17, జులై 2012, మంగళవారం

రూ.2,289 కోట్ల ఇన్ఫోసిస్‌నికరలాభం

బెంగళూరు జూలై 12:- దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ తన ఏకీకృత నికర లాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మార్చి 31తో ముగిసిన త్రైమాసికం కంటే 1.2 శాతం తగ్గి రూ.2,316 కోట్ల నుంచి రూ. 2,289 కోట్లకు చేరినట్లు ప్రకటించింది. అయితే గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ నికరలాభం 33 శాతం పెరిగి రూ.1720 కోట్ల నుంచి రూ. 2,289 కోట్లకు చేరింది. వడ్డీలు, పన్నులు మినహాయించక ముందు ఆదాయం 1.7 శాతం పెరిగి రూ.2,647 కోట్ల నుంచి రూ.2,639 కోట్లకు చేరింది.అదే సమయంలో ఆదాయం 8.6 శాతంపెరిగి రూ.8,852 కోట్ల నుంచి రూ.9,616 కోట్లకు చేరింది. అయితే డాలర్లలో ఆదాయం 1.1 శాతం తగ్గి 1771 మిలియన్‌ల నుంచి 1752 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఈత్రైమాసికంలో కంపెనీకి కొత్తగా 51 మంది ఖాతాదారులు వచ్చిచేరారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం 7.3 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని కంపెనీ అంచనా వేస్తున్నది. ఒక్కో షేరు మీద వచ్చిన ఆదాయం 1.2 శాతం తగ్గి రూ.40.54 నుంచి రూ. 40.06కు చేరింది. అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురుఅవుతున్న కంపెనీ మంచి పనితీరు కనబరిచిందని సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌డి శిబులాల్‌ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌ ఫలితాలు మార్కెట్‌ను సంతృప్తిపరచలేదు. కంపెనీ షేర్లు దాదాపు పది శాతం పడిపోయాయి.
లక్షన్నర దాటిన సిబ్బంది
ప్రస్తుతం కంపెనీలో 1,51,151 మంది పనిచేస్తు న్నారు. ప్రతి త్రైమాసికం ముందస్తు అంచనాలు విడుదలచేసే కంపెనీ ఇసారి ఎటువంటి ప్రకట నలు చేయలేదు. అయితే 2011 మార్చి 31తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం 19.7 శాతంపెరిగి రూ.40,364 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇంతకు ముందు కంపెనీ ఈ అంచనాను రూ.38,431 కోట్ల నుంచి రూ. 39,136 కోట్ల స్థాయిలో వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఒక్కో షేరు మీద ఆదాయం 14.4 శాతం పెరిగి రూ.166.46 స్థాయికి చేరుతుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో సరాసరి డాలరుకు రూపాయికి మారకం విలువ రూ.55గా ఉంటుం దని అంచనా వేసారు. అంతర్జాతీయంగా కరెన్సీ ధరల్లో హెచ్చుతగ్గులు కంపెనీకి సవాలుగామారా యని ఛీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, బోర్డు సభ్యుడు వి బాలకృష్ణన్‌ పత్రికల వారికి చెప్పారు. స్వల్పకాలిక అవసరాలు, దీర్ఘకాలిక అవకాశాలను దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వివరించారు.
నగదు నిల్వ
2012జూన్‌ 30 నాటికి కంపెనీవద్ద నగదు, నగదుతో సమానమైన పెట్టుబడులు విక్రయానికి అందుబాటులో ఉండే  ఆస్తులు, సర్టిఫికేట్లు, గవర్నమెంటు బాండ్లు కలిసి రూ.20,596 కోట్ల మేర ఉన్నాయి. ఇంతకుముందు త్రైమాసికంలో కంపెనీని వదిలివేసే ఉద్యోగులు 14.7 శాతం ఉంటే ఈ త్రైమాసికంలో వారు 14.9 శాతానికి చేరారు. శిక్షణపొందుతున్న వారిని తప్పించి సిబ్బందిలో 71.6 శాతం మందిని ఉపయోగించు కుంటున్నట్లుకంపెనీ పేర్కొన్నది. ఉత్తర అమెరికా లో కంపెనీ వ్యాపారం 1.6 శాతంపెరిగింది. అయితే యూరప్‌లో వ్యాపారం 8.1 శాతం తగ్గింది. ఇండియాలో వ్యాపారం  కూడా 4.3 శాతం తగ్గింది. అయితే కరెన్సీ విలువను స్థిరంగా లెక్కవేస్తే ఈ వ్యాపారం ఐదు శాతం పెరిగింది. కంపెనీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో తన వ్యాపారం ఒక శాతం తగ్గినట్లు అంగీకరించింది. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలోవ్యాపారం 2.5 శాతం పెరిగింది. రిటైల్‌, వినియోగవస్తువులు, లైఫ్‌ సైన్సెస్‌లో వ్యాపారం 2.3 శాతం పెరిగింది. ఇంధనం, కమ్యూనికేషన్స్‌ సర్వీసెస్‌లో వ్యాపారం 8.2 శాతం తగ్గింది.
తగ్గిన ముందస్తు అంచనాలు
2012-13లో డాలర్లలో తమ వ్యాపారం ఎనిమిది నుంచి పది శాతంవరకు పెరుగుతుందని మార్చి  త్రైమాసికం ఫలితాలను ప్రకటించేటప్పు డు కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఆవృద్ధి అంచనాను ఐదు శాతానికి తగ్గిం చింది. కంపెనీ గురువారం నాడు  ప్రకటించిన ఫలితాల్లో కూడా మార్కెట్‌ అంచనాలను అందు కోలేకపోయింది. మార్కెట్‌ కంపెనీ నికరలాభం రూ.2,483 కోట్లు వస్తుందని అంచనా వేస్తే కంపెనీ రూ.2,290 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. అలాగే మార్కెట్‌ కంపెనీ టర్నోవర్‌ రూ.9,715.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తే కంపెనీ వాస్తవంగా రూ.9,616 కోట్లు సాధించింది.
35వేల మంది రిక్రూట్‌మెంట్‌
2012-13 ఆర్థిక సంవత్సరంలో 35వేల మందిని రిక్రూట్‌ చేసుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని కంపెనీ ప్రకటించింది. అయితే ఇప్పట్లో కంపెనీ సిబ్బంది వేతనాలను పెంచకపోవచ్చునని సూత్రప్రాయంగా తెలియ చేసింది. బిపిఒ కార్యకలాపాలకు 13వేల మందిని రిక్రూట్‌ చేసుకుంటారు. జూలై 31తో అమలులోకి వచ్చే విధంగా 20వేల మంది సిబ్బందికి ప్రమోష న్లు ఇచ్చినట్లుకంపెనీ తెలిపింది. అంటే సిబ్బంది లో 13 శాతం మందికి ప్రమోషన్లు లభించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి