4, జులై 2012, బుధవారం

మెడికల్‌ సీట్లలోనూ తెలంగాణకు అన్యాయమే


  • ఆర్టీసి కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి :హరీష్‌రావు
రాష్ట్రానికి అదనంగా కేటాయించిన మెడికల్‌ సీట్లలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని టిఆర్‌ఎస్‌ విమర్శించింది. ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్‌ చేసింది. ఈ రెండు సమస్యలపై టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అదనంగా వచ్చిన 300 మెడికల్‌ సీట్లన్నీ సీమాంధ్రకే కేటాయించారని, తెలంగాణకు ఒక్కటీ కేటాయించలేదని విమర్శించారు. ఈ కారణంగా తెలంగాణలో తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి సీట్లు రావడం లేదని, అదే సీమాంధ్రలో ఎక్కువ ర్యాంకులు వచ్చినా సీటు వస్తోందని అన్నారు. రాయలసీమలో 4 జిల్లాలు ఉంటే అక్కడ 4 వైద్య కళాశాలలు ఉన్నాయని, కోస్తాంధ్రలో 9 జిల్లాలు ఉంటే 6 కళాశాలలు ఉన్నాయని, తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నప్పటికీ కేవలం మూడే కళాశాలలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్టీసిలో కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో కాంట్రాక్ట్‌ పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన కార్మికులను తీసుకోవాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. నార్కట్‌పల్లి, దుబ్బాక, ఉస్నాబాద్‌ డిపోలను పూర్తిస్థాయిలో నడిపించాలన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు దాసోజు శ్రవణ్‌కుమార్‌తోపాటు పలువురు ఆర్టీసి కార్మికులు ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి