంగానూ ప్రతిబింబించడం లేదు. మాంద్యం తొలిగినట్లు ప్రకటించిన తరువాతే అక్కడ వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం ప్రారంభమైందనే విషయం మరువరాదు. శుక్రవారం నాడు అమెరికా కార్మిక శాఖ వరుసగా మూడవ మాసంలో కూడా రెండులక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించింది. కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కూడా తెల్లవారికే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైన వివరాలు ఉపాధిలో కూడా జాతి వివక్ష పాటిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. కొత్తగా ఉద్యోగాలు వచ్చినప్పటికీ ఇంకా 8.3శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు నివేదిక ముక్తాయించింది. అసలు కిటుకు ఇక్కడే ఉంది. వరుసగా అదనపు ఉద్యోగాలను కల్పిస్తున్నప్పటికీ నిరుద్యోగశాతం ఎందుకు తగ్గటం లేదన్న అంశం జోలికి ప్రభుత్వం పోవటం లేదు. అయితే దీన్ని అర్ధం చేసుకోవటానికి ఆల్జీబ్రాలు అవసరం లేదు. పెరుగుతున్న పరిశ్రమల మూతలు, లే ఆఫ్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల రద్దు కారణంగా నిరుద్యోగ సైన్యంలోకి వచ్చి చేరుతున్నవారి సంఖ్య కొత్తగా ఉద్యోగాలు పొందేవారు సమంగా ఉంటేనే ఇలా జరుగుతుంది. అంటే ఒక దగ్గర మాసిక వేస్తే మరోచోట పిగిలిపోయే చివికి పోయిన వస్త్రంలా అమెరికా పరిస్థితి ఉందన్నది స్పష్టం. మాంద్యం సమయంలో 53లక్షల ఉద్యోగాలు హుష్‌ కాకి అయ్యాయి. ఇదే సమయంలో మరో 47లక్షల మందికి ఉపాధి పొందాల్సిన వయస్సు వచ్చింది. గత మూడు మాసాల్లో సగటున ప్రతి నెలా రెండులక్షల 45వేల ఉద్యోగాలను అదనంగా కల్పించారు. అంటే ఒబామాకు ఒక వేళ ఓటర్లు రెండవసారి కూడా పదవిలో ఉండేందుకు అవకాశం ఇచ్చినా ఆయన పదవీ విరమణ చేసే నాటికి కూడా మాంద్యపు పూర్వ స్థాయికి అంటే ఐదుశాతానికి నిరుద్యోగం స్థాయి తగ్గదు.నిజానికి అమెరికాలో తిరిగి నిరుద్యోగం పెరుగుతోందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గాలప్‌ నివేదిక ప్రకారం డిసెంబరులో 8.5శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరి నాటికి 9.1శాతానికి చేరింది. నిరుద్యోగులుగాని, నిరుద్యోగులకు దగ్గరగా ఉండే పాక్షిక నిరుద్యోగులుగాని అమెరికాలో ఇప్పుడు రెండుకోట్ల నలభై లక్షల మంది ఉన్నారు. అయితే ఎన్నికల తరుణం కనుక ఇలాంటి వివరాలను సహజంగానే పాలకపక్షం తొక్కి పెడుతుంది, లేదా అంకెల గారడీచేస్తుంది.
అమెరికా ప్రభుత్వానికి అప్పు హనుమంతుని తోకలా పెరిగిపోతోంది. రాష్ట్రాలదీ అదే పరిస్థితి. స్థానిక సంస్థలు కొన్ని దివాలా ప్రకటించాయి. అమెరికా ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ప్రతి డాలర్‌లో 42 సెంట్లు అప్పుచేసిన పప్పుకూడే. ఈ క్రమంలో సంక్షేమ పథకాలపై కోత మొదలైంది. న్యూయార్క్‌ రాష్ట్రంలో నిరుద్యోగులకు గరిష్టంగా ఇచ్చే భత్యం ఇప్పుడున్న 93వారాల నుంచి క్రమంగా 63వారాలకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇచ్చే మొత్తం కూడా క్రమంగా తగ్గిపోతున్నది. అమెరికాలో సగటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 15శాతమైతే, సంపన్నవంతమైన న్యూయార్క్‌లో 19.1శాతం ఉన్నారు. తాజాగా రూపొందించిన జనాభా లెక్కల ప్రకారం 32లక్షల మంది అమెరికన్లు ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి కారణంగానే దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్నట్లు తేలింది. వీరిలో పిల్లల సంఖ్య ఎనిమిదిలక్షలకు పైబడింది. మూసి పెడితే పాచిపోతుందన్న సామెత తెలిసిందే. జనం అప్పులు చేసి వస్తువులు కొంటే తప్ప ఒక్క అంగుళం కూడ ముందుకు పోని విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను తయారు చేశారు. సర్కార్‌ ఎంతగా మూసి పెట్టినా ఈనెల మూడవ తేదీతో ముగిసిన వారంలో అంతకు ముందు వారం కంటే నిరుద్యోగ భృతి కోజం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య ఎనిమిదివేలు పెరిగి 3,62,000కు చేరుకుందన్న వార్త అమెరికా సమాజంతో పాటు ప్రపంచానికీ దుర్వార్తే. ఇలా నిరుద్యోగ భృతి కోసం యాచించేవారితో పాటు ప్రభుత్వం అందించే ఆహార కూపన్లతో కడుపు నింపుకొనే వారి సంఖ్య సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికన్లకు ఉద్యోగమో, ఇల్లో ఉంటే చాలు అప్పు సులభంగా పుడుతుంది. ఆర్థిక మాంద్యంలో ఉద్యోగం, ఇళ్లూ కోల్పోయిన వారికి అప్పు పుట్టే అవకాశం లేదు. ఉన్న ఉద్యోగాలతో కొత్తగా అప్పుచేసి ఇళ్లు కట్టే శక్తి లేదు. గతనెలలో దేశ వ్యాపితంగా కేవలం 14వేల మందికే అదనంగా ఉపాధి లభించిందంటే అక్కడి నిర్మాణ రంగం ఎంతగా కుదేలైందో చెప్పవచ్చు. గతేడాది ప్రారంభంలో కూడా మొదటి మూడు నెలలు ఇలాగే ఉద్యోగ కల్పన పెరిగినట్లు ఒబామా ప్రభుత్వం ఊదరగొట్టింది. తీరా అది బుడగ మాదిరిగా పేలి పోయింది. అలా ఎందుకు జరిగిందంటే జపాన్‌లో భూకంపం, ఐరోపాలో అప్పుల తిప్పలు, పెరిగిన గ్యాస్‌ ధరల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సాకులు చెప్పారు. ఈ సారి కూడా అదే జరిగితే చైనా, భారత్‌లలో అభివృద్ధి రేటు మందగించిందని, ఐరోపా అప్పుల ఊబి నుంచి ఇంకా బయట పడలేదని ఇలా ఏదో ఒకసాకు చెప్పవచ్చు. అసలు విషయం ఏమంటే జనం దగ్గర నుంచి డబ్బు క్రమంగా కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి పోతోంది. జనం దరిద్రులు అవుతున్నారు. కోటీశ్వరులు శత కోటీశ్వరులు అవుతున్నారు. అదే అసలు సమస్య.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి