16, ఏప్రిల్ 2013, మంగళవారం

వాన్‌పిక్‌లో మోపిదేవి పాత్ర భారీగా భూ సంతర్పణ జరిగింది.. డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్


హైదరాబాద్, ఏప్రిల్ 16: వాన్‌పిక్‌కు భారీగా భూములు కేటాయించిన వ్యవహారంలో అప్పటి మౌలిక వసతులు, ఓడరేవుల మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పాత్ర ఉందని సీబీఐ పేర్కొంది. ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. మోపిదేవి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై అభ్యంతరం చెబుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో.. సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. వాడరేవు, నిజాంపట్నం ఓడరేవులకు 2 వేల ఎకరాల చొప్పున, కారిడార్‌కు 24 వేల ఎకరాల భూకేటాయింపు జరుపుతూ ఇచ్చిన జీవోల వెనుక మంత్రి హస్తం కూడా ఉందని స్పష్టం చేసింది.

జగతిలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854 కోట్ల పెట్టుబడు లు పెట్టినందుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్సుకు భూములు కేటాయించారని ఇదంతా క్విడ్ ప్రో కో విధానంలో జరిగిందని తెలిపింది. వాన్‌పిక్ ప్రాజెక్టు మెమొరాండంను మంత్రి మోపిదేవి ఆమోదించారని, దానిని 2008 జూన్ 30న కేబినెట్ ముందు పెట్టారని సీబీఐ తెలిపింది. అయితే, ఈ మెమొరాండానికీ వాన్‌పిక్‌కు పలు రాయితీలు కల్పిస్తూ తయారు చేసిన ముసాయిదా పత్రానికి తేడా ఉందని, ఆ రెండింటిలో సమాచారం వేర్వేరుగా ఉందని పేర్కొంది. మోపిదేవి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చే పరిస్థితి తలెత్తిందని నివేదించింది.

బదిలీకి వీల్లేకుండా చేశారు..
నిర్మించు, నిర్వహించు, బదిలీ.. విధానం కింద ప్రాజెక్టు అమలు కావాల్సి ఉన్నా, బదిలీ అన్న పదం తొలగించి ఎప్పటికీ ఆ ప్రాజెక్టు ప్రభుత్వానికి దక్కకుండా నిమ్మగడ్డకు సొంతమయ్యేలా చేయడంలో మంత్రి పాత్ర ఉందని.. ఈ నేపథ్యంలో ఆయనపై తాము ఐపీసీ 120-బీ, రెడ్‌విత్ 420, 409, 420 పీసీ యాక్ట్- 1988 కేసులు నమోదు చేశామని పేర్కొంది. కేసులకు తగిన ఆధారాలు ఉన్నందు మోపిదేవి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ తన కౌంటర్ పిటిషన్‌లో కోరింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి