21, అక్టోబర్ 2011, శుక్రవారం

అనంత సంపద వెనుక కన్నీటి కథలు

కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో అపార నిధినిక్షేపాలు దొర కడం మనకెంతో ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు. ఐదులక్షల కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభర ణాలు, నగలు, వజ్రవైఢూర్యాలు నేలమాళిగ గదుల్లో కనిపించడం మన అపూర్వ సంపదకు మనకుమనమే పొంగిపోయి ఉండవచ్చు. కానీ ఆసంపద ఎలా వచ్చిందో తెలుసుకుంటే, వాస్తవాలు వెలికితీస్తే గుండె బరువె క్కడం ఖాయం.  అనంత పద్మనాభస్వామివారికి కానుకలుగా ఇచ్చిందికాకుండా నాటి ప్రభువులు, సంస్థా నాధీశుల నిరంకుశ దోపిడీ ఫలితంగా కూడా ఎంతో విలువైన సంపద దేవలం నేలమాళిగలోకి చేరాయన్నది సత్యం. రక్తం చిందించడంతో రత్నరాశులు వచ్చి చేరాయన్నది కూడా సత్యమే.

కట్టుకథలు కావు
ఇప్పుడు  చెప్పబోయేది కట్టుకథలు కావు. లైబ్రరీల్లో పొందుపరిచిన తాళపత్రాలు, అనేక రికార్డులు, కేరళ చరిత్రం, తిరువిథాంకూరింటె వంటి గ్రంధాల ఆధారంగా చెప్పబోతున్నవే. మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా చరిత్ర పుటలు తిరగేస్తే కనిపించని కన్నీటి కథలు ఎన్నో ఉంటాయి. కేరళలోని సముద్రతీరంలో ఉన్న అనంతపద్మ నాభస్వామి ఆలయం చాలా విశాలమైనది. అక్కడి భూగర్భంలోని ఆరు నేరమాళిగల గదుల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐదు గదులు తెరిచారు. దీంతో అపార సంపద వెలుగుచూసింది. యావత్ ప్రపంచం విస్తుపోయింది. దీంతో కొంత అధ్యయనం అవసరమనిపించి చరిత్రలోకి తొంగిచూడాల్సి వచ్చింది.
నాయిర్ల దౌర్జన్యం
15వ శతాబ్దిలో కేరళ ప్రాంతంలో నాయిర్లు సంస్థానాదీశుల్లా ఉంటూ నిరంకుశంగా ప్రవర్తించారు. నాయర్లు చివరకు ఎంతగా తెగించారంటే, నాటి రాజవంశస్థులను సైతం లెక్కచేసేవారు కారు. రాజవంశస్థుల్లో చిన్నవాడైన మార్తండ వర్మను సైతం హతమార్చడానికి నాయిర్లు కుట్రపన్నారు. దీంతో మార్తండ వర్మ రహస్య సొరంగం గుండా రాజభవనాన్ని విడిచివెళ్ళిపోయారట. బహుశా ఇలా పారిపోవడానికే నేలమాళిగ నుంచి ఓ దారి ఏర్పాటు చేసుకుని ఉంటారు. మిగతా వాళ్లెవరూ గుర్తించకుండా సొరంగ మార్గాన్ని రాతిఫలకంతో మూసేసి దానిపై నాగుపాము బొమ్మలు చిత్రించి ఉండవచ్చు. చూసేవారు, ఈ గదిలో నాగబంధం ఉన్నదన్న అభిప్రాయం కలిగించేందుకే వారి ఇలా చేసి ఉండవచ్చు.
రక్త `నిధి’
మళ్ళీ అసలు విషయంలోకి వెళదాం… నాటి కేరళ రాజు అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. యుద్ధంలో పరాజితులైన వాళ్లు విధిగా అపార సంపదను కానుకలుగా ఇచ్చేవారు. వాటిని రాజు తీసుకువచ్చి, అనంత పద్మనాభస్వామి ఆలయం దిగువన ఉన్న నేలమాళిగల్లోనే దాచేవారు. అలా పేరుకుపోయిందే ఈ సొమ్ము. రక్తంతో తడిసిన సొమ్ము ఇది. కాదనలేని సత్యం ఇదే…
(నాటి రాజు, పద్మనాభుడికే రాజ్యభారం ఎందుకు అప్పగించారు? ఇందులోని మతలబు ఏమిటి?  ఆ వివరాలు తరువాయి భాగంలో…)
ట్రావెన్ కోర్ రాజ్యం (తిరువనంతపురం రాజ్యం) అనేక ఒత్తిళ్లకు గురవుతుండేది. నాటి రాజులకు యుద్ధభ యం ఉండేది. మార్తండ వర్మ 1750 ప్రాంతంలో తన రాజ్యాన్ని అనంతపద్మనాభస్వామి పాదాలకింద ఉంచేశాడు. అంటే, రాజ్యభారాన్ని స్వామికే వదిలేశాడు. మామూలుగా మాటలతో చెప్పడంకాదు, ఈ మే రకు రాజశాసనం చేశాడు. అప్పటి నుంచి ట్రావెన్ కోర్ రాజ్య భారం అనంతపద్మనాభస్వామిదే అయింది. రాజు అన్న వాడు కూడా పద్మనాభ దాసుడే. రాజ్యంలోని ప్రతిఒక్కరూ పద్మనాభదాసులే నంటూ చాటిం చాడు. దీంతో మార్తండ వర్మకు కొంతలో కొంత యుద్ధ భయం తీరింది. సాక్షాత్తు పద్మనాభుడే రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు సహజంగానే హిందూ రాజులెవ్వరూ ఆ రాజ్యం జోలికి పోయేవారు కాదు. పైగా, తమకు తోచిన కానుకలను ఇచ్చి పంపేవారు. అలా మార్తండ వర్మ రాజనీతి ఫలించింది. యుద్ధాలు లేకుండానే సిరిసంపదలు వచ్చిపడ్డాయి. అలా వచ్చిన నిధులను ఆలయం నేలమాళిగల్లో భద్రపరిచేవారు.
అయినప్పటికీ, శైవమతానికి చెందిన రాజులు కొంత మంది అనంత పద్మనాభుని రాజ్యంపై కన్నేశారు. కొన్ని చోట్ల తీవ్రమైన దాడులు జరిపారు. వైష్ణవాలయాలను కొల్లగొట్టారు. అక్కడ ఉన్న నిధినిక్షేపాలను తరలించు కుపోయారు. అడ్డువచ్చిన వారిని నరికి చంపేసేవారు. ఈ క్రమంలోనే ట్రైవెన్ కోర్ రాజ్యం అప్రమత్తం కావాల్సి వచ్చింది.  సంపదను భవిష్యతరాలవారికి క్షేమంగా అందజేయడం ఎలా అన్న విషయంపై రాజవంశస్థులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాతికట్టడాల్లో నైపుణ్యం ఉన్న శిల్పులను, నిపుణులను రప్పించి అత్యంత భద్రమైన నేలమాళిగ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కుచెదరకుండా ఉండేలా వాటి ని తీర్చిదిద్దారు. ఆలయాన్నే కోశాగారంగా మార్చారు. ఆలయ మూర్తినే చక్రవర్తిగా మార్చేశారు. అయితే, సంస్థానాధీశుల నిరంకుశ వైఖరి కారణంగా పన్నుల రూపంలో ధనరాశులు రాబట్టారు. చివరకు బిడ్డకు పాలివ్వాలన్నా ఆ తల్లి సుంకం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దోపిడీ విధానాలేమిటో తరువాయి భాగంలో తెలుసుకుందాం..
అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలో అపార నిధినిక్షేపాలు దొరకడంతో ఇప్పుడు అందరి కళ్లు అటే పడ్డాయి. తరగని సంపద ఉన్నదని సంతృప్తి చెందుతున్నామేకానీ, అదంతా ఎలా వచ్చిందో ఆలోచించడంలేదు. అనేక యుద్ధాలు, రక్తపాతాలు, పసిగుడ్డు తల్లుల శాపనార్ధాల ఫలితంగా కూడా సంపద ఈ నేలమాళిగలో పోగయింది. ఈ మాట గట్టిగా అంటే, నేనేదో హేతువాదిననో, దేవుడికి తీరని అన్యాయం చేస్తున్నాననో అనుకోవచ్చు. అలాంటి ఉద్దేశాలు, ఇమేజ్ లు నాకు లేవు. ఉన్నదల్లా, వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావలన్న తపనమాత్రమే.  ఇప్పటికే రెండు పార్ట్స్ చదివే ఉంటారు. ఇది ఆఖరి పార్ట్.
నాటి పాలకులు సుంకాలు వసూలు చేయడంలో చాలా నిర్దయగా వ్యవహరించేవారు. అపార సంపదను కూడబెట్టడం మార్తాండవర్మ హయాంలోనే ఎక్కువ జరిగిందని  అక్కడి స్థానికులు చెబుతున్నారు. సామంతరాజులు, విదేశీ వ్యాపారవేత్తల నుంచి వచ్చే కానుకలతో పాటుగా అతి సామాన్యుల దగ్గర నుంచి కూడా ముక్కు పిండి సుంకాలు వసూలు చేసి కోశాగారం నింపేవారు. నిజం చెప్పాలంటే, కోశాగారంలో ప్రధాన వాటా ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చి చేరిందే… నిమ్నవర్గాల వారిని కూడా సంస్థానాధీశులు వదిలిపెట్టలేదు. పెళ్ళి జరుగుతుందంటే చాలు, సుంకం చెల్లించాల్సిందే. పిల్లలు పుట్టినా పన్ను కట్టాల్సిందే. చివరకు మృత్యువు కౌగలించుకున్నా, కాటి సుంకం కట్టాల్సిందే.
ఇంకా అనేక వస్తువులపై కూడా పన్ను భారీగానే చెల్లించాల్సి వచ్చేది. నాటు పడవలు కొన్నా మత్స్యకారులు సుంకం చెల్లించాల్సిందే. రైతులు నాగళ్లు కొనేటప్పుడు సుంకం చెల్లించాల్సి వచ్చేది. ఎడ్లబండ్లు తయారు చేయించుకున్నా, చివరకు గొడుగులు కొన్నా సంకం తప్పదు. పన్నుల బెడద ఇంతటితో ఆగలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. మీసాలు పెంచినా పన్ను కట్టాల్సి వచ్చేదంటే ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇదే నిజమని చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ఈ దోపిడీ ఇక్కడితో ఆగలేదు. తల్లులు పిల్లలకు పాలివ్వాలంటే ముందుగా విధిగా సుంకం కట్టితీరాల్సిందే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ,  `ములకరమ్’ గా పిలిచే బ్రెస్ట్ టాక్స్ ని మాత్రం నాటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన కథ ఒకటి కేరళలో ప్రచారంలో ఉంది. బిడ్డకు పాలివ్వాలన్నా సుంకం
చెరితాలాకు చెందిన కాపున్తల కుటుంబానికి చెందిన ఓ యువతి తన కుమారుడికి స్తన్యం ఇస్తోంది. అయితే, ఆమె ఇందుకు సుంకం చెల్లించలేదు. అంటే పాలివ్వడానికి అధికారికంగా ఆమెకు అనుమతి రాలేదన్నమాట. ఈ విషయం తెలియగానే రాజాధికారులు అక్కడకు చేరారు. ఆమెను నిలదీశారు. సుంకం చెల్లించకుండా పిల్లకు పాలివ్వడం నేరమంటూ వాదనకు దిగారు. దీంతో ఆ తల్లి ఇంట్లోకి పోయింది. సుంకం సొమ్ము తెచ్చి ఇస్తుందని అధికారులు భావించి ఇంటి ముందు వేచి ఉన్నారు.  కానీ అనుకోని సంఘటన జరిగింది. లోపలి నుంచి బయటకు వచ్చిన ఆ యువతి తన రెండు స్తన్యాలను కోసి దోసిళ్లతో పట్టుకుని వాటిని రాజాధికారుల పాదాల ముందు గిరాటేసి కుప్పకూలి చనిపోయింది.

కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం నేల మాలిగలోని అపార సంపద వెనుక దాగున్న కన్నీటి కథలు రాద్దామని మొదలు పెట్టిన ఈ వ్యాసపరంపర నిజానికి మూడో పార్ట్ తోనే ముగిసినట్టు భావించాను.  కానీ, ఇదో అనంత ప్రవాహంలా సాగేలా ఉంది. అందుకే మళ్ళీ మొదలుపెట్టాల్సి వచ్చింది…

అనంత పద్మనాభుని సంపద ఎంతో భక్తులకు చాటిచెప్పాలని కోర్టుకెక్కిన సుందర రాజన్ హఠాత్తుగా మరణించడం ఈ కన్నీటి కథల్లో తాజా మలుపు.
నేలమాలిగల్లో ఇటీవల లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పురాతన సంపద వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. అసలు ఈ సంపద గురించి బయట ప్రపంచానికి తెలియడానికి ప్రధాన కారణమైన, నేలమాలిగలు తెరవాలని న్యాయపోరాటం చేసిన వ్యక్తి సుందరరాజన్.
ఆయన వయోభారంతో మరణించారా…లేక ఏదైనా బలమైన కారణం ఉన్నదా అన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఏడుపదుల వయసులో కూడా సుందర రాజన్ నిన్నమొన్నటి వరకు హుషారుగానే తిరిగారు. ఆలయం పక్కనే వారి ఇల్లు. ఆయన గతంలో ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భద్రతా విభాగంలో కీలక బాధ్యతలే చేపట్టారు. ఆ తరువాత న్యాయవాదవృత్తిలో స్థిరపడ్డారు. సుందరరాజన్ తండ్రి రాజవంశస్థుల దగ్గర న్యాయ సలహా దారునిగా పనిచేశారు. బహుశా, అందుకనేనేమో, ఆలయంలోని నిధినిక్షేపాల గురించిన కీలక సమాచారంపై ఆయనకు అవగాహన ఏర్పడి ఉంటుంది. అంతేకాదు, రాజవంశస్థులు `అనంత’ సంపదపై తమదే పూర్తి హక్కులన్నట్టుగా మాట్లాడటం కూడా ఆజన్మబ్రహ్మచారి అయిన సుందర రాజన్ ను బాధించింది. ఒకప్పుడు ఇదే రాజవంశస్థులు (మార్తాండవర్మ) మొత్తం రాజ్యాన్నే అనంత పద్మనాభుని పాదాల చెంతన ఉంచారు. రాజు కూడా పద్మనాభదాసుడేనని ప్రకటించారు. అలాంటి రాజవంశస్థుల్లో క్రమేణా ఆలోచనల్లో మార్పు వచ్చిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. స్వామివారికి వచ్చిన కానుకలను సైతం తమ సొంత సొమ్ముగా భావించే మనస్తత్వం మొగ్గతొడగడంతోనే సుందర రాజన్ ఈ సంపదను ప్రపంచానికి తెలియజెప్పాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఆయన కోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని నియమించి నేలమాలిగల్లోని గదులను తెరిపించే పనికి పూనుకుంది. ఇప్పటికే ఐదు గదులు తెరిచారు. లక్షన్నర కోట్ల రూపాయల సంపద బయటపడింది. మార్కెట్ విలవ ప్రకారం ఇది ఐదులక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు.
సహజ మరణమేనా?
ఆ జన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ రెండు రోజుల పాటు జ్వరంలో బాధపడి హఠాత్తుగా మృతి చెందారు. కానీ తన సంపదను బయటకు తీసి లెక్కించడంపై అనంత పద్మనాభుడు కన్నెర్ర చేశాడా? లేక నేలమాలిగల్లోని నిధులకు కాపలా ఉన్నట్లు చెబుతున్న నాగరాజస్వామి కాటేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సుందర రాజన్ కూడా పద్మనాభుని భక్తుడే. ఆయన తన జీవితాన్ని స్వామి సేవకే అంకితం చేశారు. అలాంటి వ్యక్తిపై పద్మనాభుడు కన్నెర్ర చేస్తాడా?
సుందరరాజన్ మృతిపై ప్రచారం ఉన్నట్టుగానే ఇప్పుడు తిరువనంతపురంలో మరో ప్రచారం ఊపెక్కింది.
కోనేటి సంపదను తాకితే ప్రళయం తప్పదని వార్తలు వస్తున్నాయి. తిరువనంతపురం శ్రీ పద్మనాభ ఆలయం పుష్కరిణిలో వెలకట్టలేని సంపద ఉందని ప్రచారం జరుగుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో అంతులేని సంపద దాగి వుందని ప్రచారం జోరందుకుంది.
మైసూరు రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంతభాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారట.
నాగబంధనం ఆరోగదికే పరిమితమా…లేక మొత్తం అన్ని గదులుకు కలిపి బంధనం వేశారా..?  అదే నిజమైతే ఐదు గదులు తెరవడం వల్లనే నాగుపాములు పగబట్టి సుందర రాజన్ ను చంపేశాయా? లేక రాజవంశస్థుల హస్తం ఏదైనా ఉన్నదా…? ఈ వివరాలు తరువాయి భాగంలో…

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి