7, మే 2014, బుధవారం

వ్యాపారమయమైన రాజకీయం..

వ్యాపారమయమైన రాజకీయం..

12:37 - May 6, 2014
01:41
ఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశం. ఇలాంటి దేశంలో చట్టసభలు ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతున్నాయి. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వం కొద్దిమంది ప్రయోజనాల కోసం ఏర్పడిన సంస్థగా మారిపోతోంది. కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నో కేసులు ప్రధానార్హతగా ఉన్నవారికే పట్టం కట్టే రోజులు వచ్చాయి. గత రెండు లోక్‌సభల్లో సభ్యుల వివరాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీతి, నిజాయితీ స్థానంలో నేరాలు, డబ్బు చేరాయి. ఎన్నికల ఖర్చులో అగ్రరాజ్యం అమెరికాకు దగ్గరగా వచ్చాం. ఈ పరిణామాలన్నీ ప్రజాస్వామ్య మనుగడనే దెబ్బతీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం ఆందోళన చెందుతున్నారు.
మరికొద్దిరోజుల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు...
       
దేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. మే 16 ఫలితాల తర్వాత కొత్త సర్కార్‌ కొలువుదీరుతుంది. ఆ తర్వాత అంతా మామూలే. నాయకులు ఎన్నికల్లో పెట్టిన ఖర్చును రాబట్టడంలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఓటు వేసిన ప్రజలు ఆకలితో కడుపు మండి రోడ్డెక్కుతారు. ఎన్నికలంటే డబ్బు అనే వాదన బలపడిన తర్వాత ఇంతకంటే భిన్నంగా ఉండదు. అగ్రరాజ్యం తర్వాత 30వేల కోట్లు ఖర్చు చేస్తున్న దేశం మనదే. ఎంపీలంటే కొద్ది మంది ప్రయోజనాల కోసం పనిచేసే లాబీయింగ్‌ పోస్టులయ్యాయి. అందుకే కోటీశ్వరులు, కార్పొరేట్‌ సంస్థల అధిపతులు ఈ సభల్లో అడుగుపెడుతున్నారు. ఏడీఆర్‌ సంస్థ జరిపిన నివేదికల్లో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
చట్ట సభల్లో 1249 మంది కోటీశ్వరులు...
          
2009లో జరిగిన 15వ లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్ధుల్లో 1249 మంది కోటీశ్వరులున్నారు. ఇందులో 300 మంది పార్లమెంట్‌కు చేరుకున్నారు. వీరిలో ఎక్కువ మంది పెట్టుబడిదారులు లేదా కార్పొరేట్‌ కంపెనీలకు ప్రతినిధులుగా వ్యవహరించే వారున్నారు. వారిలో కొద్దిమంది మాత్రమే స్వచ్చమైన నాయకులుండవచ్చు. కానీ మెజార్టీ సభ్యుల మధ్య వారి గొంతు వినిపించే అవకాశం తక్కువే.. నేరస్తులను కూడా చట్టసభలకు పంపడానికి ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. 2004లో బీజేపీకి చెందిన 29 మంది నేరచరితలుంటే 2009 నాటికి 44కు పెరిగింది. కాంగ్రెస్‌ కూడా 24 నుంచి 44కు పెంచుకుంది. మరి ఇలాంటి కోటీశ్వరులు, నేరచరితలు పేదల బతుకులు మారుస్తారా?
ఏపీలో పెరుగుతున్న బిలియనీర్లు...
          
ఏటేటా పేదల బతుకులు మరింత దిగజారుతుంటే.. ప్రజాప్రతినిధుల ఆస్తులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గడిచిన లోక్‌సభ కంటే ఇప్పుడు పోటీ చేస్తున్న వారిలో శత కోటీశ్వరులు సంఖ్య రెట్టింపైంది. ఆంధ్రప్రదేశ్‌లోనే డజనుకుపైగా బిలియనీర్లు బరిలో ఉన్నారు. రాజకీయాలను డబ్బు ఎంతగా శాసిస్తుందో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గమే నిదర్శనం. ఒకరు లంచాలిచ్చిన వ్యాపారి అయితే.. మరోనేత జైలుకెళ్లొచ్చిన పారిశ్రామిక వేత్త. కంపెనీల్లో పెట్టుబడి ఎలా పెడుతున్నారో.. రాజకీయాలను కూడా వెంచర్‌లా మార్చేశారు. ఇందులో కూడా లాభనష్టాలు అంచనా వేస్తున్నారు. రాత్రికి రాత్రికి పెట్రోలియం శాఖ మంత్రిగా మారి.. రిలయన్స్ వంటి సంస్థలకు అనుకూల నిర్ణయాలూ తీసుకున్న ఘనులూ ఉన్నారు.
పెరుగుతున్న అంతరాలు... మారని పేదల బతుకులు...
          
అంటే మొత్తం మీద ప్రభుత్వాలంటే అర్ధం మారుతోంది. ప్రజల చేత కొద్ది మంది స్వార్ధ ప్రయోజనాల కోసం ఎన్నుకుంటున్న ప్రభుత్వాలివి. వీరు వ్యక్తిగత దూషణలు, విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజాసమస్యలు చర్చకు రాకుండా చేయడంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు మీడియాను కూడా వాడుకుంటున్నారు. అందుకే దేశంలో ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ పేదల బతుకులు మారడం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి