8, మార్చి 2013, శుక్రవారం

పని చేయకపోతే ఉద్యోగులకు జరిమానా


న్యూఢిల్లీ, మార్చి 7: పౌరులకు అన్ని రకాల సేవలు తగిన సమయంలోనే అందేలా చూసే బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎవరైనా ప్రభుత్వాధికారి ఇలాంటి సేవలు అందించడంలో తన విధులను సరిగా నిర్వర్తించని పక్షంలో వారికి రోజుకు రూ. 250 నుంచి గరిష్ఠంగా రూ. 50 వేల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ మేరకు 'వస్తువులు, సేవలను పౌరులు సమయానికి అందుకునే హక్కు, వారి సమస్యల పరిష్కార బిల్లు-2011'కు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

పౌరులు కోరిన సేవలు సమయానికి అందేలా ఈ చట్టం ప్రతి ఒక్క ప్రభుత్వాధికారిపైనా బాధ్యత మోపుతుంది. ఒకవేళ ఏమైనా సేవ అందకపోతే వారి సమస్యల పరిష్కారాన్ని కూడా ఈ చట్టంలోనే సూచించారు. ఎన్నారైలు కూడా ఈ బిల్లు పరిధిలో సేవలను తగిన సమయంలో పొందే అంశాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా చూస్తాయి.

ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక కాల్ సెంటర్, కస్టమర్ కేర్ సెంటర్, హెల్ప్‌డెస్క్ తదితరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రంలోను, ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజాసమస్యల పరిష్కార కమిషన్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర కమిషన్‌లో న్యాయం జరగలేదని భావించినవారు లోకాయుక్తకు, కేంద్ర కమిషన్‌లో న్యాయం జరగలేదనుకున్నవారు లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

ఈ బిల్లు.. శుభపరిణామం: జేపీ
హైదరాబాద్, మార్చి 7 : పౌర సేవల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జయప్రకాశ్‌నారాయణ్ (జేపీ) స్వాగతించారు. ఈ బిల్లుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు.. రాజకీయ వ్యవస్థను ఒప్పించడానికి లోక్‌సత్తా కీలకపాత్ర పోషించిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి