28, మే 2014, బుధవారం

విభజన పర్వం 3.. -చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఇలా..

     రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంటు ఎగువ సభ, దిగువ సభల్లోనూ సంఖ్యాపరంగా సభ్యుల ప్రాతినిధ్యాల విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన బిల్లు-2013ను అనుసరించి రాజ్యసభ స్థానాలకు సంబంధించి రెండు రాష్ట్రాల విభజన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 18మంది రాజ్యసభ సభ్యులకి బదులు 11 మంది సభ్యులు ఉంటారు. మిగిలిన ఏడు స్థానాలు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తాయి. అయితే ఇప్పుడున్న సభ్యుల పదవీ కాలంలో ఎలాంటి మార్పులుండవు.
ఇక రాజ్యసభలో విభజన ఏవిధంగా వుండనుందో ఒకసారి పరిశీలిద్దాం..
    
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎంపీలను కొత్తగా ఏర్పడిన తెలంగాణకు, అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు మధ్య 7:11 నిష్పత్తి లో కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మొదటి షెడ్యూల్ లోని 13వ సెక్షన్ లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం రాజ్యసభ ఛైర్మన్ మే 28న ఉదయం 11:30 గంటలకు లాటరీ తీయాల్సి వుండగా ఎంపీల మధ్య అంగీకారం లేకపోవడంతో లాటరీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ సందర్భంగా మూడు ద్వైవార్షిక సంవత్సరాల్లో రాజ్యసభనుంచి పదవీ విరమణ చేయనున్న సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు కేటాయిస్తారు. జూన్ 21, 2016 నాటికి పదవీకాలం ముగిసే ఆరుగురు సభ్యుల్లో ఇద్దర్ని తెలంగాణకు, నలుగురిని ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయిస్తారు. 2018 ఏప్రిల్ 9న పదవీకాలం ముగిసే ఆరుగురిలో ఇద్దరిని తెలంగాణకు, నలుగురిని ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయిస్తారు. ఫలితంగా వచ్చే ఆరేళ్లలో రాజ్యసభలో తెలంగాణకు ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ కు 11మంది సభ్యుల ప్రాతినిధ్యం లభిస్తుంది. రాజ్యసభ సభ్యకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇటీవలే మరణించిన అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన రెడ్డి స్థానం ఖాళీ అయ్యింది. దీంతో 28 న జరిగిన లాటరీకి కేవలం 17 మంది సభ్యులే హాజరయ్యారు.
2016నాటికి పదవీవిరమణ చేసేవారు..
    
2016 జూన్ 21న జేడీ శీలం, జైరాం రమేష్, నేదురమల్లి జనార్ధన్ రెడ్డి, వి. హనుమంతరావు, గుండు సుధారాణి, వై.సుజనా చౌదరి రిటైర్ అవుతారు. వీరిలో వీహెచ్, సుధారాణి తెలంగాణకు చెందిన వారు. ఈ ఆరుగురు సభ్యులు ఒక అవగాహనకు వచ్చి వీరిద్దర్నీ తెలంగాణకు కేటాయించాలని సభాధ్యక్షుడికి ఏకగ్రీవంగా తీర్మానిస్తే లాటరీ లేకుండానే వీరిద్దరూ తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యంలోకి వెళ్లే అవకాశాలుంటాయి.
2018లో ఎవరెవరు?
   
2018లో ఏప్రిల్ 2న పదవీ కాలం ముగిసే సభ్యుల జాబితాలో రేణుకా చౌదరి, రాపోలు ఆనంద భాస్కర్, సీఎం రమేష్, కె. చిరంజీవి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఉన్నారు. వీరిలోంచి ముగ్గురిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఆనంద్ భాస్కర్, పాల్వయి గోవర్ధన్ రెడ్డి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాటరీ వేసి వీరిలోంచి ముగ్గుర్ని తెలంగాణకు కేటాయించే అవకాశాలున్నాయి.
2020 లో ఎవరెవరు?
   
ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ తరుపునకేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, తెరాస నుంచి కె. కేశవరావు, తెలుగుదేశం నుంచి గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మీ, 2020 ఏప్రిల్ 2 న రిటైర్ అవుతారు. వీరిలోంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి వుంటుంది. ఈ ఆరుగురిలో మోహన రావు, కేశవ రావు, ఎంఏ ఖాన్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాటరీ తీసి వీరిలోంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించే అవకాశాలున్నాయి.
లోక్ సభలో..
    
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన బిల్లు-2013ప్రకారం రెండు రాష్ట్రాలను వేరుచేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి రాష్ట్రంలోని ప్రస్తుత 42 లోక్‌సభ స్థానాల్లో మార్పులు అమలులోకివస్తాయి. ప్రజా ప్రాతినిథ్య చట్టం-1950 మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉంటాయి. అలా ఆయా రాష్ట్రాల్లో చేరిన నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుల పదవీ కాలంలో ఎలాంటి మార్పు ఉండదు. నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులు-2008 ని అనుసరించి ఈ నియోజకవర్గాల పరిధులు కొనసాగుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి