15, జులై 2014, మంగళవారం

కళ్ళ ముందే ఇంత దుర్మార్గమా?


మురళీరవం
ఏడెనిమిది వారాలుగా పనుల ఒత్తిడివల్ల ఈ శీర్షికకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా ఆ ఒత్తిడి తగ్గి వెసులుబాటు వచ్చిందని కాదు గాని, కళ్లముందర జరిగిపోతున్న అత్యంత అమానుషమైన దుర్మార్గం పట్ల సమాజమంతా మౌనసాక్షిగా ఉండిపోతుండడం చూసి ఇది పునఃప్రారంభిస్తున్నాను.
‘విరబూసే యాపిల్ చెట్ల సౌందర్యం కాదు, సత్యానికి తారుపూసే హిట్లర్ ఉపన్యాసాల బీభత్సం నా చేత కవిత్వం రాయిస్తోంది’ అని బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆనందం కన్నా కేంద్ర ప్రభుత్వం, కోస్తా, రాయలసీమ కాంట్రాక్టర్-రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యక్షంగా సాగించిన దుర్మార్గం, తెలంగాణ నాయకుల కుటిల మౌనం కలగలిసి ఖమ్మం జిల్లా ఆదివాసుల జీవితాల మీద జరగనున్న బీభత్సమే ఇవాళ రాయడానికి పురికొల్పుతున్నది. 
నిజానికి పోలవరం ప్రాజెక్టు కేవలం మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసే, వారి జీవితాలను ధ్వంసం చేసే పథకం మాత్రమే కాదు, దాన్ని వ్యతిరేకించడానికి మరెన్నో కారణాలున్నాయి. పోలవరం ఆనకట్ట ఏదో బహుళార్థ సాధక అభివృద్ధి పథకమనీ, అది కోస్తా, రాయలసీమలకు ఏదో మంచి చేస్తుందనీ, అన్ని “మంచి” పనులకూ ఏదో ఒక బలి ఇవ్వక తప్పదనే హిందూ బ్రాహ్మణ ఆచారం ప్రకారం ఆదివాసుల బలి తప్పదనీ చాల మంది అమాయకులు భావిస్తున్నారు. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చామనే ముసుగు వేసుకుని పాలకవర్గాలు పోలవరం ప్రాజెక్టును తీసుకువస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు గురించి మొదటి ఆలోచన 1941లోనే వచ్చినప్పటికీ గత ఆరు దశాబ్దాలలో వేరువేరు ప్రభుత్వాలు ఎన్నో రూపాలలో అధికారిక సమాచారాలు ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ ఏ అబద్ధమూ లేని సమగ్ర సమాచారం దొరకడం లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న లక్ష్యాలు వేరు, లోపాయకారీ లక్ష్యాలు వేరు. ప్రభుత్వం చెపుతున్న ఖర్చు వేరు, నిజంగా జరిగే ఖర్చు వేరు. ప్రభుత్వం చెపుతున్న జలాశయ సామర్థ్యం వేరు, వాస్తవ సామర్థ్యం వేరు. అసలు ఎంత ఎత్తు ఆనకట్ట కట్టబోతున్నారనేదే ప్రభుత్వం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెపుతున్నది. జలాశయం వల్ల నిజంగా జరిగే ముంపు బీభత్సానికీ, ప్రభుత్వం చెపుతున్న అంకెలకూ పొంతన లేదు. ఆ జలాశయం కింద ముంపుకు గురయ్యే అడవి గురించీ, మత, సాంప్రదాయిక, చారిత్రక స్థలాల గురించి సరైన సమాచారం లేదు. ఆ జలాశయం ఏర్పడబోయే భూమి అంత నీటి ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నకు జవాబు లేదు. 
కేంద్ర జల వనరుల సంఘం వేసిన ప్రశ్నలలో సగానికి కూడ జవాబు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం మాయ చేసిందో ఎవరికీ తెలియదు. సుప్రీంకోర్టులో రెండు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు ఇంకా విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది “జాతీయ” ప్రాజెక్టుగా కేంద్ర నిధులు ఎలా పొందుతుందనే ప్రశ్నకు జవాబు లేదు. ఆ ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి ఎన్ని కుట్రలు జరిగాయో లెక్కలేదు. ఇన్ని అక్రమాలతో, అస్తవ్యస్తతలతో, అర్ధసత్యాలతో, అసత్యాలతో ఒక ప్రాజెక్టు రూపొందుతుంటే మాట్లాడవలసిన వాళ్లలో అత్యధిక సంఖ్యాకులు మౌనంగా ఉండిపోతున్నారు. లేదా పాలకవర్గ అబద్ధాలను చిలకపలుకుల్లా వల్లిస్తున్నారు. 
అన్నిటికన్నా ఘోరంగా, “మీ రాష్ట్రంలో ఉంటే... ఆ గ్రామాలను ముంచి, ఆ ఆదివాసులను నిర్వాసితులను చేసి, ప్రాజెక్టు కట్టుకోవడానికి ఆటంకాలు సృష్టించేట్టున్నారు. కనుక ఆ గ్రామాలను మాకివ్వండి” అని కోస్తా పాలకవర్గాలు అడిగితే కేంద్రం అంగీకరించింది. “మీ దగ్గర ఉన్న మనిషిని చంపదలిచాను. మీ దగ్గర ఉంటే మీరు అభ్యంతరం చెపుతారు గనుక ఆ మనిషిని నాకు ఇచ్చెయ్యండి. నా మనిషిని నేను చంపుకుంటే మీకేం బాధ” అని ఎవడన్నా అంటే వాడి బేహద్బీకీ, దుర్మార్గానికీ, అమానుషత్వానికీ అసహ్యించుకుంటాం. కాని కోస్తా పాలకవర్గాలు చాల నాజూకుగా ఈ మాటలనే చెపితే కేంద్ర ప్రభుత్వమూ అంగీకరించింది. ఇది సరైన వాదనే అని చాల మంది బుద్ధిమంతులు కూడ భావిస్తున్నారు.     
మొదట పోలవరం పేరు మీద ఊరేగుతున్న మహా అబద్ధాలను చూద్దాం. ఈ ప్రాజెక్టు అటు విశాఖపట్నం జిల్లా నుంచి ఇటు కృష్ణా జిల్లా దాకా కొన్ని లక్షల ఎకరాల వ్యవసాయానికి నీరు, విశాఖపట్నానికి మంచినీరు, ఆ పరిసరాలలో పరిశ్రమలకు నీరు ఇస్తుందని, ఆనకట్ట దగ్గర 960 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తుందనీ, కాలువల ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తుందనీ, గోదావరి వరదలను అడ్డుకోగలుగుతుందనీ, విజయవాడ ప్రకాశం బ్యారేజి దగ్గరికి తీసుకువచ్చి చేర్చే నీటి ద్వారా రాయలసీమకు కూడ నీరు అందించవచ్చుననీ పాలకులు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ పూర్తి అసత్యాలు కాదు గాని అర్ధసత్యాలు. 
వీటిలో సాగు నీరు ప్రభుత్వం చెప్పినంత రాదు. వచ్చేదైనా అవసరమైన దుర్భిక్ష ప్రాంతాలకు రాదు. విశాఖపట్నం తాగునీటి అవసరాలకు ఈ వనరు అవసరం లేదు. జలవిద్యుత్తు కోసం ఆనకట్ట అంత ఎత్తు పెంచనవసరం లేదు. వరదలను అడ్డుకోవడానికి పైన కూడ చిన్న చిన్న ఆనకట్టలు కట్టవలసి ఉంటుంది గాని ఇలాంటి ఒక రాక్షస ప్రాజెక్టు కాదు. రాయలసీమకు నీరు అందిస్తామని చేస్తున్న వాగ్దానం ఎత్తగొట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయని గత చరిత్ర వేనోళ్ల మొత్తుకుంటున్నది.
 
మొత్తానికి ఇన్ని ప్రయోజనాలు చెప్పినప్పటికీ పూర్తి వాస్తవరూపం ధరించేవి విశాఖపట్నం – కాకినాడ మధ్య రాబోతున్న బహుళజాతి పారిశ్రామిక సంస్థల, పెట్రోకెమికల్ సంస్థల నీటి అవసరాలు తీర్చడం, ప్రకాశం బ్యారేజి దగ్గర నీటి నిలువను స్థిరీకరించి కృష్ణా – గుంటూరు జిల్లాల ఆయకట్టులో మూడో పంటకు వెసులుబాటు కల్పించడం. అంటే ప్రకటిత లక్ష్యాలు ఆరేడింట్లో నిజంగా నెరవేరేవి రెండు మాత్రమే. అవి అటు బహుళజాతి సంస్థలు, ఇటు కృష్ణా – గుంటూరు రైతాంగం అనే రెండు బలమైన లాబీల ప్రయోజనాలు కావడం వల్ల కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వంటి జాతీయ పార్టీలు, తెలుగుదేశం వంటి ప్రాంతీయపార్టీ ఇంతగా ప్రత్యక్ష మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణ పార్టీలు కూడ ఏదో ఒక రకంగా తెలంగాణ వస్తే చాలుననే రాజీధోరణి ద్వారా ఈ దుర్మార్గం పట్ల మౌనం వహిస్తున్నాయి. 
       
నిజానికి ఇది తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఆటంకం కలిగించే ప్రాజెక్టు. బచావత్ ట్రిబ్యునల్ అంగీకరించిన ముఖ్యమంత్రుల ఒప్పందం ప్రకారం గోదావరి జలాలలో పాత ఆంధ్రప్రదేశ్ వాటా 1480 టిఎంసిలు కాగా, ఏ న్యాయసూత్ర ప్రాతిపదికన చూసినా దానిలో తెలంగాణ వాటా 900 టిఎంసిలు, ఆంధ్ర వాటా 580 టిఎంసిలు కావాలి. ఆంధ్ర వాటాలో ఇప్పటికే 320 టిఎంసి వినియోగం జరుగుతున్నది. అంటే ఆంధ్రకు ఇంకా 260 టిఎంసి కన్న ఎక్కువ వాడుకోవడానికి అవకాశం లేదు. కాని పోలవరం ప్రకటిత వినియోగమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు వెబ్ సైట్ 2010లో రాసిన ప్రకారం 301.38 టిఎంసి కాగా, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీటిపారుదల శాఖ 1986లో తయారు చేసిన సమగ్ర ప్రణాళిక ప్రకారం అది 336.57 టిఎంసిలు. కె. బాలగోపాల్ 2005లో వేసిన లెక్క ప్రకారం పోలవరం ఆనకట్ట ఎత్తును బట్టి ఈ జలాశయం నుంచి 500 టిఎంసి వాడుకునే అవకాశం కూడ ఉంది. ఈ లెక్కలలో కనీస సామర్థ్యపు వాటా కూడ ఆంధ్రకు లేదు. కాని ఒకసారి కేంద్ర నిధులతో ఆనకట్ట కట్టినతర్వాత, ప్రిస్క్రిప్టివ్ రైట్స్ (అక్రమంగానైనా, సక్రమంగానైనా సంపాదించినవారిదే సంపాదన మీద హక్కు అని చెప్పే న్యాయసూత్రం) ఆధారంగా ఈ అదనపు వినియోగం కూడ వారిదే అవుతుంది. అంటే ఆ మేరకు తెలంగాణ నష్టపోతుంది.
పోనీ అది ఆంధ్ర ప్రాంత రైతాంగానికైనా ఏమైనా మేలు చేస్తుందా అంటే అది కూడ వాస్తవం కాదు. అక్కడి ప్రజలను రెచ్చగొట్టి, ఈ అన్యాయానికి సమర్థన తెచ్చుకోవడానికి పాలకులు అబద్ధాలు చెపుతున్నారు గాని ఆ ప్రాజెక్టు వల్ల కృష్ణా – గుంటూరు ఆయకట్టులో మూడవ పంటకు తప్ప మిగిలిన జిల్లాల రైతాంగానికి జరగబోయే మేలేమీ లేదు.
అయినా ఇంకా తక్కువ ఎత్తు ఆనకట్ట కట్టి, తక్కువ ముంపుతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వస్తున్న ప్రత్యామ్నాయ డిజైన్లను కూడ పక్కనపెట్టి, అసలు ప్రాజెక్టు అవసరమే లేదంటున్న వాదనలను కొట్టివేసి మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసి ఈ భారీ జలాశయం నిర్మాణానికి పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు.
 
ఈ జలాశయం వల్ల విలువైన అడవి మునిగిపోతుంది. ఆ అడవిలోని ఆదివాసుల సాంస్కృతిక, చారిత్రక స్థలాలెన్నో మునిగిపోతాయి. శబరి నది జలాశయ గర్భంలో అంతర్ధానమై పోతుంది. పాపికొండలు కనబడకుండా పోతాయి. ఈ ప్రాంతం అతి సున్నితమైన భూకంప సంభావ్యతా క్షేత్రంలో ఉండడం వల్ల ఇక్కడ ఇంత పెద్ద జలాశయం నిర్మిస్తే ఆ ఒత్తిడికి భూకంపం సంభవిస్తే రాజమండ్రి, కాకినాడ నగరాలతో సహా వేలాది గ్రామాలు జలసమాధి అవుతాయి. 
అయినా సరే నిర్మించవలసిందే అని, దానివల్ల వేల కోట్ల రూపాయలు ఆర్జించే కంట్రాక్టర్లు, వారినుంచి వందల కోట్ల రూపాయలయినా ముడుపులు పొందే రాజకీయనాయకులు, సాంకేతిక పరిజ్ఞానం తప్ప సామాజిక జ్ఞానం లేని సాంకేతిక నిపుణులు, తెలిసీ తెలియని ‘మేతావులు’ అనుకుంటే అనుకోవచ్చు గాని ఆలోచనాపరుల సంగతేమిటి? కనీసం సహ మానవుల జీవన్మరణ విషాదమైనా కదిలించలేనంత మొద్దుబారిపోయాయా మన ఆలోచనాపరుల హృదయాలు?
       
ఎన్ వేణుగోపాల్

భూమిని ముట్టుకో, ప్రళయమే!


మురళీరవం 16:
భూమితో మాట్లాడు, జ్ఞానమిస్తుంది’ అని బైబిల్‌లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆధ్యాత్మిక అర్థం మాట ఎలా ఉన్నా అది గొప్ప మాట. అది ‘భూమి నాదియనిన భూమి పక్కున నవ్వు’ అని మన వేమన అన్న కాలానికి చాల ముందరి మాట. ఆ రెండు మాటలూ గడిచి ఇవాళ ‘భూమిని ముట్టుకో, ప్రళయమే’ అనే దగ్గరికి చేరినట్టున్నాం. భూమి నాది అనుకోగూడదన్న వేమనను దాటి సమాజం చాల “పురోగమించింది” గదా. భూమి నాదీ అనుకోవచ్చు, ఇతరులదని అనుకున్నా దాన్ని దురాక్రమించుకోవచ్చు. దురాక్రమణను అడ్డుకుంటామని ఎవరన్నా అంటే వారిని భూమిమీద లేకుండానూ చేయవచ్చు.భూసంస్కరణలు అమలు జరుపుతానన్న నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని పడగొట్టడం దాకా, దున్నేవారికే భూమిని పంచాలన్న విప్లవకారులను కాల్చిచంపడం దాకా పోనక్కరలేదు. ప్రభుత్వానికీ విప్లవకారులకూ మొదలైన చరిత్రాత్మక చర్చలలో అక్రమంగా అన్యాక్రాంతమైన భూమి ప్రస్తావన రాగానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి ఆ ప్రస్తావనను “అడ్డగోలు మాటలు”గా అభివర్ణించి, చర్చలకు ముగింపు పలికి నెత్తురుటేర్లు పారించిన చరిత్ర దగ్గరికీ పోనక్కరలేదు.ఇవాళ్టికివాళ జరిగిన, జరుగుతున్న సంగతే చూద్దాం. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూమిలో కొన్ని ఎకరాల భూమిని, వందలాది ఉదంతాలలో రెండు మూడు ఉదంతాలను ముట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందో లేదో పొరుగురాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి కుట్రలు ప్రారంభించింది. రాత్రికి రాత్రి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైదరాబాదు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని కత్తిరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో మాటల్లో చెప్పాలంటే హైదరాబాదును దాదాపుగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రకు తెర లేపింది. అంటే ఇవాళ్టి మాట ‘భూమిని ముట్టుకో, కుట్రలూ, కుతంత్రాలూ’ అన్నమాట!అయితే ఈ పని ఇంత నేరుగా, కళ్లకు కట్టినట్టుగా, అందరికీ తెలిసేట్టుగా జరగలేదు గనుక వివరంగా చెప్పుకోవలసి ఉంది.కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 6న ఒక సర్క్యులర్ పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 8 కింద గవర్నర్ కు సంక్రమించిన అధికారాలను వివరించడం కోసం విడుదల చేసినట్టుగా చెప్పుకుంటున్న ఆ సర్క్యులర్ తెలంగాణకూ, చట్టానికీ, సహజన్యాయానికీ వ్యతిరేకమైన భయానకమైన ఎత్తుగడ. అసలు మొదట ఆ చట్టం బిల్లు రూపంలో ఉన్నప్పుడే ఆ సెక్షన్‌కు ప్రమాదకరమైన పర్యవసానాలు ఉంటాయని, అది చట్టపరంగానూ, న్యాయపరంగానూ చెల్లదని, దాన్ని సవరించాలని నాతో సహా ఎంతోమందిమి వ్యాఖ్యానించాం. ముసాయిదా బిల్లును అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 2013 డిసెంబర్ 4 మర్నాడే నేను, “కొత్త రాష్ట్ర రాజధాని ఏర్పాటయ్యేవరకూ పాత రాజధానిలో ఉండడం వేరు. ఉండవలసి రావచ్చు. కాని దానికి ఉమ్మడి రాజధాని అనే పేరు అవసరం లేదు. అది కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వపు తాత్కాలిక భవనాలకు పరిమితం కావచ్చు. మొత్తం నగరాన్నంతా చాపచుట్టిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి అవసరం లేదు. పైగా ‘ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, ఆస్తులకు సంబంధించి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలను కలిగి ఉంటారు. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల భద్రత గవర్నర్ బాధ్యత’ అని అనడమంటే ఇకనుంచి దేశంలో ఒక రాష్ట్ర రాజధానిలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాల వారందరికీ శాశ్వత ప్రమాదాన్ని తెచ్చిపెట్టడమే. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కొల్లగొట్టడమే. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన అధికారాన్ని కైవసం చేసుకోవడమే. మాటవరుసకు ‘గవర్నర్ తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు’ అని ఉన్నప్పటికీ, దాని తర్వాత వాక్యమే ‘అంతిమ నిర్ణయం గవర్నర్‌దే’ అని ముసాయిదా అంటున్నది గనుక హైదరాబాద్ గవర్నర్ చేతుల్లో, అంటే కేంద్రం చేతుల్లో ఉండబోతున్నదన్నమాట. అంటే పేరుపెట్టకుండానే కేంద్ర పాలిత ప్రాంతం కాబోతున్నదన్నమాట” అని రాశాను.ఆ ముసాయిదా ఏ మార్పులూ లేకుండానే ఫిబ్రవరిలో చట్టం కూడ అయిపోయి, రాష్ట్ర విభజన కూడ జరిగిపోయింది. సెక్షన్ 8 ఈ గవర్నర్ అధికారాలను చట్టబద్ధం చేసింది. అసలు రెండు రాష్ట్రాలకు ఒక ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్, ఆ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఏ అవసరం వల్ల వచ్చాయి? అదే అసంగతమైనదంటే, దేశంలో ఎక్కడా లేనట్టుగా రాజధాని ప్రజల, ఆస్తుల భద్రత బాధ్యత గవర్నర్‌కు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఏ రాష్ట్ర రాజధానిలోనైనా మరొక రాష్ట్ర ప్రజలు లేరా, హైదరాబాదులో మాత్రమే ఇతర రాష్ట్ర ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తుల రక్షణ గవర్నర్‌కు ప్రత్యేకంగా ఎందుకు కట్టబెట్టవలసి వచ్చింది?ఆ ప్రశ్నలకు జవాబులు కావాలంటే కాస్త చరిత్ర లోకి, హైదరాబాద్ ప్రత్యేకతలోకి, హైదరాబాద్ భూముల అక్రమ కబ్జాల చరిత్రలోకి వెళ్లాలి. ఏ రాజరికమైనా తాను పాలించే దేశంలోని భూమి అంతా తనదే అనుకుంటుంది గాని అసఫ్ జాహి పాలకులు ప్రత్యేకంగా తమ రాజ్యంలోని పదోవంతు భూభాగాన్ని తమ సొంత భూమి (సర్ఫ్ ఎ ఖాస్ – సొంత సాదర ఖర్చుల భూమి) గా ప్రకటించుకున్నారు. దాదాపు ఐదు కోట్ల ఎకరాల హైదరాబాద్ రాజ్యంలో యాభై లక్షల ఎకరాలు ఇలా సర్ఫ్ ఎ ఖాస్ గా ఉండేది. ఈ భూమి చాల ఎక్కువగా ఔరంగాబాద్, భీడ్, పర్భని, బీదర్, గుల్బర్గా, ఉస్మానాబాద్ జిల్లాలలో వ్యాపించిన పదకొండు తాలూకాల లోను, అత్రఫ్ బల్దా జిల్లా మొత్తంలోని ఏడు తాలూకాల్లోను ఉండేది. మరో మాటల్లో చెప్పాలంటే రాజ్యం మొత్తంలో 1961 గ్రామాల్లో విస్తరించిన సర్ఫ్ ఎ ఖాస్ భూమిలో 593 గ్రామాలు అత్రఫ్ బల్దా జిల్లాలోనే ఉండేవి. అప్పటి అత్రఫ్ బల్దా జిల్లానే ఇవాళ్టి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలుగా మారింది. సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను ఓడించిన తర్వాత భారత ప్రభుత్వం 1949 ఫిబ్రవరి 22న ఒక ఫర్మానా ద్వారా సర్ఫ్ ఎ ఖాస్ భూముల మీద రాజు అధికారాన్ని రద్దు చేసింది. ఆగస్టులో జాగీర్లను రద్దు చేసింది. ఆ రకంగా అప్పటిదాకా రాజుకూ, జాగీర్దార్లకూ, పాయెగాలకూ, సంస్థానాలకూ, దేశముఖ్‌లకూ చెందిన భూమి అంతా హైదరాబాద్ ప్రభుత్వ భూమి అయిపోయింది. అందులో కౌలుదార్లకు, అప్పటికి సాగుచేసుకుంటున్నవారికి కొంత భాగం దక్కినా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూమి 1949లో హైదరాబాద్ ప్రభుత్వానికీ, 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ దక్కింది. అన్యాక్రాంతం కావడానికీ సిద్ధంగా తయారయింది.నిజానికి ఈ భూమి అటు నిజాందీ, భూస్వాములదీ కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదీ కాదు. అది ఆ భూమిలో రెక్కలు ముక్కలు చేసుకుని పొట్టపోసుకుంటున్న లక్షలాది తెలంగాణ రైతుకూలీలది. భూసంస్కరణల గురించి ఎంతో గంభీరమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వాలు ఆ రైతుకూలీలకు ఎకరం భూమి ఇవ్వడానికి సిద్ధపడలేదు గాని 1956 నుంచీ కోస్తా, రాయలసీమల నుంచి వచ్చిన భూస్వాములకు లీజుల పేరుమీద, ప్రజా అవసరాల పేరుమీద కట్టబెట్టడం ప్రారంభించాయి. ప్రభుత్వానికి ఎక్కడా లేనంత భూమి ఇక్కడ ఉంది గనుక లెక్కలేనన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సైనిక స్థావరాలు, పరిశోధనా సంస్థలు వచ్చి వేలాది ఎకరాల భూములను ఆక్రమించాయి. 1980ల తర్వాత ప్రభుత్వాలు లీజు నిబంధనలను కూడ పక్కనపెట్టి కారుచౌకగా అమ్మడం, ఉచితంగా పందారం చేయడం ప్రారంభించాయి. ఆ భూముల సంతర్పణ చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి పాలనలలో గరిష్ట స్థాయికి చేరింది.ఒకవైపు ప్రభుత్వాలు ఇలా చట్టబద్ధంగానూ, చట్టవ్యతిరేకంగానూ హైదరాబాద్ భూమిని ఆశ్రితులకు అప్పనంగా అప్పగిస్తుండగా, కోస్తా, రాయలసీమ భూస్వాములు, వ్యాపారులు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు అక్రమ కబ్జాలు కూడ ప్రారంభించారు. 1948కి ముందరి భూస్వాములలో కొందరు పాకిస్తాన్‌కు వెళ్లిపోవడం, చాలచోట్ల భూముల దస్తావేజులు సక్రమంగా లేకపోవడం, భూయాజమాన్యం వివాదాస్పదం కావడం, ఉమ్మడి భూములను, లావారిస్ భూములను బలప్రయోగంతో, అధికారం అండతో ఆక్రమించుకోవడం వంటి అనేక కారణాలు కలిసి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో అపారమైన భూమి అక్రమంగా అన్యాక్రాంతమైపోయింది. ఇవాళ మూడు లక్షల ఎకరాలలో విస్తరించిన హైదరాబాదులో కనీసం ముప్పైవేల ఎకరాలు, పద్దెనిమిది లక్షల ఎకరాల రంగారెడ్డి జిల్లాలో కనీసం లక్ష ఎకరాలు ఇలా అక్రమ కబ్జాలో ఉండవచ్చు. ఈ అక్రమ కబ్జాదారులలో తెలంగాణవారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కొందరు ఉండవచ్చు గాని తొంబై శాతం కోస్తా, రాయలసీమ సంపన్నులు, రాజకీయ నాయకులు, కంట్రాక్టర్లు, వ్యాపారులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడవద్దని, ఏర్పడినా హైదరాబాద్ మీద తమ పట్టు పోకుండా ఉండాలని కోరుకున్నది వారే. ఇక తెలంగాణ ఏర్పడక తప్పదని తేలినప్పుడు బిల్లు తయారీలో కుట్రలకూ కుహకాలకూ పూనుకుని హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేయించి, గవర్నర్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టేలా చేసిందీ వారే. ఇది కోస్తా, రాయలసీమ సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కూడ కాదు. కేవలం కొన్ని వందల మంది, లేదా వేల మంది కోస్తా, రాయలసీమ అక్రమ కబ్జాదారుల, భూబకాసురుల వ్యవహారం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆ భూబకాసురులందరి పని పట్టలేకపోవచ్చు. అన్యాక్రాంతమైన భూమినంతా వెనక్కి తీసుకోలేకపోవచ్చు. కాని ప్రతీకాత్మకంగానైనా అక్రమ కబ్జాలలో రెండు మూడు సంఘటనలు తీసుకుని భూమి వెనక్కి తీసుకునే ప్రయోగ ప్రయత్నం ప్రారంభించింది. అలా భూమిని ముట్టుకోగానే ప్రళయం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ మీద స్పందించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఘమేఘాలమీద సర్క్యులర్ జారీ చేసింది. నిజానికి సెక్షన్ 8 ఇచ్చే అధికారాలను కూడ అతిక్రమిస్తూ విడుదలయిన సర్క్యులర్ అది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మీద గవర్నర్ అధికారాలను వివరిస్తున్నామనే పేరుతో, గవర్నర్ కు అదనపు అధికారాలను కట్టబెట్టడం, ఉమ్మడి రాజధానిగా గవర్నర్ అధికార పరిధిని రంగారెడ్డి జిల్లా ప్రాంతాలకు కూడ విస్తరించాలనడం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట నిబంధనలను కూడ అతిక్రమించడమే. అంటే ఈ సర్క్యులర్ చట్టవ్యతిరేకం. అక్రమంగా ఆక్రమించిన భూములను వెనక్కి తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే, ఆ అక్రమ ఆస్తుల పరిరక్షణ గవర్నర్ బాధ్యత అనడం, అందుకోసం ప్రభుత్వమూ, ప్రతి మంత్రీ, ప్రతి పోలీస్ స్టేషనూ తమ రోజువారీ పనిని గవర్నర్‌కు నివేదించాలనడం హాస్యాస్పదం, అర్థరహితం, అప్రజాస్వామికం, భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కేంద్రప్రభుత్వపు ఈ దుర్మార్గమైన చర్యను అన్ని రూపాలలో ప్రతిఘటించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ సమాజం ముందు ఉన్న తక్షణ, ప్రధాన కర్తవ్యం.
ఎన్ వేణుగోపాల్

2014-15 బడ్జెట్


గెస్ట్ కాలమ్:
గత 67 ఏళ్లుగా ప్రవేశపెడుతున్నట్లే 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాదాపు 18 లక్షల కోట్ల (17.94 లక్షల కోట్లు) రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జూలై 10న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తంమీద 3.78 లక్షల కోట్ల నికర లోటుతో బడ్జెట్ తయారైంది. వివిధ మార్గాల ద్వారా కేంద్రానికి ఏటా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 18 లక్షల కోట్లు ఖర్చవుతుంది. పన్ను రూపంలో 13.64 లక్షల కోట్ల రూపాయలు రాగా, ఇతర వనరుల ద్వారా 2.12 లక్షల కోట్లు కేంద్రానికి వసూలు అవుతుంది. జీడీపీ ద్రవ్య లోటు 4.1 శాతంగా ఉంది.గత 67 ఏళ్లుగా తంతు కొనసాగుతూనే వుంది. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో వడ్డిస్తూనే వున్నారు. దేశంలో 60 శాతం మంది దారిద్ర్య రేఖకు అటూ ఇటుగా జీవిస్తున్నారు. 56 శాతం మంది ఈ రోజు ఉదయం కూడా కట్టెలు, పిడకల పొయ్యిలమీదనే వంట చేస్తున్నారు. దాదాపు 50 శాతం మంది చెంబు పట్టుకుని కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబైటకే వెళుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఊరడింపు ఏమిటంటే అదనపు పన్నులు లేకుండా మధ్య తరగతి వారికి ఆదాయపు పన్ను పరిమితిని 2 లక్షల నుండి రెండున్నర లక్షలు పెంచటం జరిగింది. ఇంటి రుణాల వడ్డీకి ఆదాయం పన్ను మినహాయింపునిచ్చారు.రక్షణ, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. పెట్టుబడులకై విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి బీజేపీ ప్రభుత్వం చేసిన స్పష్టమైన ప్రయత్నం ఈ బడ్జెట్‌లో కనిపిస్తున్నది. ఆర్థిక సంస్కరణల అనంతరం వివిధ రంగాల్లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ప్రపంచబ్యాంకు సూచనల మేరకు గత ప్రభుత్వాలు, సంస్కరణలు, అప్పులు చేస్తూనే వచ్చాయి. అయినా దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెద్దగా పెరగలేదు. ఎన్ని చట్టాలున్నా, దేశంలో సంపన్నుల దగ్గర మరింత సంపద పోగుపడింది. వివిధ రాష్ట్రాల్లో ఐఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థల ఏర్పాటు నిధులు కేటాయించారు. దాదాపు 28 రకాల పథకాలకు ఒక్కోదానికి వంద కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు. ఇంత పెద్ద దేశానికి వంద కోట్లు పెద్ద మొత్తం కానేకాదు. దేశ జనాభాకు తలా ఒకరికి రూపాయి చొప్పున పంచితే ఒక్కొక్కరికి రూపాయి కూడా రాదు.దేశంలో వంద 'స్మార్ట్ నగరాలు' ఏర్పాటు చేయడానికి దాదాపు ఏడువేల కోట్లు, గంగానది శుద్ధికి 'నమామి గంగ' పేరుతో 2037 కోట్లు కేటాయించారు. గతంలో గంగ శుద్ధికి కేటాయించిన 20 కోట్ల రూపాయలు గంగలో కలిసిపోయాయి. వాటి ఊసు ఎత్తకుండానే ఇప్పుడు ఈ డబ్బులు కేటాయించారు. నదుల అనుసంధానం కోసం అధ్యయనం చేయడానికి వంద కోట్లు కేటాయించారు. ఈ అధ్యయనానికి గతంలో కూడా కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ధరల స్థిరీకరణకు 500 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఇది మంచిదే కానీ, ఆ డబ్బు ఏ మూలకూ సరిపోదు.స్వాతంత్ర్యానంతర తొలి ఏడు భారతదేశ బడ్జెట్ 993 కోట్ల రూపాయలు ఉండేది. ఇది నిండా వెయ్యి కోట్లు కూడా కాదు. గత ఏడాది యూపీఏ ప్రభుత్వం 17.63 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 67 ఏళ్లలో బడ్జెట్ మొత్తంలో పెరుగుదల విపరీతంగా ఉన్నా జనజీవన ప్రమాణాలు మాత్రం పెద్దగా పెరగలేదు. ఐక్యరాజ్య సమితి జీవన ప్రమాణాల సూచి ప్రకారం 186 దేశాల్లో భారతదేశం 136 స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పేదవారిలో మూడోవంతు మంది పేదలు ఈ పుణ్యభూమిలోనే ఉన్నారు. దేశంలో 60 శాతంమంది పిల్లలకు పోషకాహారం అందడం లేదు. రైతులు, చేతివృత్తుల వారు ప్రతీరోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంది.చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం దేశంలో 10 వేల కోట్లతో నిధిని ఏర్పరుస్తున్నారు. ప్రధానమంత్రి  గ్రామ సడక్ యోజన కోసం 14,389 కోట్లు దళిత అభివృద్ధికి 50 వేల కోట్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు 38 వేల కోట్లు కేటాయించారు. దేశంలో అభివృద్ధి పేరిట ఖర్చు అవుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలే సద్వినియోగం అవుతున్నట్లు గతంలో ప్రధానమంత్రే స్వయంగా చెప్పారు. ఒక అనధికార అంచనా ప్రకారం దేశంలో ప్రతి పౌరుడు నెలకు 1400 రూపాయలను ప్రభుత్వానికి ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా చెల్లిస్తున్నాడు. ఇందులో నాలుగు వందల రూపాయలను మాత్రమే ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుంది. ఈ నాలుగు వందల్లో 15 శాతం అంటే 60 రూపాయలు మాత్రమే సరిగ్గా ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రగతి అంతా ఆ 15 రూపాయల పుణ్యమే.ఈ బడ్జెట్‌లో ద్రవ్యలోటును పూడ్చడానికి పాత అప్పులు తీర్చడానికి కొత్తగా ఆరు లక్షల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. గత ఏడాది 5.63 లక్షల కోట్ల రుణాలను తెచ్చారు. దేశ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 24 పైసలు అప్పు రూపంలోనే వస్తుంది. ఇందులో 20 పైసలు పాత అప్పుల వడ్డీకి చెల్లిస్తున్నారు. గత ఏడాది వడ్డీ చెల్లింపుల కోసం 18 పైసలు కేటాయించారు. అది ఇప్పుడు 20 పైసలకు పెరిగింది. దీంతో కేంద్ర ప్రణాళిక కేటాయింపు ఈ ఏడాది 21 నుంచి 11 పైసలకు తగ్గింది.

న్యాయమూ లేదు, మానవత్వమూ లేదు..


మురళీరవం 17:
అంతరాల వ్యవస్థలో పాలకులు కావాలంటే న్యాయబుద్ధీ, మానవత్వమూ వదులుకోవలసి ఉంటుంది. ఏ విధానమైనా, ఆచరణ అయినా వ్యవస్థలో కొన్ని వర్గాలకే లాభదాయకంగా, మరికొన్ని వర్గాలకు నష్టదాయకంగా ఉంటాయి గనుక ఏ విధానాన్నీ న్యాయబద్ధంగా వివరించడం సాధ్యం కాదు. కొన్ని వర్గాలకు జరిగే నష్టాన్ని విస్మరించడానికి మానవతాదృష్టినీ వదులుకోక తప్పదు. అందువల్లనే ‘తటస్థంగా కనిపించే సూత్రబద్ధ, హేతుబద్ధ, చట్టబద్ధపాలన’, ‘ఎక్కువమందికి ఎక్కువ మంచిచేసే కార్యక్రమాలు’ అనే సూత్రాలు ఆధునిక పాలనలోకి వచ్చి చేరాయి. మహాఘనత వహించిన భారత పాలకులకు మాత్రం ఆ హేతుబద్ధత చట్టబద్ధత అన్నా, బహుజన హితాయ అన్నా కంటగింపు. వారికి కావలసింది తమ ఆశ్రితుల ప్రయోజనాలు. అవి ఎంత మోసపూరితంగా సాధించినా ఫరవాలేదు. పిడికెడు మంది తమవారికోసం కోట్లాది బహుజనులను మోసగించినా, చంపివేసినా ఫరవాలేదు.ఈ న్యాయబద్ధత లేని, మానవత్వం లేని భారత పాలకవర్గ విధానాలకు నిదర్శనం కావాలంటే పోలవరం ప్రాజెక్టుకు మించిన ఉదాహరణ మరొకటి ఉండబోదు. సమాజం చేత ఆ విషగుళికను మింగించడానికి సాంకేతిక వ్యవస్థలతో, న్యాయవ్యవస్థలతో, చట్టసభలతో ఆడించిన నాటకాలు మన కళ్లముందర సాగుతున్నాయి. పోలవరం ఉదంతం పాలకుల దుర్మార్గానికి మాత్రమే కాదు, మౌనం ద్వారా ఆ దుర్మార్గాన్ని సాగనిచ్చే మనందరి సామాజిక నిర్లిప్తతా దౌష్ట్యానికి కూడ చిహ్నంగా నిలుస్తున్నది.పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు, విద్యుదుత్పత్తి వంటి ప్రయోజనాలున్నాయని పాలకవర్గాలు చెపుతున్నదానిలో సగానికన్న ఎక్కువ అబద్ధాలు, అర్ధసత్యాలు. ప్రస్తుతం పోలవరం ఆనకట్ట ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెపుతున్నారు. కాని పోలవరం నిర్మాణ ఆలోచనలు అటకెక్కిన 1980-2005 కాలంలోనే ఈ భూమిలో చాల భాగానికి సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇవాళ కొత్తగా పోలవరం ద్వారా సాగునీరు అందే భూమి అతి స్వల్పం. లేదా, ఇప్పటికి ఒక పంటకు అవకాశం ఉన్నచోట రెండు పంటలకు, లేదా రెండు పంటలకు అవకాశం ఉన్నచోట మూడు పంటలకు నీరు అందవచ్చు. కాని దానివల్ల అదనంగా మురుగునీటి సమస్యలు, భూమిలో ఉప్పు పెరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పోలవరం నుంచి వచ్చే నీటిలో 80 టిఎంసి నీటిని విజయవాడ దగ్గర కృష్ణా బ్యారేజికి చేర్చి, తద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని చెప్పడం మరొక అబద్ధం. నిజానికి ఈ ప్రకటనలో ఇమిడి ఉన్న మోసం ఎంత దుర్మార్గమైనదో చెప్పడానికే వీలులేదు. ఈ కారణం చెప్పి పోలవరం దగ్గర 80 టిఎంసి తీసుకున్నప్పటికీ గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో కలుపుతున్నందువల్ల, కృష్ణానది మీద ఎగువ రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వవలసి వస్తుంది. అలా తెచ్చిన 80 టిఎంసిల నీటిలో ప్రకాశం బ్యారేజి దగ్గరికి చేరేసరికి ఆంధ్రప్రదేశ్‌కు మిగిలేవి 45 టిఎంసిలు మాత్రమే. అవి కూడ రాయలసీమ పేరు చెప్పి తెస్తున్నారు. కాని అవి రాయలసీమకు చాల దిగువన కృష్ణానదిలో కలుస్తున్నాయి గనుక కిందికే వెళ్తాయి గాని పైకి ఎక్కవు. అంటే కృష్ణా డెల్టా పైన ఉన్న ప్రాజెక్టులలో ఆ మేరకు తన వాటా వదులుకుని రాయలసీమకు ఇవ్వాలి. కాని కృష్ణా డెల్టా శక్తులు అటువంటి ఔదార్యాన్ని ప్రదర్శించబోవని గత ఆరు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తున్నది. అంటే ప్రకాశం బ్యారేజి కింది భూములకు అదనంగా 45 టిఎంసిల నీరు, అంటే మరొక పంట, లేదా అక్కడ పారిశ్రామిక అవసరాలకు నీరు అందడం తప్ప జరగబోయేదేమీ లేదన్నమాట. రాయలసీమ దుర్భిక్షాన్ని సాకుగా చూపి కృష్ణా డెల్టాకు మరింత నీరు కట్టబెట్టబోతున్నారన్నమాట.
ఇక విశాఖపట్నంతో సహా నాలుగు వందల గ్రామాల తాగునీటి అవసరాల కోసం 23 టిఎంసిల నీరు పోలవరం నుంచి ఇస్తామని అంటున్నారు గాని అది అర్ధసత్యమే. విశాఖపట్నానికైనా, ఆయా గ్రామాలకైనా తాగునీరు కల్పించడానికి ప్రత్యామ్నాయ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకొరకు పోలవరం కట్టనక్కర లేదు. అలాగే పోలవరం ద్వారా సాధిస్తామంటున్న విద్యుదుత్పత్తికి కూడ ఇతర అవకాశాలున్నాయి. విద్యుత్తు కొరకైనా పోలవరం కట్టనక్కరలేదు. ఈ ప్రకటిత కారణాలన్నీ అరకొరగా అమలయ్యేవే గాని, పారిశ్రామిక అవసరాలకోసం నీరు అనే ప్రకటిత కారణం మాత్రం నూటికి నూరు శాతం అమలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు విశాఖపట్నం – కాకినాడ పెట్రోకెమికల్ పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన ఉండేది. ఇప్పుడది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోనే విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్‌గా మారింది. అక్కడ వచ్చే బహుళజాతి సంస్థలకు, మరీ ముఖ్యంగా తూర్పు కనుమల్లోని  బాక్సైట్ ఖనిజాన్ని అక్రమంగా, 170 చట్టాన్ని కూడ ఉల్లంఘించి, తవ్వి ఏర్పాటు చేయదలచుకున్న అల్యూమినియం శుద్ధి కర్మాగారాల వంటి పరిశ్రమలకు విపరీతంగా నీరు కావాలి. పోలవరం నిర్మిస్తున్నది ఆ బహుళ జాతి సంస్థల అవసరాలు తీర్చడానికే గాని ప్రజల కోసం కాదు. ఎక్కడైనా ప్రజల ప్రయోజనాలు ఏమాత్రమైనా నెరవేరితే అవి ఉప ఉత్పత్తులుగానే తప్ప అసలు లక్ష్యం అది కాదు. 
ఇటు చంద్రబాబు నాయుడుదైనా, అటు వెంకయ్య నాయుడుదైనా, నరేంద్ర మోడీదైనా ఆ బహుళజాతి సంస్థల ప్రయోజనాలు తీర్చే అభివృద్ధి నమూనానే గనుక పోలవరం ఇంత వేగంగా ముందుకు కదులుతున్నది. మొత్తంగా చెప్పాలంటే పోలవరం ప్రకటిత ప్రయోజనాలలో ప్రజా ప్రయోజనాలు అరకొరగా ఉన్నాయి. బహుళజాతి సంస్థల ప్రయోజనాలు పూర్తిగా ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలు లేకపోవడం మాత్రమే కాదు, అప్రకటితంగా అనేక ప్రజావ్యతిరేక దుర్మార్గాలు ఇమిడి ఉన్నాయి. 
ఆ ప్రాజెక్టు ఒరిస్సా, చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విస్తారమైన భూములను, ఖనిజ వనరులను, అడవులను, ఆ అడవులలో నివసిస్తున్న నాలుగు లక్షల ఆదివాసులను ముంచివేస్తుంది. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన పాపికొండలను కనబడకుండా చేస్తుంది. శబరి నది మొత్తంగానే పోలవరం జలాశయంలో అదృశ్యమైపోతుంది.
గోదావరి నదికి చరిత్రలో వచ్చిన వరదల ఉధృతిని బట్టి చూస్తే పాపికొండల చివరన పోలవరం నిర్మాణం తెగిపోవడానికి, తద్వారా కోస్తాంధ్ర లో జలప్రళయం జరగడానికి అవకాశం ఉంది. అక్కడ నది లోతు వల్ల జలాశయంలో అతి ఎక్కువ నీరు నిలువ ఉండడంతో ఆ ఒత్తిడికి భూకంపాల సంభావ్యత పెరుగుతుంది. ఇక ఈ పథక రచనలో మొదటి నుంచీ అమలయిన ఆర్థిక అక్రమాలు, నిర్మాణ వ్యయాన్ని ఎక్కువ చేసి చూపడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కంట్రాక్టర్లకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ముట్టజెప్పడం, కాలువల్లో ఎంత నీరు ప్రవహిస్తుందని ప్రతిపాదన పత్రాల్లో రాసి ఉన్నారో, ఆ సామర్థ్యం కన్న రెట్టింపు సామర్థ్యంతో కాలువలు తవ్వడం వంటి అనేక అక్రమాలు జరిగాయి. చట్టప్రకారం రావలసిన పర్యావరణ, అటవీ, కేంద్ర జల సంఘ, గ్రామసభ వంటి అనుమతులేవీ రాకుండానే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.    
అందువల్లనే పోలవరం ప్రాజెక్టును అసలు కట్టవద్దనీ, భారీ ఆనకట్ట బదులు భిన్నమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయనీ వాదిస్తున్న వర్గం ఉంది. పోలవరం అక్కడే కట్టదలచుకున్నా ఆనకట్ట ఎత్తు తగ్గించి, డిజైన్ మార్చి కట్టినా నష్టాలు తగ్గించి, అవే ప్రయోజనాలు సాధించవచ్చునని వాదిస్తున్న వర్గమూ ఉంది. ఈ రెండు వర్గాల వాదనలలో ఏ ఒక్కదాన్నీ పరిశీలించడానికి, చర్చించడానికి కూడ పాలకవర్గాలు సిద్ధంగా లేవు. 
రాజ్యసభ చర్చలో ఎంతో మంది సభ్యులు చెప్పినట్టు ఈ ప్రాజెక్టు రాజకీయ నాయకుల – కాంట్రాక్టర్ల కూటమి ప్రయోజనాల కోసం వస్తున్నది. ఆ కూటమి తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఎంత విధ్వంసం జరిగినా సరే అనుకుంటున్నది. మరొక కోణం ఉంటుందని అంగీకరించడానికి కూడ సిద్ధంగా లేదు. దాని లాభాపేక్షలో, బకాసుర ఆకలిలో అది అనేక ఆర్థిక, సాంకేతిక, చట్టపరమైన, సామాజిక వాస్తవాలనూ, లక్షలాది ఆదివాసులనూ తొక్కివేస్తున్నది, ముంచివేస్తున్నది. తన దుర్మార్గానికి మద్దతు సమకూర్చుకోవడం కోసం కోస్తాంధ్ర లోని కొన్ని జిల్లాల రైతాంగానికీ, మధ్యతరగతికీ అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నది.
పోలవరం ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకించడానికి సాంకేతిక కారణాలు, మానవీయ కారణాలు మాత్రమే కాదు, అసంఖ్యాకమైన చట్టపరమైన వివాదాలున్నాయి. ఇప్పటికీ సుప్రీంకోర్టు ముందర అపరిష్కృతంగా ఉండిపోయిన వ్యాజ్యాలున్నాయి. అసలు ఈ ప్రాంతం షెడ్యూల్డ్ ప్రాంతం గనుక రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ కింద అక్కడి ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు, అధికారాలు ఉన్నాయి. వాటన్నిటినీ తొక్కివేసి పోలవరం ముందుకు వెళ్లదలచింది. 
రాజ్యాంగం మాత్రమే కాదు, పంచాయతీరాజ్ విస్తరణ చట్టం, భూసేకరణ చట్టం వంటివి కూడ ఆదివాసులకు ప్రత్యేక హక్కులను వాగ్దానం చేశాయి. అవన్నీ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇంత విస్తృతమైన చర్చను కేవలం అభివృద్ధి మాయాజాలపు చర్చగా మార్చడానికి పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయి. పోలవరం ఆనకట్ట కింద ఏర్పడబోయే ఆయకట్టు రైతుల అభివృద్ధి, విద్యుత్తు, పరిశ్రమల అభివృద్ధి అనేవి ఎంత అబద్ధాలో ఇప్పటికే డజన్ల కొద్దీ అధ్యయనాలు వెలువడి ఉన్నాయి. వాటిని కనీసంగా పట్టించుకోని పాలకులు ఇప్పుడు ముంపుకు గురికానున్న ఆదివాసులను అభివృద్ధి చేస్తామనీ, పునరావాసం కల్పిస్తామనీ అంటున్నారు. ప్రశ్నించినవారే ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు.
ఇక్కడ అడగవలసిన ప్రశ్న ఎవరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి అని. దేశంలో గత ఆరు దశాబ్దాలలో “అభివృద్ధి” పథకాల వల్ల ఆరు కోట్ల మంది నిర్వాసితులయ్యారని అందులో కనీసం రెండు కోట్ల మంది ఆదివాసులని ఒక అంచనా. దేశ జనాభాలో 8 శాతం ఉన్న ఆదివాసులు, నిర్వాసితులలో మాత్రం 30 శాతం పైన ఉన్నారంటే ఎవరి అభివృద్ధికి వాళ్లు సమిధలయిపోయారో అర్థమవుతుంది. ఆదివాసులు ఎప్పటికీ వారి చింకిపాతలతో, రోడ్లు లేని, విద్యుత్తులేని, కారడవుల్లో ఉండాలా వారికి అభివృద్ధి అక్కరలేదా అని బుద్ధిమంతులు మరొక ప్రశ్నవేస్తున్నారు.
అభివృద్ధి అంటే ఏమిటనే మౌలిక ప్రశ్న కూడ వేయనక్కరలేదు. ఆదివాసులను అభివృద్ధి చేయాలంటే వారి స్వస్థలాల నుంచి నిర్వాసితులను చేస్తే తప్ప కుదరదా ఇంతకూ దేశంలో ఇప్పటివరకూ ఏ ఒక్క అభివృద్ధి పథకం లోనూ నిర్వాసితులకు గౌరవప్రదమైన, సంపూర్ణమైన పునరావాసం దొరకలేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం నిర్వాసితులలో ఇప్పటికీ పునరావాసం దొరకని వారున్నారు. భూమికి సమానమైన భూమి ఇవ్వాలనే కొత్త పునరావాస చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు ఇవ్వగలిగిన భూమీ లేదు. ఇవ్వాలనుకున్నా, నిర్వాసితులవుతున్న ఆదివాసులకు పట్టాలు లేవు గనుక ఎగ్గొట్టి, వారిని బిచ్చగాళ్లుగా మార్చడానికి ప్రభుత్వానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. కనుక ఇది అభివృద్ధికి దారితీసే పథకం కాదు, అణచివేతకు, అన్యాయానికి దారితీసే పథకం.
తమ ఎన్నికల వ్యయానికి మదుపు పెట్టిన కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాపాడడమే రాజకీయపార్టీల విధ్యుక్తక్తధర్మం అయిన వేళ ఈ వివాదంలోకి రాజకీయాలు ప్రవేశించాయి. రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఈ పాపంలో అన్ని రాజకీయపక్షాలకూ భాగం ఉంది. సోమవారం నాడు రాజ్యసభ చర్చలో “చాల కాలంగా మోసం చేస్తున్నాం. ఇకనైనా ఆపుదాం” అని కె. కేశవరావు ఎందుకు అన్నప్పటికీ, అది అక్షరసత్యం.
ముంపుకు గురయ్యే ఆదివాసి గ్రామాలు తెలంగాణలో ఉండడం, ఆ గ్రామాల గ్రామ సభలన్నీ తెలంగాణలోనే ఉంటామని తీర్మానాలు చేయడంతో ఇది తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సమస్యగా కూడ మారింది. డిజైన్ మార్చాలని వాదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, తదితర సంస్థలు, అసలు పోలవరం నిర్మాణమే వద్దని వాదిస్తున్న ఇతర ప్రజాసంస్థలు జరిపిన ఆందోళనలతో రాష్ట్ర విభజనకు ముందు ఇది ప్రధాన సమస్య అయింది. 
చట్టం తయారయ్యే క్రమంలో పోలవరం అనుకూల వర్గాలు ఆ క్రమాన్ని ప్రభావితం చేసి పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప జేశాయి. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచితే వివాదం పెరుగుతుందేమోనని, ఆటంకాలు ఎదురవుతాయేమోనని ఆ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడానికి చట్టవ్యతిరేక, చట్టాతీత చర్యలనెన్నో తీసుకునేలా చేశాయి.
అవి ముంపు గ్రామాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మారుస్తున్నాం అని వాదించదలచుకుంటే, ఒరిస్సా, చత్తీస్‌గడ్‌లలో కూడ ముంపు గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రాల సరిహద్దులు మార్చడం అధికరణం 3 ప్రకారం రాష్ట్రపతి అనుమతితో జరగవలసిన పని అయినప్పటికీ ఆ రాజ్యాంగ నియమాలేవీ పాటించలేదు. 
అంతకన్న ఘోరంగా, హాస్యాస్పదంగా ఈ ముంపు గ్రామాల బదిలీకి ముందు ఆ గ్రామాల ప్రజాప్రతినిధిగా ఎన్నికైన శాసనసభ్యులు తెలంగాణ శాసనసభలో ఉండగా, వారు ప్రాతినిధ్యం వహించవలసిన గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. ఇంత గందరగోళ, అపసవ్య, అక్రమ, అమానవీయ పాలన ఎవరికోసం, ఎందుకోసం జరుగుతున్నట్టు?ఎన్ వేణుగోపాల్

5, జులై 2014, శనివారం

విశ్వనగరానికి సూపర్ హైవే



Updated : 7/5/2014 3:15:07 AM
Views : 5897
మూడు దశాబ్దాలకు నగర ప్రణాళిక.. దీర్ఘకాలిక దృష్టితో సిద్ధంచేస్తున్న కేసీఆర్ సర్కార్
ఢిల్లీని మించిన జనాభా.. దేశ విదేశాలనుంచి తరలివచ్చినవారితో, సకల వ్యాపారాలతో విశ్వనగరంగా ఖ్యాతి. ఇది హైదరాబాద్ గతం! అడ్డదిడ్డమైన అభివృద్ధి మధ్య.. చినుకుపడితే చెరువులను తలపించే కూడళ్లు.. ముక్కు మూసుకుంటే తప్ప దాటివెళ్లలేని చెత్తకుప్పలు.. ఇరుకు గల్లీలు.. మురికివాడలు. కబ్జాల కథలు! ఇది వర్తమానం!! అదనంగా వచ్చి చేరే కోటిన్నర జనాభా.. అందుకు తగిన రవాణా వ్యవస్థ.. మరో రెండు విమానాశ్రయాలు.. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ చుట్టూ మరిన్ని హైదరాబాద్‌లు. పచ్చటి.. పరిశుభ్రమైన ఓ అంతర్జాతీయ స్థాయి నగరం. ఇది రాష్ట్ర రాజధాని భవిష్యత్ చిత్రం!!

kcrచెత్తబుట్టలా ఉన్న నగరం రూపురేఖలు మార్చేసి.. రానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు వెలుగులో నగరాన్ని న్యూయార్క్, షాంఘై, సిడ్నీ వంటివాటి సరసన విశ్వనగరంగా నిలిపేందుకు తెలంగాణ తొలి సర్కార్ తహతహలాడుతున్నది! రానున్న మూడు దశాబ్దాల కాలంలో నగర జనాభా మరో కోటిన్నర పెరుగనుందన్న అంచనాల నేపథ్యంలో ఆ స్థాయిలో అవసరాలకు ఇప్పటినుంచే పునాదులేస్తున్నది! నగరంపై పచ్చటి దుప్పటేసి.. పరిశుభ్రమైన.. భద్రమైన భాగ్యనగరాన్ని తెలంగాణకే కాదు.. మొత్తం భారతదేశానికే బహుమతిగా ఇచ్చేందుకు సంకల్పిస్తున్నది! అక్రమార్కులపై కొరడా ఝళిపించినా.. కబ్జా చేసి కట్టుకున్న కోటలను కూల్చేసినా.. అది బంగారు తెలంగాణ నిర్మాణానికే! ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేందుకే!

hyd-planహైదరాబాద్, జూలై 4 (టీ మీడియా):చినుకు పడితే నగరం నరకం. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు నీళ్ల మడుగు ఏర్పడుతుంది. గవర్నర్ నివాసం వద్ద కార్లు పడవల్లా తేలుతాయి. అసెంబ్లీ ముందు వాహనాల రాకపోకలు స్తంభించిపోతాయి. ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద వరద ఒక చెరువును తలపిస్తుంది. నీరు నిలిచే ఇటువంటి జంక్షన్లు నగరంలో 216దాకా ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి కారణంగా నగరమంతటా ట్రాఫిక్ స్తంభించి పోతుంది. సుమారు 230 కాలనీలు, బస్తీలు జలమయం అవుతాయి.

నగరం వరదనంతా తీసుకోగల స్వతస్సిద్ధమైన మూసీనది నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్నా బస్తీలు, కాలనీలు మునిగిపోవడం ఆగడం లేదు. నాలాలు, నదులు అన్నీ ఆక్రమించి నీటి ప్రవాహానికి అడ్డం పడితే ఏం జరుగుతుంది? ఇవి కాకుండా మురుగునీరు, మంచినీరు కలసిపోతున్నాయని ఫిర్యాదులు. బస్తీలు మొదలుకుని బంజారా హిల్స్‌వరకు డ్రైనేజీలు పొంగి రోడ్లమీద ప్రవహిస్తుంటాయి. అంతేకాదు నగరంలో 1476 నోటిఫైడ్ మురికివాడలు, 239 గుర్తించని మురికివాడలు ఉన్నాయి. ఇలా ఈ నగరాన్ని చెత్త బుట్టగా మార్చిందెవరు? ఇదేనా అభివృద్ధి? ఇదేనా ఆధునికత? ఇలాగే ముందుకుపోదామా?
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరం కావాలి.

పూర్తి నియంత్రిత, జీవనయోగ్యమైన, ఎక్కడికయినా తేలికగా ప్రయాణించడానికి వీలైన, భద్రత కలిగిన, పరిశుభ్రమైన, పచ్చని నగరం (గ్యులేటెడ్, సేఫ్, సెక్యూర్, లివబుల్, ఈజీ మొబిలిటీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ) కావాలి. ఇప్పుడున్న పరిస్థితులను ఏమీ మార్చకుండా ఈ నగరాన్ని బాగుచేయడం సాధ్యమేనా? అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్‌లు, ఆక్రమణలను పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు కేవలం ప్రణాళికలను రచిస్తూ పోతే అంతర్జాతీయ నగరం అవుతుందా? తెలంగాణకు ఎప్పుడయినా ఆర్థిక వెన్నెముక హైదరాబాద్ నగరమే.

హైదరాబాద్ అభివృద్ధే తెలంగాణ అంతటికీ వెలుగులను ప్రసరించాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాల్లో చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించింది హైదరాబాద్ మహానగర సంస్థ (జీహెచ్‌ఎంసీ) అధికారులతోనే. గురుకుల ట్రస్టు భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడాన్ని, గోకుల్ ప్లాట్స్ ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడాన్ని కొందరు రాజకీయ నాయకులు, వారికి తాళం వేసే మీడియా వక్రబుద్ధులు అదేదో కక్ష తీర్చుకోవడంకోసం చేస్తున్నట్టుగా వర్ణిస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలు లేవు. ప్రాంతాల ముచ్చట లేదు.

అక్రమార్కులు ఎవరయినా చట్టం ముందు నిలబడాల్సిందే అని ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి చెప్పారు. ఎవరి జోక్యానికీ వీలు ఇవ్వకుండా ఉండడంకోసమే ముఖ్యమంత్రి పట్టణాభివృద్ధి శాఖను తన వద్ద ఉంచుకున్నారని ఒక అధికారి చెప్పారు.

హైదరాబాద్‌లో జరిగిన సకల అక్రమాలకు, ఇక్కడ వేళ్లూనుకున్న సకల అవలక్షణాలకు అండదండలు అందించింది సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియానే. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో మండల రెవెన్యూ కార్యాలయాలు పదే పదే అగ్ని ప్రమాదాలకు గురవుతాయి. రెవెన్యూ రికార్డులు తారుమారవుతాయి. చచ్చినోళ్ల పేరిట జీపీఏలు, పట్టా సర్టిఫికెట్లు పుడతాయి. యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతాయి.

ప్రతి ఐదేళ్లకోసారి ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, భవనాల క్రమబద్ధీకరణ, లే అవుట్‌ల క్రమబద్ధీకరణ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికీ నగరంలో 60 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వందలాది అక్రమ లేఅవుట్‌లు ఉన్నాయి. వాటికి విద్యుత్ గ్యారెంటీ లేదు. తాగునీరు గ్యారెంటీ లేదు. రోడ్లు సరిగ్గా ఉండవు. డ్రైనేజీ ప్రవహించే ఏర్పాట్లు ఉండవు. ఏం ఖర్మ? ఈ పరిస్థితి ఎంతకాలం? ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకుండా అద్భుతాలు చేయడం సాధ్యమేనా? ఇప్పుడు ఇవేవీ పట్టించుకోవద్దు.. కళ్లు మూసుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు ఆశిస్తున్నాయి అని ముఖ్యమంత్రి వివరించినట్టు ఒక నగరాభివద్ధి ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారి ఒకరు చెప్పారు. ఈ పరిస్థితిని మార్చాలన్నదే ముఖ్యమంత్రి తాపత్రయమని ఆ అధికారి తెలిపారు. గత నాలుగైదేళ్లుగా ఒక్క ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ అభివృద్ధి గురించి సమీక్షించిన పాపాన పోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాన్నే ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించడం సంతోషంగా ఉంది అని ఒక అధికారి అన్నారు.

1931కి ముందు నుంచే హైదరాబాద్ కాస్మొపాలిటన్ నగరంగా అభివృవద్ధి చెందింది. ఈ నగరానికి రాజులు పునాదులు వేయడం, సుమారు ఏడెనిమిది వందల సంవత్సరాలు దక్క రాజ్యానికి రాజధానిగా ఉండడం, దేశ, విదేశాల నుంచి అన్ని జాతులు, అన్ని మతాల ప్రజలు ఇక్కడ స్థిరపడడం ఈ నగరానికి విశ్వనగరంగా ఖ్యాతిని తెచ్చింది. ఇక్కడ అరబ్బులు, అఫ్ఘనీలు, పారసీలు మొదలు గుజరాతీలు, మార్వాడీలు, కాయస్థులు అందరూ కాలనీలు, స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారు. సుహద్భావ వాతావరణంలో కలసిమెలసి హైదరాబాద్‌లో మిళితమైపోయారు.

హైదరాబాద్ పరిసరాలు సమశీతోష్ణ మండలంలో ఉండడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం కూడా ఇక్కడికి ఎక్కువమంది వచ్చి వ్యాపారాలు చేస్తూ స్థిరపడిపోవడానికి కారణం. కానీ సమైక్యాంధ్ర పాలనలో జరిగిన అస్తవ్యస్థ అభివృద్ధి హైదరాబాద్ పరిస్థితులను తారుమారు చేసింది. నగరం విస్తరించడంతోపాటు సకల అవలక్షణాలు, అక్రమాలూ విస్తరించాయి. ఇప్పడు ఆ అక్రమాలను సరిదిద్ది ఒక ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణానికి విధాన రచన చేయవలసి ఉంది అని ఒక అధికారి అన్నారు. పెరగబోయే జనాభాకు తగిన విధంగా విద్య, వైద్యం, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రాపిడ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ద్వారా అన్ని మార్గాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేని రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది.

భద్ర నగరంగా

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. 1600 వాహనాలు, వందలాది బైక్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా పోలీసు ఫోర్సును తీర్చిదిద్దాలని యోచిస్తున్నాం అని ముఖ్యమంత్రి మరో సమీక్షా సమావేశంలో వెల్లడించారు.

సమతుల అభివృద్ధి

నగరానికి అన్ని వైపుల సమతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. ఐదు జాతీయ రహదారులను ఆనుకుని ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల చుట్టూ పరిశ్రమలు, అత్యాధునిక వసతుల అనుబంధ నగరాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలు, వినోద కేంద్రాలు, పరిశోధనా సంస్థలు నెలకొల్పాలి.

మరో రెండు విమానాశ్రయాలు

నవ తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం మొదలుపెడితే నగరం విస్తరించడం వేగం పుంజుకుంటుంది. న్యూయార్క్, లండన్‌తోపాటు పలు పాశ్చాత్య నగరాల మాదిరిగా మరో రెండు విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. ఉత్తర తెలంగాణవైపు షామీర్‌పేట-మేడ్చల్‌ల మధ్య, భువనగిరి-ఘట్‌కేసర్-హయత్‌నగర్‌ల మధ్య మరో రెండు విమానాశ్రయాలు అవసరం అవుతాయి. అదే విధంగా శివార్లలో అతిపెద్ద బస్ సర్క్యూట్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న మెట్రో కూడా భవిష్యత్తు అవసరాలను తీర్చలేదు. ఇంతకంటే మెరుగైన, పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాల్సి ఉంటుంది.

గ్రీన్ కవర్

నగరంలో వంద సరస్సులు మాయమయ్యాయి. మిగిలి ఉన్న సరస్సులను కాపాడాల్సి ఉంది. వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, మొక్కలు పెంచి, అక్కడి పరిసరాలను జీవనయోగ్యంగా మార్చాలి. నగరంలో ఈ ఏడాది నుంచి ఏటా మూడు కోట్ల మొక్కలు నాటాలి. వచ్చే మూడేళ్లలో మొత్తం పది కోట్ల మొక్కలు నాటి, వాటిని పెంచడానికి కృషి చేయాలి.

నగర వాతావరణంలో కాలుష్యాల శాతం తగ్గించాలంటే గ్రీన్ కవర్ పెంచడం ఒక్కటే మార్గం. అన్ని సంస్థలు, పరిశ్రమలు, నిర్మాణాల్లో మొక్కలు పెంచడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధన పెట్టాలి. బెంగళూరు తరహాలో ఇంటి నిర్మాణం చేసేవారు విధిగా కొన్ని మొక్కలు పెంచేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి అని సమీక్షా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు అధికారులు వివరించారు.

నేలపై కూరగాయలు అమ్మడం ఏమిటి?

నేలపై పెట్టి కూరగాయలమ్ముకుంటున్నాం. హైజీనిక్‌గా ఉండాల్సిన కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, మాంసం మార్కెట్లు ఇప్పటికీ ఈగల మోత, మురికి నీటితో సహజీవనం చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారకుండా హైదరాబాద్‌ను సుందరమైన నగరంగా తీర్చిదిద్దామంటే అర్థం ఉందా? కూరగాయల తాజాదనాన్ని కాపాడే కోల్డ్ చైన్ వ్యవస్థ కూడా నగరంలో అందుబాటులో లేదు. మార్కెట్‌లలో కూరగాయలు కచ్చితంగా పెట్టి అమ్మేవిధంగా వాటిని సంస్కరించాలి. ఈగలు, మురుగు, చెత్త చెదారానికి దూరంగా మార్కెట్లు ఉండాలి.

డంపింగ్ యార్డులు

ఇంత పెద్ద నగరానికి చెత్త డంపింగ్ చేయడానికి సరైన యార్డులు లేవు. ఉన్నవి కాస్తా జనావాసాలకు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు నిత్యం ఫిర్యాదులు, ఆందోళనలకు దిగవలసి వస్తున్నది. నగరం అన్ని వైపుల వెయ్యి ఎకరాల భూమిని గుర్తించి ఆధునిక డంపింగ్ యార్డులు వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వీటికి అనుబంధంగానే వైద్య, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ పరికరాల వేస్ట్ డిస్పోజల్‌కు తగిన ఏర్పాట్లు జరగాలి.

శ్మశానవాటికలు

నగరంలో చాలా కాలనీలకు, బస్తీలకు శ్మశానవాటికలు కూడా లేవు. ఎక్కడో దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి నివాస సముదాయానికి సమీపంలో విధిగా ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వంపై ఉంది. చాలా చోట్ల శ్మశానవాటికలు ఆలనా పాలనా లేకుండా కబ్జాలకు గురవుతున్నాయి.

మురికివాడలు లేని నగరం

మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మురికివాడల్లో వర్టికల్ భవంతులు నిర్మించి, ఎక్కడివాళ్లకు అక్కడే నివాసాలు కేటాయించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నది. మిగిలిన స్థలాన్ని ఆ వాడ ప్రజలకే ఉపయోగపడే విధంగా అన్ని వసతులు కల్పించవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది.

populationఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తిగా అమలయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్), దాని చుట్టూ రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ల వెంట వందలాది భారీ పరిశ్రమలు రావలసి ఉంది. ఉద్యోగాలకు రెండు మూడు రెట్లు జనాభా పెరుగుతుంది. ఇవి కాకుండా సహజంగా వచ్చే వలసలు కూడా తోడవుతాయి. అంటే రానున్న రెండు మూడు దశాబ్దాల్లో నగర జనాభా రెండున్నర కోట్లు దాటే అవకాశం ఉంటుంది.

నగరానికి వచ్చిపోయే జనాభా (ఫ్లోటింగ్ పాపులేషన్) ఇప్పుడే రోజూ 10 నుంచి 15 లక్షలు ఉంటుంది. కనీసం మూడు లక్షల వాహనాలు రోజూ నగరానికి వచ్చిపోతుంటాయి. రైళ్లు, బస్సు, ఇతర వాహనాల్లో జనం వస్తుంటారు. జనాభా పెరిగితే అది కూడా రెండు మూడు రెట్లు పెరుగుతుంది. అంటే ఇట్లాంటి హైదరాబాద్‌లు మరో రెండు నగరం చుట్టూ అవతరించాల్సి ఉంటుంది. జనాభావృద్ధి, పారిశ్రామికాభివృద్ధిని దష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. జనాభాలో, విస్తృతిలో 1931కి ముందు వరకు హైదరాబాద్ ఢిల్లీ కంటే పెద్ద నగరం. 1901 నుంచి 1931 వరకూ జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

3, జులై 2014, గురువారం

ఇది సర్ప ద్వీపం!



ఇది సర్ప ద్వీపం!
Updated : 7/3/2014 1:28:26 AM
Views : 621
-ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములకు నెలవు
-మనిషి మాంసం, కండరాలను అమాంతం కరిగించేయగల విషం

సావోపౌలోబెజిల్),
జూలై 2: సాధారణంగా ఏ ద్వీపంలోనూ పాములుండవు. కానీ ఈ ద్వీపం మాత్రం
ప్రత్యేకం. ప్రపంచంలోనే అత్యంత విషసర్పాలకు నిలయంగా భాసిల్లుతోంది.
బ్రెజిల్ సావోపౌలో తీరప్రాంతం నుంచి 32కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి పేరు
ఇల్హా డే క్వీమదాగ్రాండే. కేవలం 4630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ
ద్వీపంలో అడుగు అడుగుకో ప్రమాదకరమైన విషసర్పం ఉంది. ముఖ్యంగా గోల్డెన్
లాన్స్‌హెడ్ వైపర్‌గా పిలిచే పాము అత్యంత ప్రమాదకరమైంది. ఏ పాము అయినా
కాటేస్తే.. దాని విషప్రభావం చూపడానికి కొన్ని గంటల నుంచి రోజుల సమయం
పడుతుంది. కానీ ఈ పాము మనుషులను కాటేస్తే.. నిమిషాల వ్యవధిలో మాంసం,
కండరాలను మొత్తం యాసిడ్ మాదిరిగా కరిగించి వేస్తుంది. ఈ పాములు ఈ దీవిలో
తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. ఈ జాతికి చెందిన పాములు బ్రెజిల్‌లో కూడా
ఉన్నప్పటికీ భౌతికంగా వాటికీ, ద్వీపంలోని పాములకు చాలా తేడాలున్నాయి.
ముఖ్యంగా చాలా ఏళ్లు ఈ పాములు ఒంటరిగా మానవ, జంతు సంచారం లేని దీవుల్లో
ఉండడంతో వీటి విషం చాలా ప్రమాదకరంగా తయారైంది. ఈ పాముల ప్రధాన ఆహారం
పక్షులు.

islandఇతర
ప్రాంతాలకు వలసవెళ్లే పక్షులు ఈ ద్వీపంలో విశ్రాంతి కోసం ఆగుతాయి. ఈ
పాములకు ఆ పక్షులే ప్రధాన ఆహారం. గాలిలో ఎగిరే పక్షులను తక్షణం చంపేందుకు
వీలుగా వీటి విషం అంత ప్రమాదకరంగా తయారైందని నిపుణులు పేర్కొంటున్నారు.
విహారయాత్రల కోసం దీవికివెళ్లే బ్రెజిల్‌వాసులు పాముకాటుకు గురై
చనిపోతుండడంతో ఈ దీవిని సందర్శించడం నిషేధమని బ్రెజిల్ ప్రకటించింది.
1909లో ఇక్కడ నిర్మించిన ఆటోమేటిక్ లైట్‌హౌజ్ మరమ్మతులకు అప్పుడప్పుడు నేవీ
సిబ్బంది మాత్రమే ఈ దీవికి వచ్చిపోతుంటారు. దీవి గురించి బయట ప్రపంచానికి
తెలిశాకే ఇక్కడి గోల్డెన్ లాన్స్‌హెడ్ వైపర్‌లు ప్రమాదంలో పడ్డాయి. కొందరు
వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా దీవికి వచ్చి వీటిని పట్టుకుని
బ్రెజిల్‌లో అమ్ముతున్నారు. ఒక్కో పాము ధర సుమారు 30వేల డాలర్ల ధర
పలుకుతుండడంతో వీటి వేట సర్వసాధారణమైపోయింది. గత కొన్నేళ్లలో పాముల సంఖ్య
15శాతానికి పడిపోయింది.

ఆకాశ వీధిలో జీవించవచ్చా ?

మీరు వేసవి సెలవుల్లో చల్లని వెన్నెల కోసం వేచి చూడాక్కర్లేదు. ఏకంగా ఆ జాబిలి మీదికే టూర్ వేయొచ్చు. శ్రీహరికోటలో రాకెట్ ఎక్కి చందమామ మీద దిగొచ్చు. అక్కణ్ణుంచి ఓ బస్సెక్కి పెద్ద ఉల్కాబిలం పక్కనే ఉన్న రిసార్ట్ లో బస చేయొచ్చు. మీ పార్ట్ నర్ తో ఓ వారం రోజులు సరదాగా గడపొచ్చు.
జాబిలి.. ఈ పేరులోనే ఏదో రొమాంటిక్ టచ్. ప్రియురాలు అడిగిందని నెలవంకని తెచ్చి ఆమె జడలో తురమలేక పోవచ్చు. కానీ తనకు సర్ ఫ్రైజ్ ఇచ్చేందుకు ఆ నెలవెంక మీదకే తీసుకెళ్లొచ్చు. పిల్లాడు మారాం చేస్తే అమ్మ ఇక ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అంటూ పాడాక్కర్లేదు. అద్దంలో చూపించి ఆశ పెట్టక్కర్లేదు. ఆ చిన్నారిని నేరుగా ఆ వెన్నెల రేడు మీదికే తీసుకెళ్లొచ్చు. చందమామలో ఆ మచ్చేంటి? ఆ నీలాకాశంలో ఏముంది? కొన్ని యుగాల నుంచి అవి మనిషి ఆలోచనలను ఆక్రమించుకున్నాయి. అంతులేని ఈ అంతరిక్షంలో ఎన్నో చిక్కు ప్రశ్నలు.. వాటిని తెలుసుకునేందుకు మనిషి ఆరాటపడుతూనే ఉన్నాడు. చంద్రుడు మామ కాడు.. పిలిస్తే రాడు అని మనిషికి తెలిసిపోయింది. అందుకే తానే జాబిల్లి వైపు అడుగులు వేశాడు. చందమామకి దగ్గరయ్యాడు.
చంద్రుని మీదికి ఎలా వెళ్లాలో మనిషికి తెలిసింది. అంతరిక్షంలో విహరిస్తే కలిగే అనుభూతి అర్థమయింది. ఆ అనుభవం అందరికీ కలిగించాలనే కమర్షియల్ థాట్ కూడా వచ్చింది. అందుకే మనిషిప్పుడు అంతరిక్షంలో హోటళ్లు కట్టాలనుకుంటున్నాడు. చంద్రునిపై కాలనీలు నిర్మించాలనుకుంటున్నాడు. నమ్మట్లేదు కదూ? అవి ఎలా ఉంటాయో చూపిస్తే నమ్ముతారా? అయితే రండి. ఈ టైమ్ మెషీన్ ఎక్కండి. కాసేపు భవిష్యత్తులోకి తీసుకెళ్తాం.
ఇది మనిషి అంతరిక్షంలో నిర్మించిన ఒక హోటల్. ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు మీరు పొందని ఓ గొప్ప అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మనమిప్పుడు భూమికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఆరువందల కిలోమీటర్లేనా అని తీసి పారేయకండి. హైదరాబాద్ నుంచి ముంబై ఉదయం బయలుదేరి మధ్యాహ్ననికి చేరుకున్నంత సులభం కాదు ఇక్కడికి రావడం. మీరిప్పుడు టైమ్ మెషీన్ లో భవిష్యత్తులోకొచ్చారు. కానీ మీ చుట్టు పక్కలవారింకా 2013లోనే ఉన్నారు. వారి అంతర్జాతీయ విమానాలు ఎగిరే ఎత్తు కేవలం 30 నుంచి 35 వేల అడుగులు మాత్రమే. కానీ ఈ రోదసీలోకి రావాలంటే.. భూమికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మన్ రేఖ దాటి రావాలి. ఇప్పుడిక్కడ భార రహిత స్థితి ఉంటుంది. మనిషయినా వస్తువైనా ఇక్కడ తేలియాడుతూ కనిపించాల్సిందే. ఇక్కడ మనం నడవడం అంత సులభం కాదు. కానీ ఈ హోటల్ భూమికి ఆరువందల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి భార రహిత స్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది నిమిషానికి ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి గురుత్వాకర్షణ శక్తిలో మూడో వంతు శక్తిని సృష్టించుకుంటుంది.
చందమామ మీద మనుషులన్నారు.. హోటళ్లు.. రిసార్టులు అన్నారు. ఇక్కడే ఆపేశారేంటి? అనుకుంటున్నారా? ఆరు వందల కిలోమీటర్ల వద్దే ఇలా ఉంటే.. చంద్రుడు మనకు మూడు లక్షల 84 వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? రండి ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్దాం.
సూర్యుడి తర్వాత ఆకాశంలో రెండో ప్రకాశవంతమైన బింబం చంద్రుడే. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఆరోవంతు మాత్రమే. భూమికి వలే చంద్రుడి మీద వాతావరణం లేదు. చంద్రుడి ఉపరితలాన్ని సూర్యరశ్మి నేరుగా తాకడం వల్ల పగటి పూట చంద్రుడి మీద ఉష్ణోగ్రత 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. పగలు తాను గ్రహించిన సూర్యరశ్మిలో 95 శాతం కాంతిని చంద్రుడు పరావర్తనం చెందిస్తాడు. అందువల్ల రాత్రిపూట చంద్రుడి ఉపరితలం చాలా చల్లగా ఉంటుంది. ఒక్కోసారి ఉష్ణోగ్రత మైనస్150 డిగ్రీలకు కూడా పడిపోతుంది. ఉష్ణోగ్రతల్లో ఇలాంటి హెచ్చు తగ్గులను తట్టకుంటూ మనిషి ఇక్కడ జీవించొచ్చని నలభై యాభై సంవత్సరాల క్రితమే ఊహించాడు. కథలు రాసుకున్నాడు. సినిమాలు తీశాడు. ఇప్పుడు ఆ కలలు నిజం కాబోతున్నాయి.మనిషిక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. కాలనీలు కట్టుకోనున్నాడు. మైనింగ్ కాంట్రాక్టులూ తీసుకోనున్నాడు.హోటళ్లు నిర్మించుకుంటాడు. స్పేస్ ఎస్టేట్ డెవలప్ చేయబోతున్నాడు. రేపు ప్లాట్లు కూడా చేసి అమ్మేస్తాడు. ఆ రోజు మరెంతో దూరంలో లేదు.
మనిషి ఆశ అంతులేనిది. ఈ అంతరిక్షం అంతం లేనిది. అది అనాదిగా మనిషిని ఆకర్షిస్తూనే ఉంది. తనలో నిగూఢమైన వింతలూ,విశేషాలతో చంద్రుడు కూడా మనిషిని ఊరిస్తూనే ఉన్నాడు. ఆ అంతరిక్షంలో విహరించాలని.. ఆ వెన్నెల రేడును అందుకోవాలని శతాబ్దాలుగా తహతహలాడిన విశ్వమానవాళి కలలు ఎలా సాకారమయ్యాయి. అది తెలుసుకోవాలంటే.. మనం మళ్లీ వెనక్కి వెళ్లాలి.
డెన్నిస్ టిటో అనే మల్టీ మిలియనేర్ ప్రపంచంలోనే తొలి స్పేస్ టూరిస్ట్ అయ్యాడు. టిటో రష్యా సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్లి అంతరిక్షంలో వారం రోజుల పాటు గడిపాడు. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కువ కాలం ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే గడిపాడు. ఇందుకోసం టిటో 20 మిలియన్ల డాలర్లు వెచ్చించాడు. ఆ తర్వాత ఏడాదికి సౌత్ ఆఫ్రికాకు చెందిన బిజినెస్ మ్యాన్ మార్క్ షటిల్ వర్త్, 2005లో అమెరికాకు చెందిన గ్రెగ్ హోల్సెన్ కూడా అంతరిక్ష యాత్రకి వెళ్లారు. 2006లో ఇరాన్ కు చెందిన అనౌహె అన్సారీ అనే టెలీ కమ్యూనికేషన్స్ వ్యాపారి అంతరిక్ష పర్యటనకు వెళ్లి తొలి మహిళా స్పేస్ టూరిస్ట్ గా ప్రసిద్ధికెక్కారు.
ప్రపంచంలో ఏదో కొంత మంది మాత్రమే అనుభవించిన అనుభూతిని మీరూ పొందాలను కుంటున్నారా? మనిషి కొత్తదనం కోరుకుంటాడు. కొత్త ప్రాంతాలను చూడడానికి ఇష్టపడతాడు. కొత్త అనుభూతిని పొందేందుకు ఉత్సాహం చూపుతాడు. అలాంటి ఓ అద్భుత అనుభూతిని కల్పిస్తోంది ఈ అమెరికన్ కంపెనీ.
భార రహిత స్థితి వల్ల రోదసీలో తేలిపోయే అనుభూతి కలుగుతుంది. మీరూ ఆ భార రహిత స్థితిలోకి వెళ్లాలనుకుంటే ముందు అమెరికా వెళ్లాలి. ఎందుకంటే జీరో-జీ సంస్థ అక్కడే ఈ సేవలు అందిస్తోంది. ఒక్కో టికెట్ ధర ఐదు వేల డాలర్లు. నిజమైన అంతరిక్ష ప్రయాణానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రాను రాను ఈ విమానాలకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రేటు కూడా తగ్గవచ్చు. బోయింగ్ 727 విమానానికి కొన్ని మార్పులు చేసి ఈ భార రహిత పర్యటనకి వాడుతున్నారు. 24 నుంచి 34 వేల అడుగుల మధ్య విమానాన్ని 45 డిగ్రీల కోణంలో పైకీ కిందికీ నడపడం వల్ల జీరో-జీ ఫీలింగ్ కలుగుతుంది.
ఇలా అంతరిక్షంలో విహరించినట్లు అనుభూతిని కాదు నిజంగా రోదసీలోనే విహరించాలని ఆశ పడుతున్నారా? ఆ ఆశని క్యాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. స్పేస్ హోటళ్ల రూపకల్పనకు ప్రణాళికలు రాసుకుంటున్నాయి.అందుకే మీ కల నిజమయ్యే సమయం మరెంతో దూరంలో లేదు.
ఇక మీరు ఊటీ, కొడైకెనాల్ వెళ్లి వచ్చినంత సింపుల్ గా అంతరిక్షంలోకి వెళ్లిరావొచ్చు. అక్కడి హోటల్ లో టిఫిన్ చేయొచ్చు. ఇంకాస్త ఖర్చు చేస్తే ఆ హోటల్ నుంచి బయటికి వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ జీరో గ్రావిటీని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే స్పేస్ టూరిజం అతి త్వరలోనే గ్రాండ్ టేకాఫ్ తీసుకోబోతోంది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు చాలా కంపెనీలు నిధులు సమకూర్చుకుంటున్నాయి. రానున్న ఒకటి రెండు దశాబ్దాలలో వీటిని రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ ప్రయివేటు టూరిస్ట్ ఫ్లైట్లను స్పేస్ లోకి పంపేందుకు ప్లాన్ చేస్తోంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్ స్థాపకుడైన రిచర్డ్ బ్రాన్సన్ 2009 చివరి నుంచి ఈ విషయమై తరచుగా ప్రకటిస్తూనే ఉన్నారు. వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించబోయే అంతరిక్ష విహారానికి ఒక మనిషికి దాదాపు 2 లక్షల అమెరికన్ డాలర్లు అంటే సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పటికే 500 మంది టికెట్లు కొనేశారు. ఈ కంపెనీ వెబ్ సైట్లో ఇంకొన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారిలో నలుగురు భారతీయులూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పేస్ ఐల్యాండ్ గ్రూప్ అనే మరో కంపెనీ గుండ్రంగా చక్రంలా ఉండే కమర్షియల్ స్పేస్ హోటల్ ని నిర్మించాలని చూస్తోంది. భూమికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అంచనా. నిమిషానికి ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి గురుత్వాకర్షణ శక్తిలో మూడో వంతు శక్తిని ఇది సృష్టించుకుంటుంది. ఇలాంటి హోటల్ లో విడిది పొందడం ఒక గొప్ప అనుభూతి కదా.
చంద్రునిపై ఏకంగా రెస్టారెంట్లను ఏర్పాటు చేసి వేడి వేడి పిజ్జాలను వడ్డించాలని డొమినోస్ పిజ్జా కంపెనీ వినూత్న ప్యాకేజీని రూపొందిస్తోంది. డొమినోస్ కంపెనీ రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాబోయే కాలంలో మానవ సమూహాలు చంద్ర మండలంపై ఆవాసం ఉంటాయన్న ఏకైక నమ్మకమే ఈ ప్రాజెక్టుని నడిపిస్తున్నాయట. స్పేస్ రీసెర్చ్ పెరుగుతూ ఉండడంతో అంతరిక్ష యాత్రికుల అవసరాలు కూడా పెరుగుతాయన్నది మరో లాజిక్. చంద్రునిపై పిజ్జా సెంటర్ ఏర్పాటు చేయడమంటే కచ్చితంగా కొంతమంది సిబ్బంది అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకే చంద్రునిపై ఉద్యోగం చేసేవారి కోసం కంపెనీ ఇప్పటి నుంచే ఆరా తీస్తోంది. యూకేకి చెందిన ‘ప్రీమియర్ ఇన్’ అనే బ్రాండెడ్ ఫైవ్‌స్టార్ హోటల్ ఏకైక లక్ష్యం ఫస్ట్ ఎవర్ హోటల్ ఆన్ ది మూన్. 43,500 చదరపు అడుగుల స్థలంలో చందమామ మీద హోటల్ కట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు.. ఈ హోటల్ ఎమ్‌డీ పత్రిక్ డెమ్సీ చెబుతున్నారు. ఇందుకోసం డిజైనర్లు, ఇంజినీర్లు బ్లూప్రింట్స్ కూడా రెడీ చేస్తున్నారట. హిల్టన్ అనే కంపెనీది కూడా ఇదే లక్ష్యం.చంద్రునిపైన కాకున్నా అంతరిక్షంలో కనీసం ఒక శాటిలైట్‌లా ఒక హోటల్ నిర్మించాలని ‘హిల్టన్’ భావిస్తోంది. 
ఒకప్పుడు చంద్రునిపై కాలు మోపడం ఒక కల. కానీ ఇప్పుడది నిజమైంది. చంద్రుడు మనిషికి మరింత దగ్గరయ్యాడు. అంతటితో సంతృప్తి పడితే అతడు మనిషి ఎందుకవుతాడు? అతని ఆశ అంతులేనిది. హోటళ్లు కట్టాలనుకుంటున్నాడు. స్పేస్ టూరిజం పెంచాలనుకుంటున్నాడు. కానీ ఇది అనుకోగానే సాధ్యమయ్యే పని కాదు. అందుకోసం శాస్త్రవేత్తలు ఎన్నోముమ్మర యత్నాల చేశారు. చేస్తూనే ఉన్నారు. దీని ఆరంభం అర్థమవ్వాలంటే మనం ఇప్పుడు గతంలోకి వెళ్లాల్సిందే.
యూరీ గగారిన్.. అంతరిక్షయానం తర్వాత, మనిషి భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించడానికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. మరెన్నో మెళకువలు నేర్చుకున్నాడు. కానీ అతని లక్ష్యం అంతేనా? కానే కాదు. ఇంకా ఏదో కావాలి. అంతరిక్షం మీద పట్టు సాధించాలి. సుదూర తీరాల్లోని గ్రహాలను చూడాలి. తోక చుక్కలను అధ్యయనం చేయాలి. చంద్రుని మీదికి వెళ్లాలి. తన కలలను సాకారం చేసుకోవాలి.
యూరీ గగారిన్ తర్వాత.. ఘెర్మాన్ టిటోవ్ అనే కాస్మోనాట్ దాదాపు 25 గంటల పాటు అంతరిక్షంలో గడిపాడు. ఈయన ఏకంగా భూమిచుట్టూ మొత్తం 17 సార్లు చక్కర్లు కొట్టాడు. వోస్కోడ్-2లో వెళ్లిన అలెక్సీ లియొనోవ్ ఏకంగా ఉపగ్రహం నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ వరుస ప్రయత్నాలతో అంతరిక్షం మీద రష్యా సాధిస్తున్నవిజయాలు అమెరికాకు మింగుడు పడలేదు. దీంతో రష్యా, అమెరికాల మధ్య అంతరిక్ష పోటీ మొదలయ్యింది. అప్పటి యూఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడి, ఆ దశాబ్దం చివర్లో చంద్రుడిపైకి మానవుడిని పంపుతామని ప్రకటించారు. అగ్రదేశం అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదు. ఆ రోజు రానే వచ్చింది...
జూలై 20, 1969
అమెరికా అనుకున్నది సాధించింది. మరో మైలురాయిని దాటింది. నీల్‌ ఆర్మ్ స్ట్రాంగ్‌ జాబిలి మీద కాలు పెట్టాడు. మనిషి తొలిసారి చంద్రుని మీద పెట్టిన అడుగు. ఆ అడుగు చిన్నదే కావొచ్చు. కానీ అది సమస్త మానవాళికి గొప్ప ముందడుగు. మానవుడి పరిధిని,భవిష్యత్తుపై ఆశల్ని గ్రహాంతరాల్లో చాటి చెప్పిన తొలి అడుగు. విశ్వాంతరాల పరిశోధనాన్వేషణలో అరుదైన, అద్భుత ముద్ర వేసి శాస్త్రీయ ఆలోచనలకు, పరిశోధనలకు కావాల్సినంత స్ఫూర్తిని, విశ్వాసాన్ని మానవాళి మస్తిష్కాల్లో నింపిన అడుగు.
ఆ అడుగు అంతటితో ఆగలేదు. మనిషి ఆశ అంతటితో చావలేదు. ఈ అంతరిక్షంలో లెక్కనేనంతగా విహరించాలి. కుదిరితే చంద్రునిపై కాలనీలు కట్టుకుని నివసించాలి. జీవం ఆనవాళ్లు దొరికితే.. అరుణ గ్రహం మీద కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇతర గ్రహాల మీద ఉన్న అవకాశాలు కూడా వెతకాలి. కల మళ్లీ మొదటికొచ్చింది. కథనం మళ్లీ ప్రారంభమైంది.
అప్పటి వరకు వ్యోమనౌకలు ఒక్కసారి వాడేందుకు మాత్రమే ఉపయోగపడేవి. దీనికి ప్రత్యామ్నాయం లేదా? ఒకసారి వినియోగించిన నౌకని మరోసారి వాడలేమా? అనే ఆలోచనలతో అంతరిక్ష యానంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది.ఇందుకోసం నాసా 1972 నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక వ్యోమనౌకని తిరిగి వాడే విధంగా రూపొందించడం అది పెద్ద సవాల్ గా భావించింది.
ఏప్రిల్ 12, 1981
తొమ్మిదేళ్ల ప్రయోగాల తర్వాత నాసా కల నెరవేరింది. అది రూపొందించిన స్పేస్ షెటిల్ ని ఒక్కసారి కాదు.. తిరిగి వందసార్లయినా వాడొచ్చు. దీంతో అంతరిక్షయానానికి అయ్యే ఖర్చు తగ్గించుకునే వీలు ఏర్పడింది. ఆ తర్వాత రూపొందిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొత్త ఆశలు రేపింది. ఇది భూమికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొక పరిశోధనా కేంద్రం మాత్రమే కాదు మనిషి చేరుకున్న ఒక గమ్యస్థానం. అతని ఆశలకు ఆయువు పోసే ఒక ఆధారం అయింది. దీన్ని మరింత వాడుకుంటే వ్యోమగాములనే కాదు.. సామాన్య మానవులను కూడా అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లొచ్చు.
ప్రయివేటీకరణ పరిణామాలు పాయిటివ్ అయినా.. నెగెటివ్ అయినా మానవ జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ లాభం పెట్టుబడి పెట్టిన ఏ కంపెనీదైనా మనిషి జీవితంలో మార్పు మాత్రం సహజం. అలాంటి ఒక మార్పు కోసం అంతరిక్షాన్ని ప్రయివేటీకరిస్తే ఎలా ఉంటుంది? ఒక కమర్షియల్ థాట్. అంతరిక్షయాన యోగం కోసం ఎంతైనా ఖర్చుచేసేవారు ఉన్నారా?
ఎవరైనా పెట్టుబడి పెట్టే ముందు ఒక ప్రైమరీ రూల్ ఫాలో అవుతారు. ‘వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేసి ఎవరూ వ్యాపారం చేయరు. నిజమే.. కోట్లకు కోట్లు ఖర్చు చేసి అంతరిక్షంలో హోటల్ కడితే అతిథులు రాకపోతే? ఆదాయం అందకపోతే..దుకాణం మూసుకోవాల్సిందేనా? లేనే లేదు. ‘గెలాక్టిక్ సూట్’ పేరుతో స్పేస్ హోటల్‌కు ప్లాన్ చేస్తున్న గ్జేవియర్ క్లారామంట్ ఒక అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది స్పేస్ హోటల్‌లో గడిపేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి ఇంకేం? మొదలెట్టొచ్చుగా... అంటే.. చంద్రునిమీద, అంతరిక్షంలో ప్రతికూలతలు, అనుకూలతలూ ఉన్నాయి. వాటి మీద పూర్తిగా అధ్యయనం జరగాలి. ఫలితాల్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడు హోటల్ కట్టాలి. అప్పడు మీరు అక్కడ కాలెట్టాలి.
ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు