16, ఏప్రిల్ 2013, మంగళవారం

కేరాఫ్ కేవీపీ!


హైదరాబాద్, ఏప్రిల్ 16 : కేవీపీ వద్ద చాలా రహస్య సమావేశాలు జరిగేవని.. వాటి వివరాలు మాత్రం తమకు తెలియదని ఆయన వద్ద పీఏలుగా పనిచేసిన వై.రాంబాబు, డీజే నరసింహారావు సీబీఐ అధికారులకు వెల్లడించారు. కేవీపీ వద్దకు శాఖలకు సంబంధించిన ఫైళ్లు వచ్చేవి కావుకానీ.. సీఎం పేషీ అధికారులైన పి.సుబ్రమణ్యం, జన్నత్ హుస్సేన్, ఎంజీవీకే భాను, ప్రభాకర్‌రెడ్డి తరచూ కేవీపీని కలిసేవారని ద్రువీకరించారు. వీరు ఫోన్లలోనూ మాట్లాడుకునే వారని తెలిపారు. కేవీపీ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పని చేసిన జనార్దన రెడ్డి నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ ప్లీడర్ల నియామకం వంటి ఫైళ్లను పరిశీలించే వారని రాంబాబు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సునీల్‌రెడ్డి నాలుగైదు రోజులకొకసారి కేవీపీ నివాసానికి వచ్చేవారని తెలిపారు.

వైఎస్ కేబినె ట్‌లోని మంత్రులందరూ తరచూ కేవీపీ వద్దకు వచ్చేవారని... చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా కేవీపీ దర్శనం చేసుకున్నవారేనని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తామడ గోపాలకృష్ణ కూడా కేవీపీ కార్యాలయానికి వచ్చేవారన్నారు. "చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు కేవీపీని కలవాలనుకునే వారు. కానీ... కేవీపీ వ్యక్తిగతంగా చెప్పిన వారికి మాత్రమే అపాయింట్‌మెంట్ లభించేదని తెలిపారు. పీవీపీ గ్రూప్‌నకు చెందిన పొట్లూరి వరప్రసాద్ పలు సందర్భాల్లో కేవీపీతో ఉండేవారని తెలిపారు.

పారిశ్రామికవేత్తలైన మ్యాట్రిక్స్ ప్రసాద్, పెన్నా ప్రతాప్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, శ్రీనివాసన్, శ్యాంప్రసాద్‌రెడ్డి, నిత్యానందరెడ్డి, శ్రీనివాస రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు తరచూ కేవీపీని కలిసేవారని నరసింహారావు ద్రువీకరించారు. విజయ సాయిరెడ్డి కేవీపీ కార్యాలయానికి రావడంతోపాటు అక్కడినుంచే ఫోన్లు కూడా చేసేవారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో తాను కేవీపీతోపాటు అప్పటి సీఎం క్యాంప్ ఆఫీసు, అధికారిక నివాసానికి వెళ్లేవాడినని... ఆ సమయంలో వైఎస్‌తో కేవీపీతోపాటు జగన్, సాయిరెడ్డి కూడా అక్కడే ఉండటం గమనించానని వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి