9, నవంబర్ 2013, శనివారం

లెక్కలు తేల్చారు


10/24/2013 4:42:38 PM
-రాష్ట్ర శాఖల నుంచి కేంద్రానికి సమాచారం
-హోం శాఖకు నేడు సీఎస్ ప్రత్యేక నివేదిక
- 11 అంశాలపై వివరాలు కోరిన జీవోఎం
- 19న తెలంగాణపై మంత్రుల బృందం భేటీ
- ఆ సమావేశంలో చర్చకు సర్కారీ కసరత్తు
- సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర యంవూతాంగాలు
- విధివిధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ
- ఈ మెయిల్ ద్వారా తెలుపాలన్న జీవోఎం

హైదరాబాద్, అక్టోబర్ 16 (టీ మీడియా):జిల్లాలేంటి? జిల్లా సరిహద్దులేంటి? నైసర్గిక స్వరూపమేంటి? అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు ఎలా ఉన్నాయి? పార్లమెంటు నియోజకవర్గాల విస్తరణ ఎలా ఉంది? జనాభా గణాంకాలు.. సాగునీటి ప్రాజెక్టులు.. వాటి కింద ఆయకట్టు.. ఆదాయం.. వ్యయాలు.. అప్పు లు.. ఆస్తులు! రాష్ట్రానికి ఏమేం ఉన్నాయి? అవి తెలంగాణలో ఎలా ఉన్నాయి? సీమాంధ్ర ప్రాంతంలో ఎలా ఉన్నాయి? వాటిని ఎలా పంచాలి? అందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలి?.. ఇప్పుడు ఈ వివరాలన్నీ కేంద్రానికి అధికారికంగా వెళుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నప్పటికీ.. మరోవైపు పాలనా వ్యవస్థ తన పని తాను చేసుకుని వెళ్లిపోతున్నది.

ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నెలకొల్పిన మంత్రుల బృందం ఈ నెల 19న సమావేశం కానున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలు కేంద్రానికి నేరుగా సమాచారం ఇస్తున్నాయి. ఇవికాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తయారు చేశారు. దీనిని గురువారం హోం శాఖకు పంపిస్తారని తెలుస్తున్నది. 19న జరిగే సమావేశం నేపథ్యంలో మంత్రుల బృందం కోరిన మేరకు ఈ వివరాలను పంపనున్నారు. మొత్తం పదకొండు అంశాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరగా, ఇప్పటికే ఆయా శాఖలు నేరుగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు వివరాలను అందించాయి.

కేంద్రం ఒక్కొక్క విభాగానికి లేదా శాఖకు నోడల్ అధికారిని నియమించుకోవాలని కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతోనే సమాచారాన్ని తెప్పించుకుంటున్న సీఎస్ అందుకు అనుగుణంగా నివేదికలను పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి టక్కర్ రూపొందించిన నివేదిక ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాల వారీగా సరిహద్దులు, ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధి, జిల్లాల నైసర్గిక స్వరూపం, నియోజకవర్గాల వారీగా జనాభా గణాంకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివరాలు, వాటి కింద సాగు వివరాలు వంటి ఇతరత్రా కీలక సమాచారాన్ని టక్కర్ తన నివేదికలో పొందుపరిచారు. రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పులు, ఆస్తులు, ప్రపంచబ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లిస్తున్న వాయిదాలు, ఇంకా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీ రేట్లు, రిజర్వుబ్యాంకు ద్వారా ప్రజల నుంచి (ఓపెన్ మార్కెట్‌లో) సేకరించిన బాండ్లు, తదితర వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారని తెలిసింది.

రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి కేంద్ర సర్వీసు అధికారుల మొత్తం సంఖ్య, ప్రస్తుతం ఉన్న ఖాళీలు, రాష్ట్ర విభజన జరిగితే నిష్పత్తి ప్రకారం వారి విభజన వంటి విషయాలు కూడా నివేదికలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, క్యాడర్ వారీగా సంఖ్య, నాలుగో తరగతి సిబ్బంది, ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కూడా సీఎస్ తన నివేదికలో పొందుపరిచారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఆర్టికల్ 371-డీ ప్రకారం రాష్ట్రంలో సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇందులో చేర్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు, అమలులో ఉన్న ప్రాజెక్టువారీగా నీటి కేటాయింపులు, అమలులో ఉన్న ట్రిబ్యునల్స్, మిగులు జలాల అంశాలను కూడా క్రోడీకరించి రిపోర్టు తయారుచేశారు. బొగ్గు, నీరు, గ్యాస్, ఆయిల్ వంటివాటిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టి, సమగ్ర వివరాలను కోరిందని అయితే ఆయా శాఖలనుం చి సమగ్ర వివరాలు రావాల్సి ఉందని సీనియర్ అధికారులు అంటున్నారు.

ఇరు ప్రాంతాల్లో సమస్యలకు కారణమవుతున్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరాలపై ఆయా శాఖల అధిపతులకు ఇప్పటికే సమాచారం కోరుతూ లేఖ రాసినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఖజానాకు కీలకమైన సొంత పన్నుల ఆదాయ వనరుల్లో ఎవరి వాటా ఎంత? అన్న అంశం లో లెక్కలు తేల్చిన అధికారులు వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారని సమాచారం. ఇందులో ఎక్సైజ్ శాఖలో తెలంగాణ వాటా 47% కాగా, సీమాంధ్ర వాటాగా 53%, మరో ప్రధాన కీలక ఆదాయ వనరైన వాణిజ్య పన్నులు (వ్యాట్)లో హైదరాబాద్ కాకుం డా తెలంగాణ వాటాను, మరోవైపు సీమాంధ్ర వాటాను, అదేవిధంగా ప్రత్యేకంగా హైదరాబాద్ వాటాను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయా వివరాలను ప్రభుత్వానికి అందజేయడం విశేషం. వాణిజ్య పన్నుల వసూళ్లకు ఉన్న 6 సర్కిళ్లలో హైదరాబాద్ లేకుండా వస్తున్న పన్నులను లెక్కించారు.

ఇక రవా ణా, స్టాంపు డ్యూటీ వంటి ఆదాయాలపై ఇప్పటికే కీలక అవగాహనకు వచ్చినట్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రా ష్ట్ర ఖజానాకు వాణిజ్య పన్నులు (వ్యాట్) రూపంలో రూ. 41,027 కోట్ల ఆర్జన సాధ్యపడింది. ఇందులో తెలంగాణలోని ఒక్క హైదరాబాద్ నుంచే రూ. 27,760 కోట్లు ఖజానాకు చేరడం విశేషం. రాయలసీమనుంచి రూ. 7065 కోట్లు, హైదరాబాద్ లేకుండా తెలంగాణ ప్రాంతనుంచి రూ.6202 కోట్లు, జీహెచ్‌ఎంసీ ప్రాంతం నుంచి రూ.8960కోట్లుగా వాణిజ్య పన్నుల శాఖ లెక్క లు తేల్చి ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో హైదరాబాద్ లేకుండా వచ్చే ఆదాయంతో పోల్చితే సీమాంవూధలో అధిక ఆదాయం సాధ్యమని, అన్ని ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉండటంతో ఎక్కువ ఆదాయం ఇక్కడ కనిపిస్తోందని అధికారులు సమర్పించిన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం విక్రయాలను ఏపీబీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 39 డిపోలద్వారా మద్యం దుకాణాలకు మద్యం విక్రయాలు జరుపుతున్నది.

ఇందులో తెలంగాణలో 17 డిపోలున్నాయి. దేశీయ, విదేశీ మద్యాన్ని తయారుచేసే డిస్టిలరీలు 32 ఉండగా అం దులో 16 డిస్టిలరీలు తెలంగాణ ప్రాంతంనుంచి తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఇక బీర్ తయారు చేసే బ్రూవరీలు తెలంగాణలో 6 ఉండగా, సీమాంవూధలో కేవలం రెండే ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. రెవెన్యూ వివరాలు అధికారులు తయారుచేసిన నివేదికల్లో ఆబ్కారీ శాఖకు వచ్చే ఆదాయాన్ని తెలంగాణలో రూ.4100 కోట్లు, ఆంధ్రలో రూ. 3900కోట్లు, రాయలసీమలో రూ. 1350 కోట్లుగా తేల్చారు.. అయితే రెవెన్యూ పరంగా పరిశీలించినపుడు రాష్ట్రంలో అత్యధిక లైసెన్సు ఫీజు రుసుము తెలంగాణనుంచే లభిస్తుండగా, అధికారులు ఎక్సైజ్ డ్యూటీని హైదరాబాద్‌నుంచి ప్రాంతాలవారీగా విభజించి లెక్కించారు. దీని ప్రకారం ఏపీబీసీఎల్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ మద్యం విక్రయాలు జరిపినా హైదరాబాద్‌లోనే పన్ను చెల్లించేవారు. దీనిని తాజాగా ఆయా ప్రాంతాల మద్యం వినియోగం, తయారీ, అమ్మకాలు ఆధారంగా విభజించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కలుపుకొని 432 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి.

ఇందులో అతి తక్కువ కార్యాలయాలు తెలంగాణలోనే ఉన్నప్పటికీ అత్యధిక ఆదాయం లభిస్తుండటం విశేషం. తెలంగాణ జిల్లాల్లో మొత్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటిద్వారా ఖజానాకు మొత్తం రిజిస్ట్రేషన్ ఆదాయంలో 61 శాతంపైగా లభిస్తున్నది. ఇందులో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాలనుంచే 40 శాతం ఆదాయం లభిస్తున్నది. ఇక 291 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్న సీమాంవూధనుంచి 39శాతం ఆదాయం లభిస్తున్నది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల పరిపాలనా సౌలభ్యంలో భాగంగా 38 రిజిస్ట్రేషన్ జిల్లాలను ఏర్పాటు చేసింది. గతేడాది రూ. 4968 కోట్ల రెవెన్యూలో సుమారు 64 శాతం తెలంగాణనుంచే సాధ్యమైంది. ఈ వివరాలన్నీ నివేదికల్లో పొందుపర్చి.. మంత్రుల బృందానికి అందజేయనున్నారని సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి