8, ఫిబ్రవరి 2012, బుధవారం

‘నీలి వీడియో’ మంత్రుల రాజీనామా



సహకార శాఖ మంత్రి లక్ష్మణ్ సవాది, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి సి.సి.పాటిల్, పోర్టులు, పర్యావరణం శాఖల మంత్రి క్రిష్ణ పాలేమర్ రాజీనామాలు సమర్పించారు. వీరు ముగ్గురూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మొబైల్ ఫోన్ లో నీలి వీడియోలు చూస్తూ పత్రికా విలేఖరుల గ్యాలరీలో ఉన్న కెమెరాలకు దొరికిపోయారు. ముగ్గురు మంత్రులూ పదే పదే విలేఖరుల గ్యాలరీవైపుకి చూస్తుండడంతో తమకు అనుమానం వచ్చిందనీ, ఫోకస్ చేసి చూడగా వారు చేస్తున్న పని అర్ధమై రికార్డు చేశామనీ మంత్రుల వ్యవహారాన్ని రికార్డు చేసిన కెమెరా మెన్ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. తన పేరు బైట పెట్టవద్దని కెమెరా మెన్ కోరినట్లుగా ఆ పత్రిక తెలిపింది.
ముగ్గురు మంత్రుల రాజీనామాలను గవర్నర్ భరద్వాజ ఆమోదించాడు. గవర్నర్ భరద్వాజ కూడా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బి.జె.పి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పించడానికి తాము రాజీనామా చేశామని సవాది తెలిపాడు. ఈ వ్యవహారంపై ‘విచారణ’ జరిపించాలని స్పీకర్ బోపయ్య ను కోరామని ఆయన తెలిపాడు. విచారణలో తాము మచ్చ లేకుండా బైటపడతామన్న విశ్వాసాన్ని సవాది వ్యక్తం చేశాడు. అసెంబ్లీ సమావేశాలలో నీలి చిత్రాలు చూసినందుకే రాజీనామా చేస్తూ తాము మచ్చ లేకుండా బైటపడతామని వారెలా చెప్పగలరో అర్ధం కాని విషయం. కన్నంలో వేలుతో దొరికినా మరొకందుకు వేలు పెట్టామంటున్న వీరినేమనాలి?
ప్రతిపక్ష కాంగ్రెస్, జె.డి(ఎస్) లు ‘మంత్రులు రాజీనామా చేయడంతో సరిపోదనీ, వారిని అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేయాలనీ’ డిమాండ్ చేశారు.
రాజీనామా చేసిన మంత్రి లక్ష్మణ్ సవాది, మంగళవారం పత్రికలతో మాట్లాడుతూ తన చర్యను సమర్ధించుకోజూడడం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఓ స్త్రీతో కొంతమంది పురుషులు డాన్స్ చేస్తున్న దృశ్యాన్ని తాము చూశామనీ, డాన్స్ అనంతరం ఆ స్త్రీని పురుషులు ‘గ్యాంగ్ రేప్’ చేశారనీ ఆయన చెప్పాడు. రేపిస్టులను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారనీ, వారిని బహిరంగంగా రాళ్లతో కొట్టారనీ సవాదీ చెబుతూ, ‘రేవ్ పార్టీల’ లపై అసెంబ్లీలొ చర్చ జరుగుతున్న సందర్భంగా ఆ వీడియో తాము చూడవలసి వచ్చిందని ఆయన సమర్ధించుకున్నాడు. ఉడుపి లో జరిగిన ఓ రేవ్ పార్టీ పై శాసన మండలి లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ వీడియో చూడవలసి వచ్చిందని ఆయన సమర్ధించుకున్నాడు.
నిజానికి, మంత్రులు చూసింది ఒక్క వీడియో కాదనీ, వరుసగా నాలుగైదు నీలి వీడియో క్లిప్పింగ్ లను వారు చూశారనీ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. వివిధ ఛానెళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ లలోనే ఆ విషయం తేటతెల్లమైనట్లుగా ‘హి హిందూ’ వార్తను బట్టి తెలుస్తోంది.
భారత దేశంలోనూ, ఇతర ప్రపంచ దేశాల్లోనూ ఉన్నది ‘పురుషాధిక్య వ్యవస్ధ’. ‘పురుషాధిక్య వ్యవస్ధ’ లో స్త్రీలను తేలిక గా చూడడం, వారిని కోరికలు తీర్చే పనిముట్లుగా చూడడం సర్వామోద సూత్రం. భార్యలను కొట్టే హక్కు భర్తలకు ఉంటుందంటూ పోలీసులు సైతం ఆమోదం తెలిపే వ్యవస్ధలో ‘మగ’ మంత్రులు ఈ విధంగా దిగజారి ప్రవర్తించడం ఆశ్చర్యం కాకపోవచ్చు. వారు అసెంబ్లీలలో కూర్చుని పెంచి పోషిస్తున్న పురుషాధిక్య సంస్కృతే వారా విధంగా దిగజారడానికి తగిన సామాజిక ఏర్పాటును కల్పించింది. తమ ఆర్ధిక దోపిడి ని కొనసాగించడానికి సమాజంలోని సకల సామాజిక వైకల్యాలను చూసీ చూడనట్లు పోయే పెట్టుబడిదారీ, భ్యాస్వామ్య పాలకులు స్త్రీలను గౌరవిస్తారనుకోవడం భ్రమే కాగలదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి